Begin typing your search above and press return to search.

రూ.5కే ఎకరం భూమి: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం!!

By:  Tupaki Desk   |   18 July 2020 1:00 PM IST
రూ.5కే ఎకరం భూమి: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం!!
X
పారిశ్రామిక అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. దీనికి సరికొత్త నిర్ణయాలు తీసుకుంటూ పారిశ్రామికవేత్తలను ఆకర్షిస్తోంది. ఈ క్రమంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం కల్పించేలా ఏపీ ప్ర‌భుత్వం రూ. ఐదుకే ఎకరం కేటాయించాలని నిర్ణయించింది. ఏపీ రెన్యూవబుల్ ఎనర్జీ ఎక్స్‌పోర్టు కొత్త విధానానికి పచ్చజెండా ఊపింది. రాష్ట్రంలో 120 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల స్థాపనే లక్ష్యంగా ప్ర‌భుత్వం అడుగులు వేస్తోంది. దీనికోసం 5 లక్షల ఎకరాల భూమిని సౌర, పవన, హైబ్రిడ్ విద్యుత్ ప్రాజెక్టుల కోసం ఉప‌యోగించ‌నుంది. విండ్, సౌర విద్యుత్త్ ఉత్ప‌త్తి రంగాల్లో పెట్టుబడులు ఆక‌ర్షించేందుకు కొత్త విధానం తీసుకొచ్చింది.

పవన విద్యుత్ టర్బైన్లు, సౌర పలకల తయారీని ప్రోత్సహించడంలో భాగంగా ప్రాజెక్టు డెవలపర్ల నుంచి సంవ‌త్స‌రానికి ప్రభుత్వ భూమి అయితే ఎకరాకు రూ.31 వేలు, ప్రైవేటు భూమికి అయితే రూ.25 వేలు లీజు కింద వసూలు చేయనున్నారు. రెండేళ్లకొక‌సారి లీజు మొత్తాన్ని 5 శాతం చొప్పున పెంచనున్నట్లు ఏపీ ఇంధన శాఖ వివ‌రించింది. గ్రీన్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఛార్జీల‌ కింద మెగావాట్‌కు సంవ‌త్స‌రానికి రూ.లక్ష వసూలు చేస్తారు. నోటిఫై చేసిన కాసేపటికే కొత్త విధానంలో మార్పులు చేస్తూ తాజాగా ప్రభుత్వం సవరణ ఆదేశాలు జారీ చేసింది.

దేశీయంగా సౌర విద్యుత్ పలకల దిగుమతిపై కేంద్ర ప్రభుత్వం విధించే కస్టమ్ డ్యూటీ భారాన్ని తగ్గించేందుకు ఈ సవరణ చేపట్టినట్టు ఏపీ ప్ర‌భుత్వం వివరణ ఇచ్చింది. లాంగ్ ట‌ర్మ్ లో సౌర విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా కొనుగోలు చేసే క‌రెంట్ ధర భారం అవ్వ‌కుండా ఆయా సంస్థలకు ఇచ్చే లీజును తాజాగా తగ్గించింది.

ఈ మేరకు ఏడాదికి ఎకరాకు వసూలు చేసే లీజును రూ. 31 వేల నుంచి 5 రూపాయలకు త‌గ్గించారు. మ‌రోవైపు రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్ అందించేందుకు 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్తు ప్రాజెక్టును ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనికోసం ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ ను ఏర్పాటు చేసింది.