Begin typing your search above and press return to search.

సోషల్ ఇంజనీరింగ్ పాలిటిక్స్ ఒక్కసారే పనిచేసేది!

By:  Tupaki Desk   |   12 Nov 2021 3:47 AM GMT
సోషల్ ఇంజనీరింగ్ పాలిటిక్స్ ఒక్కసారే పనిచేసేది!
X
రాజకీయాల్లో ఇపుడు గట్టిగా వినిపిస్తున్న మాట సోషల్ ఇంజనీరింగ్. నిజానికి ఇదేమీ కొత్త పదం కాదు, గతంలోనూ ఉంది. అయితే ఇపుడు అదే పెద్ద ఆర్ట్ గా రాజకీయ నాయకులకు, వారి వెనక ఉన్న వ్యూహకర్తలకు మారిపోయింది. ప్రతీ నియోజకవర్గంలో నాయకులను కులాల వారీగా విడదీయడం, ఎవరికి ఎన్ని ఓట్లు ఉన్నాయో చూసుకుని వారికి తాయిలాలు ఇచ్చి తమ వైపునకు తిప్పుకోవడమే సోషల్ ఇంజనీరింగ్ గా మారిందిపుడు. ఇక ప్రతీ నియోజకవర్గంలో బలమైన కులాలలెక్కలు తీసి వారిని ఎమ్మెల్యేలుగా మంత్రులుగా చేసుకుని వారిని సంతృప్తి పరచడమే సోషల్ ఇంజనీరింగ్ గా చూస్తున్నారు.

ఇక వైసీపీ అధినేత జగన్ ని చూస్తే మాత్రం సోషల్ ఇంజనీరింగ్ వల్లనే 2109 ఎన్నికల్లో అధికారంలోకి తాము వచ్చామనుకుంటున్నారు. ఆ విధంగా పార్టీలో ఏ పదవి అయినా ఆయన వివిధ వర్గాలకు సర్దుకుతున్నారు. అయితే ఎన్నికల్లో కులాల పాత్ర ఉన్న మాట వాస్తవమే అయినా అవే పూర్తి స్థాయిలో పనిచేస్తాయంటే నమ్మడానికిలేదు అంటున్నారు. ఒక సామాజిక వర్గం నుంచి ఒకరికి పదవి ఇస్తే మొత్తానికి మొత్తం వారు తమవైపే ఉంటారనుకోవడం కూడా పొరపాటే అంటున్నారు.

ఇక జగన్ వైసీపీకి ప్రశాంత్ కిశోర్ ఏపీలో సోషల్ ఇంజనీరింగ్ చేసి 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేలా చూశారు అని అంటారు. కానీ అదంతా వట్టి మాటగానే చూడాలి. జగన్ ని ముఖ్యమంత్రిగా ఒక్కసారి చేయాలి అన్న బలమైన జనాల ఆకాంక్ష వల్లనే ఆయనకు అవకాశం వచ్చింది అన్నది పచ్చి నిజం. అలా జగన్ కి ఒక్కసారి అధికారం ఇవ్వాలన్న ఆరాటం జనాలలో ఎక్కువగా ఉండడం వల్లనే జగన్ కి 151 సీట్లు దక్కాయి .పీకే చేసిన సోషల్ ఇంజనీరింగ్ కూడా పెద్దగా ఏమీ లేదు, వారు కేవలం క్లరికల్ జాబ్ మాత్రమే చేశారు అంటే సబబేమో. ఆ మీదట సోషల్ మీడియాలో ప్రచారం పెద్ద ఎత్తున చేసి వైసీపీకి పాజిటివిటీ వచ్చేలా చూశారు. కాబట్టి ఇక్కడ అర్ధం చేసుకోవాల్సింది ఏంటి అంటే జగన్ మీద మోజు క్రేజ్ మాత్రమే వైసీపీని 2019లో అధికారంలోకి తెచ్చాయన్నది.

