Begin typing your search above and press return to search.

మేం వెధవలమా? ఏపీ స్పీకర్ తమ్మినేని సతీమణి ఫైర్..

By:  Tupaki Desk   |   7 March 2021 8:30 AM GMT
మేం వెధవలమా? ఏపీ స్పీకర్ తమ్మినేని సతీమణి ఫైర్..
X
అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం భార్య తమ్మినేని వాణిశ్రీ ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ గా ఘన విజయం సాధించారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలంలోని తొగరాం పంచాయతీ సర్పంచ్ గా ఆమె ఇటీవల ప్రమాణ స్వీకారం చేశారు. ఆ పంచాయతీలోని తమ్మయ్యపేట గ్రామంలో తాజాగా పర్యటించారు.

ఈ క్రమంలోనే తమ్మినేని భార్య ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అందుతున్న మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు. నాణ్యత రహితంగా.. నామ్ కే వాస్తేగా అందుతోన్న భోజనం పట్ల ఆమె ఆగ్రహావేశాలను వ్యక్తం చేశారు. అప్పటికప్పుడు ఫోన్ లో సంబంధిత అధికారిపై నిప్పులు చెరిగారు.

అధికారులు ఫైవ్ స్టార్ హోటళ్లలో తింటూ పిల్లలకూ రుచి, పచిలేని ఆహారాన్ని అందజేస్తున్నారని తమ్మినేని వాణిశ్రీ ఆరోపించారు. విద్యార్థుల భోజనానికి ఏపీ ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంటే.. నాణ్యత లేని ఆహారాన్ని ఎందుకు సరఫరా చేస్తున్నారంటూ ఆమె మండిపడ్డారు.

విద్యార్థులకు ఇచ్చింది సాంబారా? నీళ్లా? అనేది అర్థం కావడం లేదని వాణిశ్రీ ఆరోపించారు. ‘మీ ఇంట్లో ఇలాంటి భోజనం తింటారా?’ అని అధికారులను ప్రశ్నించారు. వార్నింగ్ ఇచ్చినా కూడా తీరు మార్చుకోవడం లేదని.. తానే స్వయంగా అమరావతి వెళ్లి సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తానని ఆమె హెచ్చరించారు. పులిహోర, కిచిడి తిన్న విద్యార్థులకు వాంతులు అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.