Begin typing your search above and press return to search.

కోడెల‌కు ఊర‌ట‌తో కూడిన షాకులు

By:  Tupaki Desk   |   31 Aug 2019 8:55 AM GMT
కోడెల‌కు ఊర‌ట‌తో కూడిన షాకులు
X
గత కొన్ని రోజులుగా వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌ గా మారిన టీడీపీ సీనియ‌ర్ నేత‌ - మాజీ స్పీక‌ర్‌ కోడెల శివ‌ప్ర‌సాద్ రావుకు ఊర‌ట‌తో కూడిన షాక్ త‌గిలింది. ఆయన కూతురు, కొడుకుపై నమోదవుతున్న భారీగా కేసుల ప‌రంప‌ర‌కు తోడుగా హైదరాబాద్‌ లో అసెంబ్లీ నుంచి అమరావతికి తరలించాల్సిన సామగ్రిని తన సొంత ఇంటికి - తన కుమారుడి షోరూమ్‌ కి తరలించారని ఆరోపణలు ఆయ‌న ప‌రువు తీసేశాయి. ఓ స్పీకర్‌ గా పనిచేసిన ఆయన ఇలా కుర్చీలు - బెంచీలు - సోఫాలు - డైనింగ్ టేబుల్స్ ఇంటికి తీసుకుని వెళ్లడం రాజకీయాల్లో పెనుదుమారానికి దారితీసింది. ఆఫీసులో స్థలం లేకపోవడం వల్ల తన వద్ద భద్రపరిచానని - కావాలంటే తీసుకుని వెళ్లొచ్చని కూడా చెప్పారు. ఇలా వరుస వివాదాలు - రాజకీయ విమర్శలు - ఆరోపణలతో కొద్దిరోజులుగా కోడెల ఉక్కిరిబిక్కిరవుతుండ‌గా తాజా ఓ ఉప‌శ‌మ‌నం ద‌క్కింది. `కే ట్యాక్స్` వ‌సూళ్ల విష‌యంలో హైకోర్టు కీల‌క తీర్పు ఇచ్చింది.

హైకోర్టు మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ - ఆయన కుమారుడు శివరామకృష్ణకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కోడెల కుటుంబ సభ్యులపై సత్తెనపల్లి - నరసరావు పేట పోలీస్ స్టేషన్లలో ఐదు కేసులు నమోదయ్యాయి. అయితే ఈ ఐదు కేసుల్లోనూ వారిద్దరికీ బెయిల్ మంజూరైంది. అయితే, కోర్టు ప‌లు ష‌ర‌తులు విధించింది. సెప్టెంబర్ ఆరో తేదీలోగా కోర్టుకు వెళ్లి లొంగిపోవాలని - అదే సమయంలో బెయిల్ కూడా లభిస్తుందని కోర్టు పేర్కొంది. విజయవాడను వీడి వారు బయటకు వెళ్లకూడదని - ప్రతి సోమ - బుధ - శనివారాల్లో ఆ కేసుల విచారణ కోసం పోలీసుల ముందుకు వెళ్లాలని కోర్టు ఆదేశాలు జారీచేసింది. విచార‌ణ‌లో పోలీసుల‌కు పూర్తిగా అందుబాటులో ఉండాల‌ని కోరింది.

కాగా, కోడెల కుటుంబం నరసరావుపేట - సత్తెనపల్లి నియోజకవర్గాల్లో పేదల నుంచి బడా కాంట్రాక్టర్‌ వరకూ ప్రతి ఒక్కరి నుంచి కే–ట్యాక్స్‌ రూపంలో రూ.కోట్లు దోచుకున్నారని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ల్యాండ్‌ కన్వర్షన్ల పేరుతో వసూళ్లకు పాల్పడ్డారు. కోడెల కుటుంబం అక్రమాలు సత్తెనపల్లి - నరసరావుపేట నియోజవకర్గాలను దాటాయ‌ని సైతం ప్ర‌చారం జ‌రిగింది. ఆ కేసులోనే కోడెల ప్ర‌స్తుతం తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు.