Begin typing your search above and press return to search.

ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్య: 498ఏ కింద గర్ల్ ఫ్రెండ్ ను విచారించలేం

By:  Tupaki Desk   |   26 July 2021 3:30 AM GMT
ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్య: 498ఏ కింద గర్ల్ ఫ్రెండ్ ను విచారించలేం
X
అత్తింట అమ్మాయిల వరకట్న మరణాలు.. మహిళలపై వేధింపులను అడ్డుకోవటానికి 1983లో ఐపీసీ సెక్షన్ 498ఏ ప్రకారం వరకట్న వేధింపుల వ్యతిరేకత చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టం మహిళలకు ఒక అస్త్రంగా మారింది. అయితే.. దీని వల్ల కలిగే ప్రయోజనం ఎంతో.. దీన్ని దుర్వినియోగం చేసేవారు ఉన్నారు. ఈ చట్టం ఎంత పవర్ ఫుల్ అంటే.. దీని కింద ఫిర్యాదు చేస్తే నిందితులను పోలీసులు వెంటనే అరెస్టు చేస్తారు.

నిందితులు అంటే సాధారణంగా భర్త.. అతడి కుటుంబ సభ్యులు వస్తారు. అయితే.. ఈ సెక్షన్ ను దుర్వినియోగం చేసే వారు పెరిగారు. ఈ సెక్షన్ అసంతృప్తితో ఉన్న భార్యల చేతిలో ఆయుధంగా మారిందన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఏపీ హైకోర్టు ఈ సెక్షన్ మీద కీలక వ్యాఖ్య చేసింది. అదిప్పుడు ఆసక్తికరంగా మారింది. గర్ల్ ఫ్రెండ్ ను ఈ సెక్షన్ కింద విచారించటానికి వీల్లేదని హైకోర్టు తాజాగా స్పష్టం చేసింది.

భర్త సంబంధీకుల్లో గర్ల్ ప్రెండ్ రాదని.. అందువల్ల ఆమెను 498ఏ సెక్షన్ కింద విచారించటానికి సాధ్యం కాదని తేల్చింది. ఒక వ్యక్తి గర్ల్ ఫ్రెండ్ పై పోలీసులు నమోదు చేసిన 498ఏ సెక్షన్ కింద విచారించలేమని పేర్కొంది. అంతేకాదు.. పోలీసులు కేసు నమోదు చేసిన ఉదంతంలో తదుపరి చర్యలన్నీ నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. అరెస్టుతో సహా మరెలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. అదే సమయంలో మిగిలిన నిందితులపై చర్యలు తీసుకోవచ్చని పేర్కొంది.

ఇంతకూ ఈ కేసు వివరాల్లోకి వెళితే.. కొమ్మి సునీత.. భర్త ధర్మయ్య.. ఆయన కుటుంబ సభ్యులతో పాటు భర్తపైనా.. అతడి గర్ల్ ఫ్రెండ్ మీదా కంప్లైంట్ చేసింది. తన భర్తకు గర్ల్ ఫ్రెండ్ గా ఉన్న యువతి కూడా తనను వేధింపులకు గురి చేస్తున్నట్లుగా భార్య ఫిర్యాదు చేసింది. దీంతో.. దిశా మహిళా పోలీసులు ఆ యువతి మీదా కేసు నమోదు చేసి ఏ2గా చేర్చారు. దిశ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను కొట్టేయాలని కోరుతూ సదరు యువతి ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై జరిగిన విచారణ సందర్భంగా భర్త గర్ల్ ప్రెండ్ ను అనవసరంగా ఇందులోకి లాగినట్లుగా పేర్కొన్నారు.

కంప్లైంట్ చేసిన సునీత.. ఆమె భర్త ధర్మయ్యకు మధ్యనున్న గొడవల్లో పైచేయి సాధించేందుకు వారి మధ్య ఉన్న వివాదంలోకి తన క్లయింట్ ను లాగారని న్యాయవాది వాదించారు. కంప్లైంట్ చేసిన సునీత పేర్కొన్నట్లుగా వేధింపులతో తన క్లయింట్ కు ఏ మాత్రం సంబంధం లేదన్నారు. సెక్షన్ 498ఏ ప్రకారం భర్త.. అతడి బంధువుల మీద మాత్రమే వేధింపుల కేసు పెట్టొచ్చని..

అంతేకానీ ఫిర్యాదుదారుతో ఏ మాత్రం సంబంధం లేని భర్త గర్ల్ ప్రెండ్ మీద కేసు ఎలా నమోదు చేస్తారని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం భర్త్ గర్ల్ ఫ్రెండ్ పై పోలీసులు పెట్టిన కేసు చెల్లదని స్పష్టం చేశారు. 498ఏ కింద రక్త సంబంధం ఉన్న వారు లేదంటే వివాహం ద్వారా భర్తకు బంధువులైన వారిని మాత్రమే విచారించే వీలుందని పేర్కొంటూ తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఏపీ హైకోర్టు వ్యాఖ్య ఆసక్తికరంగా మారింది.