Begin typing your search above and press return to search.

అంతర్వేది ఎఫెక్ట్ : రాష్ట్రంలోని దేవుళ్ళ రథాలపై జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం!

By:  Tupaki Desk   |   12 Sep 2020 2:59 PM GMT
అంతర్వేది ఎఫెక్ట్ : రాష్ట్రంలోని దేవుళ్ళ రథాలపై జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం!
X
తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథం అగ్నికి ఆహుతి అయిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం దేవాలయాల పరిరక్షణకు, రథాల రక్షణకు ప్రత్యేక చర్య లు తీసుకోవాలని. అంతర్వేది ఘటన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున హిందూ సంఘాలు నుండి తీవ్ర నిరసన వ్యక్తమైంది. ప్రభుత్వ అసమర్థ వైఖరి వల్లే ఇలాంటి ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయని ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తుంది. దీనితో జగన్ సర్కార్ ..రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లోని దేవతామూర్తులను, రథాలను సంరక్షించేందుకు రంగంలోకి దిగింది.రాష్ట్రంలో ఉన్న హిందూ ఆలయాలలో ఉండే రథాలపై మరింత నిఘా పెంచాలని ఆదేశాలు జారీచేసింది. అలాగే, సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని చెప్పింది. అలాగే ప్రముఖ ఆలయాల వద్ద రక్షణ సిబ్బందిని కూడా నియమించాలని, అతిపురాతనమైన రథాలకు సంబంధించి ఇన్సూరెన్స్ లు కూడా చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

అందులో భాగంగానే ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన ఆలయాలకు సంబంధించిన అధికారులు రక్షణ చర్యలు చేపడుతున్నారు. ఆలయాల పరిస్థితిని, ఆలయాల రథాల పరిస్థితిని, రక్షణ వ్యవస్థను పటిష్టంగా చేయడం కోసం తీసుకోవాల్సిన చర్యలను ప్రభుత్వంతో చర్చిస్తున్నారు. ప్రధాన ఆలయాలలో ఒకటైన ద్వారకా తిరుమలలో శ్రీవారి చిన్న వెంకన్న రథాన్ని, అలాగే కుంకుళ్ళమ్మ అమ్మవారి రథాన్ని, లక్ష్మీపురం లోని జగన్నాథ స్వామి వారి రథాన్ని, రథ శాలలను పోలీసు అధికారులు పర్యవేక్షించారు. ఈ రథాల పర్యవేక్షణకు ఏర్పాట్లు చేయడంతో పాటుగా, రక్షణగా కాపలా సిబ్బందిని నియమించనున్నారు. అంతేకాదు రథాలకు ఇన్సూరెన్స్ కూడా చేయాలని నిర్ణయించిన అధికారులు యునైటెడ్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా మూడు రథాలకు ఇన్సూరెన్స్ చేయించారు.

రథానికి ఎదురుగా ఒక నిఘా కెమెరా ఏర్పాటు చేయడంతో పాటుగా, ఇరువైపులా వెనుక భాగంలో కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, అధికార యంత్రాంగం నిరంతరం వాటిని పర్యవేక్షించాలని ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో అధికారులు పరీక్షిస్తున్నారు. అంతర్వేది ఘటన నేపథ్యంలో అనంతపురం జిల్లాలో కూడా దేవాలయాలకు సంబంధించిన రథాలకు పోలీసులు పటిష్టమైన రక్షణ చర్యలు చేపట్టారు . జిల్లాలో ఉన్న ప్రతి రథాన్ని సందర్శించి దేవాలయ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించిన పోలీసులు రథాలకు రేయింబవళ్ళు రక్షణ కల్పించి వాటిని పరిరక్షించడానికి కావలసిన ఏర్పాట్లను చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో కదిరి ,కసాపురం, మురడి నేమకల్లు, పెన్నహోబిలం, తాడిపత్రి ,దొండపాడు, హైమావతి , పంపనూరు, లేపాక్షి తదితర ప్రాంతాల్లో దేవాలయాలను సందర్శించిన పోలీసులు రథాల రక్షణ పై పలు జాగ్రత్తలు తీసుకున్నారు . వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఆలయాల విషయంలో ప్రధానంగా ఆరోపణలు వెల్లువెత్తుతున్న వేళ ప్రభుత్వం తమ పారదర్శకతను నిరూపించుకునే ప్రయత్నం చేస్తుంది .