Begin typing your search above and press return to search.

తప్పుతో చెలగాటం...?

By:  Tupaki Desk   |   2 Dec 2021 9:17 AM GMT
తప్పుతో చెలగాటం...?
X
కొన్ని వర్గాలతో డీల్ చేయాల్సినపుడు పలు రకాలైన జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రభుత్వం అంటే అందులో అతి ముఖ్యమైన అంగంగా ఉద్యోగులను చెబుతారు. ఉద్యోగులు లేని వ్యవస్థను ఎవరూ ఊహించుకోలేరు. ఏ ప్రభుత్వానికైనా కళ్ళూ చెవులూ అన్నీ కూడా ఉద్యోగులే. మరి అలాంటి ఉద్యోగులతో గుడ్ రిలేషన్స్ మెయింటెయిన్ చేయాల్సిన జగన్ సర్కార్ ఎందుకు సాచివేత ధోరణిని అనుసరిస్తోంది అన్నది అర్ధం కాని విషయం. ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం పెద్ద ఎత్తున ఉద్యమ బాట పడుతున్నారు. అయినా సరే సర్కార్ పెద్దలు ఉదాశీనంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు.

ఇది ఎంతమాంత్రం మంచిది కాదు, అటు ప్రజలకు వారధిగా ఉంటున్న ఉద్యోగుల విషయంలో పాలకులు అనుకూలంగానే ఉండ్డాలి. ఇప్పటిదాకా అదే జరిగింది. జగన్ సర్కార్ మాత్రం ఉద్యోగులతో పెట్టుకోవాలని చూస్తోందా అన్న డౌట్లు అందరిలో ఏర్పడుతున్నాయి. ఉద్యోగులతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో అన్నది చరిత్రలో ఎన్నో సార్లు రుజువు అయింది. ఈ రోజుకీ ఉద్యోగులు కొందరు నాయకులు, వారి నాయకత్వం అంటే అసలు నమ్మరు. అలాంటి ఉద్యోగ సంఘాలు ఏకమొత్తంగా 2019 ఎన్నికల్లో జగన్ కి మద్దతు ఇచ్చారని చెబుతారు. తమకు వైఎస్సార్ కంటే కూడా మంచి చేస్తారన్న‌ వారి ఆశలే ఇందుకు కారణం.

ఇదిలా ఉంటే ఉద్యోగులు తమకు పీయార్సీ విషయంలో గట్టి పట్టుదల మీద ఉన్నారు. పీయార్సీ రెండున్నరేళ్ళు అయింది అమలు చేయలేదని వారు బాధపడుతున్నారు. దీని మీద ప్రభుత్వం తయారు చేసిన నివేదికను చూపించాలని కోరుతున్నారు. ఆ నివేదికను బహిర్గతం ఎందుకు చేయడంలేదో వారికి అర్ధం కావడంలేదు. ఉద్యోగులు అన్నాక ప్రభుత్వంలో భాగస్వాములే. రేపటి రోజుల పీయార్సీ నివేదిక మీద వారితో చర్చించి కానీ ప్రభుత్వం అమలు చేయలేదు. మరి అలాంటిది వారి కంట పెట్టకుండా ఉండడం ద్వారా ఏమి సాధించాలని చూస్తున్నారు అన్నదే ఇక్కడ ప్రశ్నగా ఉంది.

ఇక ఉద్యోగ సంఘాలు ఒకసారి అయినా ముఖ్యమంత్రితో భేటీ కావాలని గత కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నా వారికి ఆ దర్శన భాగ్యం కలగడంలేదు. దాంతో దాని వల్ల మరింతంగా వ్యతిరేకత పెరిగిపోతోంది అంటున్నారు. ఇక తమకు కరవు భత్యం అనేక వాయిదాలు మిగిలిఉన్నాయని, అలాగే జీతాలు సకాలంలో ఇవ్వాలని వారు కోరుతున్నారు. ఈ అంశాలన్నిటి మీద వారు ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డితో పాటు ముఖ్యమంత్రితో చర్చించాలని చూస్తున్నారు. మరి జగన్ వారికి అపాయింట్మెంట్ ఇచ్చి వారి విషయంలో సానుకూలంగా ఉన్నామని చెబితే ఉద్యమ రంగం నుంచి వారు పక్కకు జరిగే అవకాశం ఉంది.

అయితే ప్రభుత్వం వైపు నుంచి చర్చలు కేవలం ప్రధాన కార్యదర్శి స్థాయిలోనే ఆగిపోవడం పట్ల ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి చూస్తే జగన్ సర్కార్ నిప్పుతో చెలగాటం కాదు, తప్పులు చేస్తోందా, ఉద్యోగులతో కావాలనే పేచీ పెట్టుకుంటోందా అన్న డౌట్లు అయితే అందరిలో వస్తున్నాయి. మరి చూడాలి దీని మీద ఇప్పటికైనా ప్రభుత్వ వర్గాలు ఎలా స్పందిస్తాయో.