Begin typing your search above and press return to search.

ఏపీ కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఎలా జరిగింది? అసమ్మతి నేతలు ఏం చేశారంటే?

By:  Tupaki Desk   |   11 April 2022 7:13 AM GMT
ఏపీ కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఎలా జరిగింది? అసమ్మతి నేతలు ఏం చేశారంటే?
X
ఏపీ కొత్త మంత్రివర్గ ప్రమాణ స్వీకారం పూర్తయ్యింది. రాష్ట్ర సచివాలయంలోని పార్కింగ్ ప్రదేశం వద్ద ఏర్పాటు చేసిన వేదికపై మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలోనే సీఎం జగన్, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇక మంత్రి పదవి ఆశించి దక్కని అసమ్మతి నేతలు అసలు ఈ కార్యక్రమంలోనే పాల్గొనకుండా షాక్ ఇచ్చారు. సీఎం జగన్, వైసీపీ పెద్దలు బుజ్జగించినా వారు ఈ కార్యక్రమానికి గైర్హాజరు కావడం సంచలనమైంది.

అందరికంటే ముందుగా తొలుత సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు మంత్రిగా ప్రమాణ స్వీకారం.. సీనియారిటీ ప్రకారం కాకుండా 'ఆల్ఫాబెట్ ' ప్రకారం వారి పేర్ల మొదటి అక్షర క్రమంలో ఈ ప్రమాణ స్వీకారోత్సవం జరగడం విశేషం.

గతంలో మాదిరిగా ఈసారి కూడా ఐదుగురిని ఉప ముఖ్యమంత్రులుగా కొనసాగించే అవకాశం ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు వర్గాలకు డిప్యూటీ సీఎం పదవులు దక్కే అవకాశం ఉంది. మైనార్టీ కోటాలో అంజాద్ బాషా మరోమారు డిప్యూటీ సీఎంగా కనిపిస్తోంది. ఇక ఎస్టీ వర్గం నుంచి పీడిక రాజన్న దొర, ఎస్సీల నుంచి నారాయణ స్వామి లేదా పినేపి విశ్వరూప్ లేదా తానేడి వనిత, బీసీల నుంచి ధర్మాన ప్రసాదరావు, లేదా బొత్స సత్యనారాయణ, కాపు వర్గం నుంచి దాడిశెట్టి రాజా లేదా అంబటి రాంబాబులకు డిప్యూటీ సీఎంగా దక్కే అవకాశాలు ఉన్నాయి.

ఇక అంబటి తర్వాత రెండో ప్రమాణాన్ని అంజాద్ భాష (కడప) చేశారు. ఆ తర్వాత వరుసగా ఆదిమలుపు సురేష్ (యర్రగొండపాలెం), బొత్స సత్యనారాయణ (చీపురుపల్లి), బూడి ముత్యాల నాయుడు (మాడుగుల)తో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు.. ఆ తర్వాత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (డోన్), చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ (రామచంద్రాపురం) , దాడిశెట్టి రాజా(తుని), ధర్మాన ప్రసాదరావు (శ్రీకాకుళం), గుడివాడ అమర్ నాథ్ (అనకాపల్లి), గుమ్మనూరు జయరాం (ఆలూరు) , జోగి రమేశ్ (పెడన), కాకాణి గోవర్ధన్ రెడ్డి (సర్వేపల్లి), కారుమూరి నాగేశ్వరరావు(తణుకు), కొట్టు సత్యనారాయణ (తాడేపల్లిగూడెం), నారాయణ స్వామి (గంగాధర నెల్లూరు), ఉష శ్రీచరణ్ (కల్యాణదుర్గం) , మేరుగు నాగార్జున (వేమూరు), పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి(పుంగనూరు) మంత్రులుగా ప్రమాణం చేశారు. జగన్ ఎంచుకున్న మంత్రివర్గంలో ఈసారి బ్రాహ్మణ,కమ్మ,క్షత్రియ, వైశ్య కులాలకు చోటు దక్కలేదు.

-ప్రమాణ స్వీకారానికి అసంతృప్తి నేతల డుమ్మా.?
ఏపీలో మంత్రివర్గ విస్తరణ చిచ్చు పెట్టింది. ఈ ప్రమాణ స్వీకారానికి అసంతృప్తనేతలు డుమ్మాకొట్టారు. పదవులు దక్కకపోవడంతో సెక్రటేరియట్ దరిదాపులకు కూడా రావడం లేదు. పదవులు దక్కకపోవడంతో సుచరిత, పిన్నెల్లి, కరణం ధర్మశ్రీ, బాలినేనిలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది.

