Begin typing your search above and press return to search.

సీన్ రివర్స్ : ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటున్న సీమ జిల్లాలు!

By:  Tupaki Desk   |   22 May 2022 2:30 AM GMT
సీన్ రివర్స్ :  ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటున్న సీమ జిల్లాలు!
X
రాయలసీమ నాలుగు జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలను గ్రాండ్ రాయలసీమగా అభివర్ణిస్తారు. నిజానికి దక్షిణ కోస్తా జిల్లాలో ప్రకాశం, నెల్లూరు పేరుకు ఉన్నాకూడా రాయల‌ సీమ ఒరవడితోనే అవి సాగుతాయి. అక్కడ ఎన్నికల ఫలితాలు కూడా టోటల్ గా ఒకేలా ఉంటాయి. సీమ జనాల తీర్పు కూడా ఎపుడూ ఈ ఆరు జిల్లాలలో ఆసక్తికరంగా ఉంటుంది.

ఇక గ్రాండ్ రాయలసీమ జిల్లాలు మొదటి నుంచి వైసీపీని ఆదరిస్తూ వస్తున్నాయి. వైసీపీ పెట్టాక అక్కున చేర్చుకున్నవి ఈ జిల్లాలే. కడప నుంచి జగన్ తన రాజకీయ ప్రస్థానం మొదలుపెడితే ఆయన్ని సీఎం చేయాలన్న పట్టుదల ఆది నుంచి ఈ ఆరు జిల్లాలలోనే ఎక్కువగా కనిపించింది. ఇక 2014 ఎన్నికల్లో జగన్ పార్టీకి 67 సీట్లు వచ్చాయీ అంటే అందులో ఆరు జిల్లాల వాటానే అత్య‌ధికం,

ఇక వైసీపీని నాడు గట్టిగా దెబ్బకొట్టింది ఉత్తరాంధ్రా, కోస్తా జిల్లాలే. ఈ నేపధ్యంలో జగన్ పార్టీకి రిపేర్లు చేసుకుని ఆ జిల్లాలను కూడా ఒడిసిపట్టుకోవడంతో 2019 నాటికి బంపర్ మెజారిటీ సాధ్యమైంది. ఇదిలా ఉంటే ఇప్పటికి అనేక ఎన్నికల్లో పలు మార్లు ఆదరించిన సీమ జిల్లాలు ఫస్ట్ టైమ్ ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటున్నాయి అని అంటున్నారు.

ఈ జిల్లాలలో చూస్తే తెలుగుదేశానికి 1995 నుంచి పట్టు తగ్గుతూ వస్తోంది. ఎన్టీయార్ జమానాలో రాయలసీమ జిల్లాలు ఆ పార్టీకి కంచుకోటలుగా ఉండేవి, చంద్రబాబు ఏలుబడిలో మాత్రం అవి అలా మెల్లగా జారిపోతూ వచ్చాయి. అయితే 1999, 2014 ఎన్నికల్లో టీడీపీ గెలిచినా అందులో సీమ జిల్లాలలో స్వీప్ చేసేంత పరిస్థితి అయితే టీడీపీకి లేదు.

కానీ ఇన్నాళ్ళకు టీడీపీకి రాయలసీమ జిల్లాలలో వైభోగం సంప్రాప్తించే సూచనలు కనిపిస్తున్నాయి. సీమ జిల్లాలలో ఆదరిస్తే హత్తుకుంటారు. ఆగ్రహిస్తే తీసి పక్కన పెడతారు. ఇపుడు అలాంటి ధర్మాగ్రహమే వైసీపీ మీద కలిగింది అంటున్నారు. జగన్ సీఎం అయితే తన తండ్రి మాదిరిగా బ్రహ్మాండంగా పాలిస్తారు అనుకుంటే వారి ఆశలు అడియాశలే అయ్యాయని అంటున్నారు.

ఇక సీమ జిల్లాలలో సమస్యలు అన్నీ కూడా అలాగే ఉన్నాయి. సాగు నీటి ప్రాజెక్టుల కధ ఒక్క అంగుళం కూడా ముందుకు సాగలేదు, కొత్త ప్రాజెక్టులు చూస్తే అసలు లేవు, అభివృద్ధి ఊసు లేదు. దానికి తోడు అన్నట్లుగా భూ కబ్జాలు దారుణంగా పెరిగాయి. ఇక సీమ జిల్లాలలో వైసీపీ నేతల వర్గ పోరు కూడా అధికార పార్టీ స్పీడ్ కి అడ్డు కట్ట వేస్తోంది అంటున్నారు.

వారిలో వారే గ్రూపులు కడుతూ పార్టీని వీక్ చేస్తున్నారు అని అంటున్నారు. ఎవరి మీద ఎవరికీ పట్టు లేదు అని కూడా చెబుతున్నారు. ఇంకో వైపు భూ కబ్జాలు గతంలో కంటే దారుణంగా పెరిగిపోయాయి, కొందరు అధికారులు సైతం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు అన్న విమర్శలు ఉన్నాయి. ఎటు చూసినా అవినీతి తాండవిస్తోంది. సగటు జనాలకు ప్రభుత్వ ఆఫీసులలో ఏ కోశానా పనులు కావడంలేదు.

ఇంకో వైపు ప్రభుత్వం ఉచితంగా ఇళ్ళ పట్టలు ఇస్తోంది అని టముకు వేసుకుంటున్నారు కానీ అక్కడ వైసీపీ నేతలు కొన్ని చోట్ల అయితే ఇళ్ల పట్టాలు మేమే ఇప్పించామని చెబుతూ లబ్దిదారుల వద్ద నుంచి డబ్బులు వసూల్ చేసే కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. ఇలా అన్ని విధాలుగా విసిగిపోయి ఉన్న సీమ జనాలు వైసీపీ మీద పీక బండెడు కోపం పెంచుకున్నారు అని అంటున్నారు. మరి ఈ పరిణామాలు చూస్తే ఈసారి ఈ ఆరు జిల్లాలలో ఖాయంగా మూడు జిల్లాలు వైసీపీ నుంచి తెగిపోయి టీడీపీ ఖాతాలో పడతాయని అంటున్నారు.

అలా చూస్తే ప్రకాశం, కర్నూల్, అనంతపురం జిల్లాలు కచ్చితంగా ఈసారి పాతిక దాకా సీట్లను టీడీపీ గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.మొత్తానికి సీమ కనుక ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటే వైసీపీకి అధికారం మళ్ళీ దక్కడం అనుమానమే అంటున్నారు. మరి ఇప్పటి నుంచే పరిస్థితులను చక్కదిద్దుకోకపోతే మాత్రం ఫ్యాన్ తిరగడం ఆగిపోయినా పోవచ్చు అని అంటున్నారు.