Begin typing your search above and press return to search.

ఇర‌వై వేలు కోట్లు ఎక్క‌డి నుంచి తేగ‌లం : జగన్ !

By:  Tupaki Desk   |   28 July 2022 5:18 PM IST
ఇర‌వై వేలు కోట్లు ఎక్క‌డి నుంచి తేగ‌లం : జగన్ !
X
తెల్లారితే చాలు వెల్ఫేర్ క్యాలెండ‌ర్ గుర్తుకు వ‌స్తుంది ఏపీ సీఎంకు ! ఆ విధంగా అప్పు చేసైనా స‌రే నెల‌కు రెండు నుంచి మూడు ప‌థ‌కాల‌కు నిధులు ఇచ్చి ఒక్క బ‌ట‌న్ తో అనుకున్న విధంగా అనుకున్న స‌మయానికే ఎంపిక చేసిన, అ్హ‌త ఉన్న ల‌బ్ధిదారుల‌కు సాయం చేస్తున్నారు. కానీ పోల‌వ‌రం విష‌య‌మై మాత్రం నా చేతుల్లో ఏమీ లేదు అని అనేశారు.అంటే సవ‌రించిన అంచ‌నా విలువల్లో ఇర‌వై వేల కోట్ల రూపాయ‌లు కేవ‌లం ప‌రిహారం కోసమే వెచ్చించాల‌ని ముందే తెలుసా ? ఇదే ఇప్పుడు చ‌ర్చ‌కు తావిస్తోంది. ఓ విధంగా నిన్న‌టి వేళ (బుధ‌వారం, జూలై 27, 2022) జగ‌న్ ప‌ర్య‌ట‌న కార‌ణంగానే ప‌రిహారం లెక్క ఎంత‌న్న‌ది తేలింది.

ఒక వెయ్యి కోట్లు అనుకుంటే నేనే సర్దుతాను కానీ ఇర‌వై వేలు కోట్లు ఎక్క‌డి నుంచి తేగ‌లం అని జ‌గ‌న్ నిస్స‌హాయ‌త వ్య‌క్తం చేశారు. అదేంటి ప‌థ‌కాల అమ‌లు విష‌య‌మై ఎక్క‌డి లేని శ‌క్తి తెచ్చుకుంటున్నారే మ‌రి ! ముంపు గ్రామాల ప్ర‌జ‌ల‌ను ఆదుకునేందుకు క‌నీస స్థాయిలో చ‌ర్య‌లు కూడా తీసుకోగ‌పోగా, నిధులు ఇవ్వ‌డం కేంద్రం బాధ్య‌త అని నెపం అంతా మోడీపై నెట్టేశారు.ఓ విధంగా దేశ ప్ర‌ధానిని విల‌న్ ను చేసేశారు.. అన్న విమ‌ర్శ కూడా విపక్షం నుంచి వ‌స్తోంది.

వాస్త‌వానికి కేంద్రంతో మంచి స్నేహాలే ఇప్ప‌టికీ ఉన్నాయి వైఎస్సార్సీపీకి. మొన్న‌టి రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లోనూ, అంత‌కుముందు కొన్ని కీల‌క బిల్లుల ఆమోదం విష‌యంలోనూ కేంద్రం అడగ‌కుండానే, కనీసం ఒక్క ఫోన్ కాల్ చేయ‌కుండానే సీఎం మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. చాలా సంద‌ర్భాల్లో కేంద్రంతో త‌గువులు పెట్టుకుంటే ఏమొస్తుంది అన్న స‌ర్దుబాటు ధోర‌ణిలో కూడా మాట్లాడారు. కానీ ఇప్పుడు భారం అంతా మోడీపైనే వేశాం. మిగ‌తా నిర్వహ‌ణ అన్న‌ది నా చేతిలో లేదు అని చెప్పారు జ‌గ‌న్.

పరిహారం కేంద్రం ఇవ్వలేదని కొంత కాలం పనులు నిలిపివేయ‌నూవ‌చ్చు. అందుకే నా చేతుల్లో ఏమీ లేదు .. నేనేం చేయ‌లేను... పోల‌వ‌రం విష‌య‌మై కేంద్రానికి ప‌దే ప‌దే గుర్తు చేస్తూ లేఖ‌లు రాస్తున్నా అన్న మెత‌క వైఖ‌రి ఒకటి సీఎం జ‌గ‌న్ వెల్ల‌డించడం ద్వారా ఆర్థిక భారం తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

వైసీపీ సర్కారు పోలవరం విషయంలో పూర్తిగా నిరాశజ‌న‌కం అయిన ధోర‌ణిలో ఉంది ! ఆ విధంగా కాకుండా కేంద్రంతో పోరాడి, వీలున్నంత వ‌ర‌కూ సానుకూల ధోర‌ణిలో ప్ర‌వ‌ర్తించే విధంగా ఒప్పించి నిధులు తెస్తాం అని ఉంటే కొంతలో కొంత బాధితుల‌కు ఉప‌శ‌మ‌నం ద‌క్కేది. ఇవేవీ ఆయ‌న నిన్న‌టి వేళ చెప్ప‌క‌పోవ‌డం ఓ విధంగా విడ్డూరంగానే ఉంద‌ని విప‌క్షం అభిప్రాయ‌ప‌డుతోంది. ఒక‌నాడు కేంద్రం మెడ‌లు వంచి ప్ర‌త్యేక హోదా సాధిస్తాం అని చెప్పారు. త‌రువాత రైల్వే జోన్ విష‌య‌మై కూడా ఇలానే మాట్లాడారు. ఆ త‌రువాత పోల‌వ‌రం ప్రాజెక్టు అన్న‌ది 2020లోనే పూర్త‌యిపోతుంద‌ని అన్నారు.

ఇప్పుడు డెడ్ లైన్లు అంటూ ఏమీ ఉండ‌వ‌ని డేట్ లైన్లే ఉంటాయని అంటున్నారు.అంటే ఓ విధంగా ప్ర‌భుత్వ అస‌మ‌ర్థ ధోర‌ణికి చిహ్నంగానే ఈ ప్రాజెక్టు నిలిచిపోనుందా అన్న అనుమానాలు కూడా ఇప్పుడు నిపుణుల్లో వ్య‌క్తం అవుతున్నాయ‌ని తెలుస్తోంది.