ఇక నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉదయభానులు కూడా తమ జిల్లాలకే పరిమితమయ్యారు. వీరిని బుజ్జగించేందుకు వైసీపీ కీలక నేతలు ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం కానరావడం లేదు. వైసీపీ అధిష్టానం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

మొదటి కేబినెట్ విస్తరణలో ఎక్కడా అసంతృప్తి వ్యక్తం కాలేదు. రెండోసారి మాత్రం అందరూ ఆశావహులు ఎక్కువ కావడంతో వైసీపీలో పెద్ద చిచ్చుపెట్టేలా ఉంది. పదవులు ఆశించి దక్కించుకోని నేతలు, వాళ్ల అనుచరులు రోడ్డెక్కుతూ ఆగ్రహజ్వాలలతో రగిలిపోతున్నారు. కొందరు అలక వహించారు. మరికొందరు కన్నీరు పెట్టుకున్నారు. ఇంకొందరు పదవులకే రాజీనామాలు చేశారు. ఇక నేతల అనుచరులైతే రోడ్డెక్కి రచ్చ చేస్తున్నారు. ఆందోళనలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. కొందరు ఆత్మహత్యాయత్నాలు చేశారు. సీనియర్లు రంగంలోకి దిగి ఈ అసంతృప్తి చల్లార్చే ప్రయత్నం చేస్తున్నారు.

-కొత్త మంత్రులు.. వారి కులాలు.. నియోజకవర్గం, జిల్లా వివరాలు

శ్రీకాకుళం:
1.ధర్మాన ప్రసాదరావు(బీసీ-పొలనాటి వెలమ) శ్రీకాకుళం
2.సీదిరి అప్పలరాజు(బీసీ-మత్స్యకార) పలాస

విజయనగరం:
3.బొత్స సత్యనారాయణ(బీసీ-తూర్పు కాపు)- చీపురుపల్లి

మన్యం:
4.పీడిక రాజన్నదొర(ఎస్టీ)- సాలూరు

అనకాపల్లి:
5.గుడివాడ అమర్‌నాథ్‌(కాపు-ఓసీ)
6.బూడి ముత్యాలనాయుడు(బీసీ-కొప్పుల వెలమ)

తూర్పుగోదావరి జిల్లా
7.దాడిశెట్టి రాజా(కాపు-ఓసీ) తుని

కోనసీమ:
8.పినిపే విశ్వరూప్‌(ఎస్సీ-మాల)
9.చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ(బీసీ- శెట్టిబలిజ)

పశ్చిమగోదావరి:
10.తానేటి వనిత(ఎస్సీ-మాదిగ)
11.కారుమూరు నాగేశ్వరరావు(బీసీ-యాదవ)
12.కొట్టు సత్యనారాయణ(కాపు-ఓసీ) తాడేపల్లిగూడెం

కృష్ణా:
13.జోగి రమేష్‌(బీసీ-గౌడ)

గుంటూరు జిల్లా:
14.అంబటి రాంబాబు(ఓసీ-కాపు)
15.మేరుగ నాగార్జున(ఎస్సీ-మాల)
16.విడుదల రజిని(బీసీ-రజక)

నెల్లూరు జిల్లా:
17.కాకాని గోవర్ధన్‌రెడ్డి(రెడ్డి-ఓసీ)

కడప:
18.ఆంజాద్‌బాష(ముస్లిం _మైనార్టీ)

కర్నూల్‌:
19.బుగ్గన రాజేంద్రనాథ్‌(ఓసీ-రెడ్డి)
20.గుమ్మనూరు జయరాములు(బీసీ-బోయ)

చిత్తూరు:
21.పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(ఓసీ-రెడ్డి)
22.కె.నారాయణస్వామి(ఎస్సీ-మాల)
23.ఆర్కే రోజా(ఓసీ-రెడ్డి)

అనంతపురం:
24.ఉషాశ్రీ చరణ్‌(బీసీ- కురుబ)
25.తిప్పేస్వామి(ఎస్సీ-మాదిగ)