Begin typing your search above and press return to search.

కొత్త జిల్లాల చిక్కుముడులు మామూలుగా లేవుగా?

By:  Tupaki Desk   |   27 Jan 2022 7:31 AM GMT
కొత్త జిల్లాల చిక్కుముడులు మామూలుగా లేవుగా?
X
ఏపీ ప్రభుత్వం ప్రకటించిన కొత్త జిల్లాల నిర్ణయం తికమకగా మారింది. కొత్త గందరగోళానికి తెర తీసింది. సంబంధం లేని అంశాల్ని కలుపుతూ కొత్త జిల్లాలుగా నిర్ణయించటాన్ని తప్పు పడుతున్నారు. అందుకు ప్రతి జిల్లా ప్రభావితమైందని చెబుతున్నారు. దీనికి సంబంధించి పలు జిల్లాల్లో చోటు చేసుకున్న అంశాల్ని ప్రస్తావిస్తున్నారు. కొన్ని ప్రధానమైన అంశాల్ని చూస్తే..


- తిరుపతి పార్లమెంటు పరిధిలో సర్వేపల్లి.. గూడూరు.. వెంకటగిరి.. సూళ్లూరుపేట నియోజకవర్గాలు ఉన్నాయి. జిల్లాల విభజన ప్రకారం నెల్లూరు పార్లమెంటులోని అన్ని నియోజకవర్గాలతోపాటు తిరుపతి పార్లమెంటులోని సర్వేపల్లిని నెల్లూరు జిల్లాలో కలిపారు. గూడురు.. వెంకటగిరి.. సూళ్లూరుపేటలను తిరుపతిలో కలపాలని ప్రతిపాదించారు. అయితే.. ఇందులో ఉన్న పలు సమస్యల్నిప్రస్తావిస్తున్నారు. గూడూరు పట్టణం నెల్లూరుకు 30కి.మీ. దూరంలో ఉండగా.. తాజాగా దాన్ని తిరుపతి జిల్లాలోకి చేర్చటంతో వంద కిలోమీటర్లకు పెరిగినట్లైంది.

- అంతేకాదు నెల్లూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న రావూరు మండలం.. ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని కలువాయి మండలాలు తిరుపతి జిల్లాలో కలవనున్నాయి. మనుబోలు మండలం సర్వేపల్లి నియోజకవర్గంలో ఉన్నప్పటికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న గూడురుతో ఎక్కువ అనుబంధం ఉందని చెప్పాలి.

- కొత్త జిల్లాల పేరుతో చిత్తూరు జిల్లాను మూడు ముక్కలు చేసే ప్రక్రియపై అభ్యంతరాలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. చిత్తూరు లోక్ సభ పరిధిలో చిత్తూరు.. నగరి.. జీడీ నెల్లూరు.. పూతల పట్టు.. పలమనేరు.. కుప్పం.. చంద్రగిరి సెగ్మెంట్లు ఉండగా.. చంద్రగిరిని తిరుపతి జిల్లా పరిధిలో చేర్చారు. మున్సిపల్ పట్టణంగా యాభై ఏళ్లు చరిత్ర ఉన్న శ్రీకాళహస్తిని ఎంతో చిన్నదైన నాయుడుపేట డివిజన్ లో చేర్చటాన్ని తప్పుపడుతున్నారు.

- అన్నమయ్య జిల్లాకు మదనపల్లెను కేంద్రంగా ప్రకటించాలని కోరుతున్నారు. ఇప్పుడు అన్నమయ్య జిల్లా పేరుపెట్టి కడప జిల్లా రాయచోటిని జిల్లా కేంద్రంగా చేయటాన్ని మదనపల్లి వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజంపేట నియోజకవర్గ ప్రజలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్నమయ్య పుట్టిన గడ్డను కాదని.. ఎక్కడో ఉన్న రాయచోటిని జిల్లా కేంద్రం చేయటం ఏమిటి? అని ప్రశ్నిస్తున్నారు.

- ఒంగోలుకు 45 కి.మీ. లోపు ఉండే కందుకూరును దాదాపు 115 కి.మీ. దూరంలో ఉన్న నెల్లూరు జిల్లాలో కలిపారు. రాష్ట్రంలో అతి పెద్ద డివిజన్లలో రెండోదైన కందుకూరు డివిజన్ తాజా ప్రతిపాదనలతో పూర్తిగా రద్దు కానుంది. కందుకూరు నియోజకవర్గం కావలి డివిజన్ లో కలవనుంది.

- ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలుకు 100 -150 కి.మీ. దూరంలో ఉన్న మర్కాపురం డివిజన్ లోని 12 మండలాలతో పాటు కనిగిరి నియోజకవర్గంలోని పలు మండలాలు ఒంగోలు పార్లమెంటుపరిధిలో ఉన్నాయి. వాటిని ఒంగోలు జిల్లాలోనే ఉంచారు. ఎప్పటి నుంచో మార్కాపురం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఉంది. అదేమీ పట్టించుకోకపోవటంపై గుర్రుగా ఉన్నారు. ఒంగోలుకు కేవలం 45 కి.మీ. దూరంలో ఉండే కందుకూరును దాదాపు 115 కి.మీ. దూరంలో ఉన్న నెల్లూరు జిల్లాలో కలపటాన్ని తప్పు పడుతున్నారు.

- గుంటూరు జిల్లాను గుంటూరు.. బాపట్ల.. పల్నాడు జిల్లాలుగా విభజించాలన్న ప్రతిపాదన తెలిసిందే. పల్నాడు జిల్లా కేంద్రంగా నరసరావుపేటను ప్రతిపాదించటాన్ని పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పల్నాడు అన్నంతనే గురజాల.. మాచర్ల అని భావిస్తారు. ఈ రెండు చోట్లలో ఎక్కడైనా జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అందుకు భిన్నంగా నరసరావుపేటను కేంద్రంగా ప్రకటించటం ఏమిటన్న అభ్యంతరం వ్యక్తమవుతోంది.

- అమరావతి మండలానికి చెందిన ప్రజలు ఆర్డీవో ఆఫీసుకు వెళ్లాలన్నా.. కలెక్టర్ కార్యాలయానికి వెళ్లాలన్నా 125కి.మీ. దూరంలో ఉన్న గురజాలకు వెళ్లాల్సి ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం 35కి.మీ. దూరంలో ఉన్న గుంటూరు వదిలేసి మారుమూలన ఉండే గురజాలకు వెళ్లటం చాలా ఇబ్బందిగా మారుతుందంటున్నారు.

- బాపట్ల జిల్లా విషయానికి వస్తే.. ప్రకాశం జిల్లాకు చెందిన నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్ని పూర్వ గుంటూరు జిల్లాలో భాగమైన బాపట్లలో చేర్చటాన్ని తప్పుపడుతున్నారు. పూర్వ ప్రకాశం జిల్లా వాసులుగా తమకున్న ఉనికి కాదని.. తీసుకెళ్లి పూర్వ గుంటూరు జిల్లాలో భాగమైన బాపట్లలో తమను కలపవటం ఏమిటన్న అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు