Begin typing your search above and press return to search.

ప్రభుత్వ స్కూళ్లకు సంబంధించి దేశంలోనే మొదటి రాష్ట్రంగా ఏపీ రికార్డు!

By:  Tupaki Desk   |   7 Nov 2022 9:00 PM IST
ప్రభుత్వ స్కూళ్లకు సంబంధించి దేశంలోనే మొదటి రాష్ట్రంగా ఏపీ రికార్డు!
X
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం, సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) సిలబస్‌ను ప్రవేశపెట్టాలని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ గతంలోనే నిర్ణయించిన సంగతి తెలిసిందే. మాతృభాషను విస్మరించి ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టాలనుకోవడంపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. మాతృభాష బోధన విధానానికి ఏపీ ప్రభుత్వం తిలోదకాలు ఇస్తోందని విమర్శలు రేగాయి.

అయితే జగన్‌ ప్రభుత్వం ఈ విషయంలో ముందుకే వెళ్లింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం, సీబీఎస్‌ఈ విధానాన్ని ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రంగా ఏపీ రికార్డు సృష్టించింది.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు కలిపి దాదాపు 60 వేల పాఠశాలలున్నాయి. వీటిలో ఇప్పటివరకు 325 మాత్రమే సీబీఎస్‌ఈ స్కూళ్లు. అలాగే 55 స్కూళ్లు మాత్రమే ఇండియన్‌ సర్టిఫికెట్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (ఐసీఎస్‌ఈ) సిలబస్‌ను అనుసరిస్తున్నాయి. స్టేట్‌ సిలబస్‌ కంటే సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ సిలబస్‌లు స్టాండర్డ్‌ అనే అభిప్రాయం ఉంది.

ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్‌ఈ, ఇంగ్లిష్‌ మీడియం విధానాలు ప్రవేశపెట్టాలని జగన్‌ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో 2022–23 విద్యా సంవత్సరానికి, దాదాపు 1000 పాఠశాలలు సీబీఎస్‌ఈ గుర్తింపును పొందడం విశేషం. ఈ నేపథ్యంలో వచ్చే రెండు మూడేళ్లలో మిగిలిన ప్రభుత్వ స్కూళ్ల అన్నిటికి సీబీఎస్‌ఈ గుర్తింపును సాధించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

రాష్ట్ర విద్యా శాఖ సుమారు 1,300 పాఠశాలలకు సీబీఎస్‌ఈ గుర్తింపు ఇవ్వాలని ఆ బోర్డుకు దరఖాస్తు చేసుకుంది. వీటిలో 1000 పాఠశాలలకు సీబీఎస్‌ఈ గుర్తింపు లభించింది. తాజాగా ఈ విషయాన్ని పాఠశాల విద్యా కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ ధ్రువీకరించారు.

తాజాగా సీబీఎస్‌ఈ గుర్తింపు లభించిన 1000 ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి ఎనిమిదో తరగతి నుంచి సీబీఎస్‌ఈ సిలబస్‌ ఉంటుందని ఆయన సురేష్‌ కుమార్‌ తెలిపారు.

కాగా ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌లో సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ పాఠశాలలు నగరాలకు మాత్రమే పరిమితమయ్యాయి. అవి కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థలైన జవహర్‌ నవోదయ విద్యాలయాలు, కేంద్రీయ విద్యాలయాలు, రక్షణ దళం, నౌకాదళాలకు సంబంధించిన విద్యా సంస్థలకే సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ పరిమితమయ్యాయి.

ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్‌ఈ విధానాన్ని ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో 1000 ప్రభుత్వ పాఠశాలలకు సీబీఎస్‌ఈ అనుమతులు మంజూరు చేసింది. ఈ 1000 పాఠశాలల్లో సీబీఎస్‌ఈ విధానం అమల్లోకొస్తుంది.

ఇప్పుడు అఖిల భారత స్థాయిలో జరుగుతున్న జేఈఈ, నీట్‌ వంటి పరీక్షలన్నీ సీబీఎస్‌ఈ సిలబస్‌ విధానం మేరకే జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్టేట్‌ సిలబస్‌తో పరీక్షలు రాస్తున్న విద్యార్థులు జాతీయ స్థాయి పరీక్షల్లో కొంత నష్టపోతున్నారన్న భావన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఎనిమిదో తరగతి నుంచే వీరంతా సీబీఎస్‌ఈ విధానంలో చదువుతుండటంతో జాతీయ స్థాయి పరీక్షల్లోనూ రాష్ట్ర విద్యార్థులకు ఇబ్బందులు తొలగుతాయని భావిస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.