Begin typing your search above and press return to search.

మందు బాబులకు పండుగ లాంటి మాట చెప్పిన జగన్ సర్కార్

By:  Tupaki Desk   |   18 Jan 2022 4:02 AM GMT
మందు బాబులకు పండుగ లాంటి మాట చెప్పిన జగన్ సర్కార్
X
మరో కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. తన నోటి నుంచి ఒక మాట వచ్చిందంటే.. అదేమైనా సరే.. దాన్ని అమలు చేయటం ఖాయమన్నట్లుగా చెబుతుంటారు జగన్మోహన్ రెడ్డి. పాదయాత్ర సమయంలోనూ ఆ తర్వాత జరిగిన ఎన్నికల ప్రచారంలోనే.. వైసీపీ అధినేత హోదాలో జగన్ కీలక వ్యాఖ్యలు చేసేవారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దశల వారీగా మద్యనిషేధాన్ని అమలు చేస్తామని పేర్కొన్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. జగన్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి.

తొలుత మద్యం దుకాణాల్ని రద్దు చేసిన జగన్ సర్కారు ప్రభుత్వమే దుకాణాలు పెట్టి అమ్ముతుందని తేల్చారు. అంతేకాదు.. లిక్కర్ ను సొంత బ్రాండులతో మార్కెట్లోకి తీసుకొచ్చారు. ధరల్నిభారీగా పెంచేశారు. ఎందుకిలా అంటే.. దశల వారీ మధ్యపాన నిషేధాన్ని అమలు చేయాలంటే.. ధరలు భారీగా పెట్టేయటం ద్వారా మద్యపానం అలవాటు తగ్గుతుందని అంచనా వేశారు. అందుకు భిన్నంగా మద్యం ధరలు ఎంత పెంచినా అమ్మకాలు పెరుగుతున్నాయే తప్పించి తగ్గని పరిస్థితి.

ఇదిలా ఉండగా.. తాజాగా ఏపీ సర్కారుకీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇప్పటివరకు ఏపీలో మద్యం దుకాణాలు తెరిచి ఉంచే సమయానికి అదనంగా మరో గంటను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు ఏపీలో రాత్రి 9 గంటల వరకే మద్యం దుకాణాల్ని తెరిచి ఉంచేవారు. అది కాస్తా రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంచాలని పేర్కొంటూ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.

దశల వారీ మద్యపాన నిషేధాన్ని విధిస్తామని చెప్పి.. ఈ రోజున మద్యం అమ్మకాల సమయం రోజువారీగా గంట పాటు పెంచేయటం దేనికి నిదర్శనం సీఎంగారు? ఏపీ ముఖ్యమంత్రి మాట తప్పారా? లేదా? అన్నది పక్కన పెడితే.. మందుబాబులకు మాత్రం పండుగ లాంటి ఆనందానికి గురవుతారని చెప్కకతప్పదు.