Begin typing your search above and press return to search.

ఏపీ vs తెలంగాణ: పార్లమెంట్ లో ఫైట్

By:  Tupaki Desk   |   7 July 2021 6:30 AM GMT
ఏపీ vs తెలంగాణ: పార్లమెంట్ లో ఫైట్
X
కృష్ణా నదీ జలాల విషయంలో తెలుగు రాష్ట్రాల ఫైట్ పార్లమెంట్ కు చేరనుంది. ఇప్పటిదాకా తెలుగు రాష్ట్రాల్లో కొట్టుకున్న నేతలు ఇప్పుడు పార్లమెంట్ వేదికగా తలపడబోతున్నారు. న్యాయ అన్యాయాల సంగతి పక్కనపెడితే ఇప్పుడు జాతీయ స్థాయిలో తెలుగు రాష్ట్రాల నీటి వివాదం ప్రతిధ్వనించనుంది. ఎవరి వాదన కరెక్ట్? ఎవరి వాదన తప్పు అన్నది తేలనుంది.

కృష్ణా నదీ జలాల విషయంలో ఏపీ ప్రభుత్వం తీరుపై అభ్యంతరం తెలుపుతున్న టీఆర్ఎస్.. పార్లమెంట్ లో ఈ అంశాన్ని లేవనెత్తనుంది. జూలై 19 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ వర్షకాల సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రధానంగా లేవనెత్తాలని టీఆర్ఎస్ భావిస్తోంది.

అటు ఈనెల 9న జరిగే కేఆర్ఎంబీ సమావేశానికి దూరంగా ఉండాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. త్రిసభ్య కమిటీ భేటికి బదులు కేఆర్ఎంబీ పూర్తి సభ్యుల భేటిని జూలై 20 తర్వాత నిర్వహించాలని టీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది.

ఇక ఏపీ ప్రభుత్వం సైతం దీనిపై పార్లమెంట్లో పోరాడాలని డిసైడ్ అయ్యింది. తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం, నాగార్జున సాగర్ , పులిచింతల నుంచి విద్యుత్ ఉత్పత్తి పేరిట నీటిని వృథా చేస్తూ ఏపీకి తాగు, సాగునీటి కష్టాలు తెస్తోందని.. ప్రాజెక్టులను ఖాళీ చేస్తోందని కేంద్రం దృష్టికి పార్లమెంట్ లో తేవాలని డిసైడ్అయ్యింది. తమ వాదనతో తెలంగాణ ప్రభుత్వాన్ని కట్టడి చేసేలా పార్లమెంట్ లో వ్యూహరచన చేస్తోంది.

ఇలా రెండు రాష్ట్రాల నీటి ఫైట్ ఇప్పుడు పార్లమెంట్ లో ప్రతిధ్వనించడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఇప్పటికైనా కేంద్రప్రభుత్వం ఈ విషయంలో చొరవ తీసుకుంటుందా? తెలుగు రాష్ట్రాల జల వివాదాలను పరిష్కరిస్తుందా? అన్నది వేచిచూడాలి.