Begin typing your search above and press return to search.

ఐఏఎస్ లపై ఏపీ హైకోర్టు ఆగ్రహం.. నలుగురికి జైలు శిక్ష !

By:  Tupaki Desk   |   2 Sep 2021 9:37 AM GMT
ఐఏఎస్ లపై ఏపీ హైకోర్టు ఆగ్రహం.. నలుగురికి జైలు శిక్ష !
X
ఆంధప్రదేశ్ హైకోర్టు ఐఏఎస్ ఆఫీసర్స్‌ కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్ని బేఖాతరు చేయడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు ,ఐఏఎస్‌ అధికారులకు జైలు శిక్ష విధించింది. హైకోర్టు తీర్పును అమలు చేయలేదని దాఖలైన పిటిషన్‌ పై ఉన్నత న్యాయస్థానం గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా నలుగురు ఐఏఎస్‌ అధికారులు మన్మోహన్ సింగ్, రావత్, ముత్యాలరాజు, శేషగిరిరావు లకు హైకోర్టు కొన్ని రోజుల జైలు శిక్షతో పాటు జరిమానా విధించింది.

ఈ ఘటన పై వివరాల్లోకి వెళ్తే .. 2015 లో భూమి వ్యవహారంలో నష్టపరిహారం చెల్లించమని తాము ఇచ్చిన ఆదేశాలను ఇంతవరకూ అధికారులు అమలు చేయనందున ఈ శిక్షలను విధిస్తున్నట్లు హైకోర్టు వెల్లడించింది. 2015 లో ఓ మహిళ నుంచి భూమి తీసుకుని పరిహారం అందించని వ్యవహారంలో నష్టపరిహారం చెల్లించమని హైకోర్టు ఆదేశింగా ఇప్పటి వరకూ అధికారులు ఆ నష్టపరిహారం అందజేయలేదు. కోర్టు ఆదేశించినా పరిహారం చెల్లింపులను ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటూ మండిపడిన కోర్టు, ఐఏఎస్ లకు జైలు శిక్ష, జరిమానాను విధించింది. వారి జీతాల నుంచి కోత పెట్టి పరిహారం అందించాలని ఆదేశించింది.

నెల్లూరు జిల్లా తాళ్లపాకకు చెందిన సాయి బ్రహ్మ అనే మహిళకు సంబంధించిన భూ పరిహారం కేసుపై హైకోర్టు ఈ తీర్పునిచ్చింది. అయితే ప్రతివాదుల అభ్యర్ధన మేరకు ఈ శిక్షను 4 వారాలపాటు నిలుపుదల చేసింది. విశ్రాంత ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్ కు జైలు శిక్షతో పాటు రూ.వెయ్యి జరిమానాను విధించింది. నాటి నెల్లూరు కలెక్టర్ శేషగిరిబాబుకు రెండు వారాలు, ఐఏఎస్ అధికారి ఎస్.ఎస్. రావత్ కు నెల రోజులు, ముత్యాల రాజుకు రెండు వారాలు, మరొక ఐఏఎస్ కు రెండు వారాల జైలు శిక్షను విధించింది. అందరికీ రూ.వెయ్యి చొప్పున జరిమానా వేసింది. శిక్షపై అప్పీల్ చేసుకునేందుకు నెల రోజుల గడువునిచ్చింది.