Begin typing your search above and press return to search.

దిశ యాప్‌కు వస్తున్న ఫిర్యాదుల్లో ఆ కేసులే అధికం ..ఏవంటే !

By:  Tupaki Desk   |   14 Feb 2020 8:15 AM GMT
దిశ యాప్‌కు వస్తున్న ఫిర్యాదుల్లో ఆ కేసులే అధికం ..ఏవంటే !
X
దిశ యాప్ .. ఆపదలో ఉన్న ఏ మహిళా అయిన ఆ యాప్ లో ఒక్కసారి క్లిక్ చేస్తే నిమిషాల వ్యవధిలో వచ్చి , వారిని కాపాడటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన సరికొత్త యాప్. చేతిలోని మొబైల్‌ ఫోన్‌ మూడు సార్లు ఊపటం (షేక్‌ చేయటం) ద్వారా తాము సమస్యలో ఉన్నట్లు దిశ కంట్రోల్‌ రూమ్‌ కు సిగ్నల్ వెళ్తుంది. దీనితో వెంటనే దిశ టీం రంగంలోకి దిగి సిగ్నల్ ని ట్రేస్ చేసి , వారిని రక్షిస్తారు. తెలంగాణ లో జరిగిన దిశ ఉదంతం తరువాత ఏపీ ప్రభుత్వం దీనిపై సమగ్ర కసరత్తు చేసి , రాష్ట్రంలోని మహిళలకి పుర్తి భరోసాని కల్పించడానికి ఈ యాప్ ని తీసుకొచ్చింది. ఈ యాప్ ప్రస్తుతం ఏపీలో అందుబాటులో ఉంది. అయితే , ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే .. దిశ యాప్‌ కు ప్రస్తుతం వస్తున్న ఫిర్యాదుల్లో అత్యధిక శాతం కుటుంబ సమస్యలే కావడం గమనార్హం.

తన భర్త విచక్షణారహితంగా విపరీతంగా కొడుతున్నాడంటూ కృష్ణా జిల్లాకు చెందిన ఓ మహిళ, విశాఖపట్నం నగరానికి చెందిన మరో మహిళ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. పోలీసులు నిమిషాల వ్యవధిలో బాధితుల వద్దకు చేరుకుని వారి భర్తల వేధింపుల నుంచి కాపాడారు. అనంతరం అన్నిరకాల సేవలు అందించే వన్‌ స్టాప్‌ సెంటర్‌ కు బాధితులను పంపించారు. కుటుంబ సమస్యలపై ఫిర్యాదులు చేసేవారికి నిపుణులు, పోలీసులతో కౌన్సెలింగ్‌ ఇప్పిస్తున్నారు. ఇలా కుటుంబం కలహాల కేసులే ఇప్పటి వరకు ఎక్కువ గా నమోదు అవుతున్నాయి సమాచారం.

ఇకపోతే ఏపీ సర్కార్ తీసుకొచ్చిన ఈ దిశ యాప్ ని కేవలం 4రోజుల్లోనే 50 వేల మంది వరకు డౌన్‌ లోడ్‌ చేసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆండ్రాయిడ్‌ ప్లాట్‌ ఫామ్‌ లో అందుబాటులో ఉంది. మరో నాలగు ఐఓఎస్ ప్లాట్ ఫాం పై కూడా అందుబాటు లోకి రాబోతోంది. ఈ యాప్‌ పనిచేస్తోందా? లేదా? పరీక్షించేందుకు రోజుకు సగటున రోజుకు రెండు వేల మంది అందులోని ఫీచర్స్‌ను వినియోగిస్తున్నారు. ఆ సమాచారమంతా మంగళగిరిలోని రాష్ట్ర స్థాయి దిశ కంట్రోల్‌ రూమ్‌ కు చేరుతోంది. వీటిలో నిజంగా సమస్య ఉన్న కాల్స్‌ ను గుర్తించి అవసరమైన చర్యలను పోలీసులు చేపడుతున్నారు.