Begin typing your search above and press return to search.

మ‌రో వెయ్యి కోట్లు ప్లీజ్‌.. రిజ‌ర్వ్ బ్యాంక్‌కు.. ఏపీ స‌ర్కారు విన‌తి

By:  Tupaki Desk   |   28 Sep 2021 12:30 PM GMT
మ‌రో  వెయ్యి కోట్లు ప్లీజ్‌.. రిజ‌ర్వ్ బ్యాంక్‌కు.. ఏపీ స‌ర్కారు విన‌తి
X
ఇప్ప‌టికే అప్పుల్లో ఉన్న ఏపీ ప్ర‌భుత్వం.. అన్ని వ‌ర్గాల నుంచి వ్య‌తిరేక‌త‌ను ఎదుర్కొంటున్న విష‌యం తెలిసిందే. అయితే.. ఇప్పుడు తాజాగా మ‌రో వెయ్యి కోట్ల అప్పు కోసం.. రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను అభ్య‌ర్థించింది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘ‌ట‌నతో ఏపీ అప్పుల కుప్ప‌లు.. ఇప్ప‌ట్లో త‌రిగిపోయేలా క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అంతేకాదు.. ఈ అప్పుతో మొత్తం భారం రూ.5000 కోట్ల‌కు చేరే అవ‌కాశం క‌నిపిస్తోంది. వాస్త‌వానికి.. ఏపీ అప్పుల వినియోగం.. అప్పులు చేయ‌డంలో టాప్‌ పొజిష‌న్‌లో ఉంద‌ని.. కంప్ట్రోల‌ర్ అండ్ ఆడిట‌ర్ జ‌న‌ర‌ల్‌.. కాగ్ ఇటీవ‌లే స్ప‌ష్టం చేసింది.

ఏడాది మొత్తానికి ప్రతిపాదించిన అప్పులో తొలి 4 నెలల్లోనే అత్యధిక మొత్తం రుణంగా సేకరించి, ఖర్చు చేసిన రాష్ట్రాల్లో ఏపీ ముందు వ‌రుస‌లో ఫ‌స్ట్ ఉంద‌ని స్ప‌ష్టం చేసింది. దేశ‌వ్యాప్తంగా రాష్ట్రాలు చేసిన ఖర్చులను.. ఇందుకు ఏ రూపంలో ఎంత సమీకరించుకున్నారు, ఎలా ఖర్చు చేశారు.. అన్న అంశాలను ప్రతినెలా కాగ్‌ పరిశీలిస్తుంది. తేడాలు ఏమైనా ఉంటే నివృత్తి చేసుకుని ఆయా రాష్ట్రాల లెక్కలను వెలువరిస్తుంటుంది. ఇప్ప‌టి వరకు వెలువడిన రాష్ట్రాల లెక్కలను పోల్చి చూస్తే ఏడాది మొత్తానికి ప్రతిపాదిత అప్పులో దాదా పు పూర్తి మొత్తం (97.68 శాతం) నాలుగు నెలల్లోనే ఖర్చుల కోసం వినియోగించుకున్న ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ కనిపిస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌ తొలి నాలుగు నెలల్లోనే ఏడాది మొత్తం అంచనాల్లో 36% మేర ఖర్చు చేసింది. ఏ ఇతర రాష్ట్రమూ ఈ స్థాయిలో ఖర్చులు చేసింది లేదు. అనేక రాష్ట్రాలు తమ అంచనా ఖర్చులకు దూరంగానే ఉన్నాయి. 2021-22 ఆర్థిక సంవ‌త్స‌రంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం.. 37,02,979 కోట్ల‌ను అప్పు చేస్తామ‌ని బ‌డ్జెట్‌లో పేర్కొంది. దీనికి సంబంధించి ఇప్ప‌టివ‌ర‌కు కేవ‌లం నాలుగు మాసాలే గ‌డిచాయి. అయితే.. దీనిలో 36,17,191 కోట్ల‌ను అప్పుగా తీసుకుంది. దీనినే కాగ్ ఇటీవ‌ల‌ విమ‌ర్శ‌నాత్మ‌కంగా వెల్ల‌డించింది.

అయితే.. ఇంత‌లోనే మ‌ళ్లీ ఈ నెల‌కు సంబంధించి రూ.1000 కోట్లు కావాలంటూ.. ఆర్బీఐకి ప్ర‌పోజ‌ల్ పెట్ట‌డం.. ఆస‌క్తిగా మారింది. ఈ అప్పుతో ఈ ఒక్క‌నెల ప్ర‌భుత్వం రూ.5000 కోట్లు తీసుకున్న‌ట్టు అవుతుంది.కాగా, ప్ర‌స్తుతం తీసుకునే రూ.1000 కోట్ల‌ను రెండు ద‌ఫాలుగా.. 500 కోట్ల చొప్పున చెల్లిస్తామ‌ని తెలిపింది. ఒక 500 కోట్ల‌ను 17 సంవ‌త్సారాల్లోను, మ‌రో 500 కోట్ల‌ను 20 ఏళ్ల కు చెల్లిస్తామ‌ని పేర్కొంది. మ‌రి దీనిపై ఆర్బీఐ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. మ‌రోప‌క్క‌, మొత్తం మార్కెట్ రుణాలు 25,751 కోట్ల‌కు చేర‌డం గ‌మ‌నార్హం.