ఇక రాజకీయాల్లో రెండు రెండూ కలిస్తే నాలుగు ఎపుడూ కావు. ఎందుకంటే రాజకీయ గణితం లో ఎన్నో లెక్కలు ఉంటాయి. ఇక ఒకసారి పనిచేసిన మ్యాజిక్ మరో సారి రివర్స్ అవుతుంది. వీటికి మించి ఇంకోటి కూడా చెప్పుకోవాలి. ఒకసారి పోలింగ్ బూత్ కి వెళ్లి ఓటేసిన వారినే మళ్లీ ఓటు చేయమంటే ఈ లోగానే ఎన్నో పరిణామాలు మారిపోతాయి. అంటే ప్రజా సమూహం అనే మహా సముద్రం లోతు ఎవరికీ తెలియదు, అది బయటకు అంతా బాగానే అన్నట్లుగా కనిపిస్తుంది. కానీ లోపల ఉండే అసంతృప్తి సుడిగుండాలను గుర్తించడం మహా మహా రాజకీయ పండితులకే సాధ్యం కాదు, ఇవన్నీ ఇలా ఉంటే జగన్ మళ్లీ మళ్లీ గెలవాలంటే ముందుగా జనాల మూడ్ ని గమనించాలి. ఆ విధంగా పార్టీకి రిపేర్లు చేసుకుంటూ పోవాలి. అంతే తప్ప గతంలో చేసిందే మళ్లీ చేద్దామనుకుంటే అది విఫల ప్రయోగంగా మారుతుంది అంటున్నారు.

ఒకసారి అధికారంలోకి వచ్చక ప్రభుత్వ పనితీరే కొలమానం అవుతుంది. అంతే తప్ప వేరే విధమైన ఎన్నికల్ ఎత్తులు వ్యూహాలు అసలు పనిచేయవు అని చెప్పాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఏం చేస్తుంది అన్నది ప్రజలు నిశితంగా గమనిస్తారు. వారిని తగిన న్యాయం జరిగిందా లేదా అన్న ఆలోచనలో కూడా వారు ఉంటారు. మరో సారి అధికారం దక్కాలంటే అవే తూకం రాళ్ళు అవుతాయి తప్ప మరేమీ కావు అన్నది మాత్రం నిజం. ఒక్కడ ఒక ఉదాహరణ కూడా చెప్పుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ ఎపుడూ సామాజిక న్యాయం పాటిస్తూనే ఉంటుంది. ప్రతీ నియోజకవర్గంలో కులాల సమీకరణలు చూసుకునే వారు ఎన్నికల్లో టికెట్లు ఇస్తారు.

నిజానికి ఈ సోషల్ ఇంజనీరింగ్ ని గతంలో అంటే సరిగ్గా నాలుగు దశాబ్దాల క్రితమే ఎన్టీయార్ తెలుగుదేశం పార్టీని పెట్టి బీసీలకు రాజకీయ అధికారం అందించారు. ఆ విధంగా ఆయన సోషల ఇంజనీరింగ్ ని తెలుగు రాష్ట్రాలకు పరిచయం చేశారు. అప్పట్లో ఉమ్మడి ఏపీలో తెలంగాణా రాష్ట్రంలో బీసీలు ఎక్కువగా ఉండేవారు. వారంతా అధికారానికి దూరంగా ఉంటూ వచ్చారు. ఎన్టీయార్ వారిని సమాదరించారు. వారికే ఎమ్మెల్యే, మంత్రి పదవులు కూడా ఇచ్చి రాజకీయ అధికారాన్ని అందించారు. దాంతో బీసీలంతా ఒక్కసారిగా టీడీపీ వైపుగా టర్న్ అయ్యారు. ఈ రోజుకీ టీడీపీకి బీసీలు వెన్నెముకగా ఉన్నారు అంటే అది ఎన్టీయార్ చేసిన అద్భుత సామాజిక కూర్పు వల్లనే అని అంటారు.

మరి ఇన్ని చేసిన టీడీపీ 2019 ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయింది అన్నది చూడాలి కదా. అంటే టీడీపీ మార్క్ సోషల్ ఇంజనీరింగ్ ని జనాలు గుర్తించలేదా గౌరవించలేదా అంటే అది కాదు, మ్యాటర్. అయిదేళ్ల ప్రభుత్వ పని తీరు ఆధారంగానే టీడీపీని ఓడించి జనాలు తీర్పు చెప్పారు. అదే కరెక్ట్ విశ్లేషణ కూడా. ఎవరైనా బలమైన పార్టీ నాయకులతో పాటు పార్టీ పునాదులు గట్టిగా ఉంటేనే మరిన్ని సార్లు అధికారంలోకి రావడం జరుగుతుంది అని కూడా అంటున్నారు. దీంతో వైసీపీ కూడా తన పాలనను, పార్టీని చక్కదిద్దుకుంటేనే రేపటి రోజున మరోసారి అధికారం దక్కుతుంది తప్ప సోషల్ ఇంజనీరింగ్ పేరిట నేల విడిచి సాము చేసినా ప్రయోగాలు చేసినా అన్ని సార్లూ వర్కౌట్ కాదనే అంటున్నారు. మరి దీని మీద వైసీపీ హై కమాండే తగిన ఆలోచన చేయాల్సి ఉంటుంది మరి.