Begin typing your search above and press return to search.

తెలంగాణ విద్యుత్ దోపిడీపై ఏపీ లేఖ.. అందులో ఏముందంటే?

By:  Tupaki Desk   |   31 Aug 2021 12:17 PM IST
తెలంగాణ విద్యుత్ దోపిడీపై ఏపీ లేఖ.. అందులో ఏముందంటే?
X
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల పంచాయితీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు.. ఆరోపణలు చేసుకుంటున్నా.. రెండు తెలుగు రాస్ట్రాల ముఖ్యమంత్రులు మాత్రం ఒక దగ్గరకు చేరి.. సమస్యకు పరిష్కారం ఏమిటన్న దానిపై చర్చలు జరపని పరిస్థితి. మరోవైపు తెలంగాణ ఫిర్యాదులు తెలంగాణ కు ఉంటే.. ఆంధ్రా ఆవేదన ఏపీ ప్రభుత్వం వినిపిస్తోంది. ఇప్పటికే ఒకరిపై ఒకరు విమర్శలు.. ఆరోపణలు.. లేఖలు.. ఫిర్యాదులు చేసుకున్నారు. అయినప్పటికీ వివాదం ఒక కొలిక్కి రాలేదు. ఇదిలా ఉండగా తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై తన అభ్యంతరాల్ని తెలియజేస్తూ కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు (కేఆర్‌ఎంబీ)ను ఏపీ సర్కారు లేఖ రాసింది. అందులో తెలంగాణ రాష్ట్ర అక్రమంగా విద్యుత్ దోపిడీ చేస్తుందని ఘాటు వ్యాఖ్యలు చేసింది.

ఉమ్మడి ప్రాజెక్టులు అయిన నాగార్జున సాగర్.. శ్రీశైలం నుంచి ఏపీ సర్కారు సాగు.. తాగు నీటి అవసరాల కోసం నీటిని విడుదల చేయాలని కోరినప్పుడు మాత్రమే తెలంగాణ ప్రభుత్వం తమవైపు ఉన్న ప్రాజెక్టు నుంచి విద్యుదుత్పత్తి చేయటంపై తీవ్రమైన ఆక్షేపణ తెలియజేసింది. అంతేకాదు.. పలు ఆరోపణలు చేస్తూ తన వాదనను వినిపించింది. లేఖలో ఏపీ అధికారులు పేర్కొన్న అంశాలు ఏమిటన్నది చూస్తే..

- కృష్ణా జలాల కేటాయింపుతోపాటు సాగర్, శ్రీశైలం, పులిచింతల ప్రాజెక్టుల వద్ద జరిగే విద్యుదుత్పత్తిపై తెలంగాణ ప్రభుత్వ వాదనలు సహేతుకంగా లేవు. శ్రీశైలంలో విద్యుదుత్పత్తిని తెలంగాణ ఉద్దేశపూర్వకంగా తప్పుగా అన్వయిస్తోంది. ఉమ్మడి ప్రాజెక్టులైన సాగర్, శ్రీశైలం నుంచి ఏపీ సర్కార్‌ సాగు, తాగు నీటి అవసరాల కోసం నీటిని విడుదల చేయాలని కోరినప్పుడు మాత్రమే తెలంగాణ ప్రభుత్వం ఆ ప్రాజెక్టుల నుంచి విద్యుదుత్పత్తి చేయాలి. అందుకు భిన్నంగా ఏకపక్షంగా అక్కడ విద్యుదుత్పత్తి చేస్తోంది.

- నాగార్జునసాగర్‌ కుడికాలువ పవర్‌హౌస్, టెయిల్‌పాండ్‌ పవర్‌హౌస్‌ భౌగోళికంగా ఏపీ పరిధిలో ఉన్నాయి. ఆ ప్రాజెక్టుల దిగువన నీటి అవసరాలు ఉన్న ప్రాంతాలు కూడా ఏపీలోనే ఉన్నాయి. కాబట్టి ఈ రెండుచోట్ల ఉత్పత్తి చేసే విద్యుత్‌ పూర్తిగా ఏపీకి సంబంధించింది. నాగార్జునసాగర్‌ ఎడమ కాలువ పవర్‌హౌస్‌ వద్ద 60 మెగావాట్ల సామర్థ్యంతో నీటిని విడుదల చేస్తారు. ఇది రెండు రాష్ట్రాలకు సంబంధించినది. ఇక్కడ ఉత్పత్తి అయిన విద్యుత్‌ను రెండు రాష్ట్రాలు పంచుకోవాలి.

- రాష్ట్ర పునర్విభజన చట్టం 11వ షెడ్యూల్లో పేర్కొన్న ప్రాజెక్టులను పరిగణనలోకి తీసుకుని 1,059 టీఎంసీల ఏపీ ప్రభుత్వ డిమాండ్‌ కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్‌ ముందుంచింది. ఈ అంశం కృష్ణా జల వివాదాల రెండో ట్రిబ్యునల్‌ ముందుంది. ఈ సమయంలో తెలంగాణ ప్రభుత్వం ఈ అంశాన్ని ప్రస్తావించడం సమంజసం కాదు.

- ఏపీకి కేటాయించిన నీటిని ఏ విధంగా అయినా ఏపీ భూభాగంలో వినియోగించుకునే హక్కు మాకే ఉంది. ఏపీపై తెలంగాణ ఎలాంటి ఆంక్షలు, అభ్యంతరాలకు ఆస్కారం లేదు. చెన్నై నీటి సరఫరాకు సంబంధించి.. 1983లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల మధ్య ఒప్పందం ఉంది. చెన్నై నగర తాగునీటి అవసరాల కోసం 15 టీఎంసీలను రెండు విడతల్లో కృష్ణా జలాలను సరఫరా చేయాల్సి ఉంది.

- పోతిరెడ్డిపాడు ద్వారా 2019–20లో 170 టీఎంసీలను, 2020–21లో 124 టీఎంసీలను మళ్లించాం. ఎస్‌ఆర్‌బీసీ, చెన్నైకి నీటి సరఫరాకే కాకుండా వరద జలాలపై ఆధారపడిన తెలుగుగంగ, జీఎన్‌ఎస్‌ఎస్‌కి కూడా ఈ నీటిని వినియోగించాం. వరద సమయంలో మిగులు జలాలను వరద నిర్వహణతో పాటు అవసరమైన వాటికి మళ్లించుకునే అధికారం రాష్ట్ర పునర్విభజన చట్టం–2014 ప్రకారం ఏపీకి ఉంది.