Begin typing your search above and press return to search.

ఏపీ ప్ర‌భుత్వ ఉద్యోగులు మ‌రో ఉద్య‌మానికి సిద్ధ‌మ‌వుతున్నారా?

By:  Tupaki Desk   |   6 Aug 2022 10:53 AM IST
ఏపీ ప్ర‌భుత్వ ఉద్యోగులు మ‌రో ఉద్య‌మానికి సిద్ధ‌మ‌వుతున్నారా?
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి, ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు మ‌ధ్య వివాదం మ‌ళ్లీ రాజుకునేలా ఉంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రోమారు ప్ర‌భుత్వ ఉద్యోగులు ఉద్య‌మానికి సిద్ధ‌మ‌వుతున్నార‌ని ప్ర‌ధాన మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి. ఉద్యోగులు దాచుకున్న డబ్బులు, రావాల్సిన‌ డీఏ బకాయిలపై ప్రభుత్వాన్ని ఎంత అడుగుతున్నా స్పందించ‌డం లేద‌ని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో మరో ఉద్యమం చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు చెబుతున్నారు.

ప్ర‌భుత్వ వ్య‌వ‌హార శైలితో ఆర్థిక భద్రత కరువై ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారని బొప్పరాజు అంటున్నారు. స్వ‌యంగా ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ ఇచ్చిన హామీలు కూడా నెరవేరడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోందని, ఇలాంటి పరిస్థితుల్లో మరో ఉద్యమం చేయక తప్పని పరిస్థితి ఏర్పడబోతోందని అంటున్నారు.

చూస్తూ కూర్చుంటే సమస్యలు పరిష్కారం కావని.. తక్షణం ఉద్యమంలోకి దిగవలసిందేనని జిల్లా ఉద్యోగ సంఘాలు కూడా చెబుతున్నాయ‌ని బొప్ప‌రాజు పేర్కొన్నారు. ఉద్యోగ సంఘాల నేతల డిమాండ్లను ఏపీ జేఏసీ చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్‌ వైవీ రావులు అంగీకరించారు. ప్రభుత్వం ఇదే రీతిగా వ్యవహరిస్తే ఉద్యమం తప్పదని వారు హెచ్చరించారు.

ఉద్యోగుల జీపీఎఫ్‌, ఏపీజీఎల్‌ఐ, మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌, సరెండర్‌ లీవులకు సంబంధించి దాచుకున్న రూ.వేల కోట్లు ప్ర‌భుత్వం ఇవ్వకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని అంటున్నారు. ఉద్యోగులు దాచుకున్న డబ్బులు ఇవ్వటానికి కిందటి మార్చి నెల గడువుగా పెట్టారని.. అయినా ఇప్ప‌టివ‌ర‌కు ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. వీటిపై ముఖ్యమంత్రి జ‌గ‌న్ స్వయంగా స్పందిస్తూ జూలై ఆఖరు నాటికి ఇస్తామని హామీ ఇచ్చినా ఇప్పటి వరకు అడుగు ముందుకు పడలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఉద్యోగుల కుటుంబాల్లో పెళ్లిళ్లు, వైద్య ఖర్చులు, పిల్లలకు ఉన్నత విద్య కోసం డబ్బులు లేక ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు. ఉద్యోగులు దాచుకున్న డబ్బులు రూ.3 వేల కోట్ల మేర ప్ర‌భుత్వం చెల్లించాల్సి ఉంద‌ని పేర్కొంటున్నారు.

అదేవిధంగా ఉద్యోగులకు 2018 జూలై 1 నుంచి రావాల్సిన రూ.7000 కోట్ల డీఏ బకాయిల‌ను కూడా ప్ర‌భుత్వం చెల్లించలేదంటున్నారు. అలాగే ఉద్యోగులకు పీఆర్‌సీ అరియర్స్‌పై ఇప్పటి వరకు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని చెబుతున్నారు. తక్షణమే పీఆర్‌సీ అరియర్స్‌ చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.

పీఆర్‌సీపై చర్చల సందర్భంలో ఇచ్చిన మాట ప్రకారం.. పాత జిల్లా కేంద్రాలలో పనిచేసే ఉద్యోగులకు చెల్లించే విధంగానే కొత్త జిల్లా హెడ్‌ క్వార్టర్స్‌ల్లో పనిచేసే ఉద్యోగులకు కూడా 16 శాతం హెచ్‌ఆర్‌ఏ చెల్లించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.