Begin typing your search above and press return to search.

ద‌క్షిణ ప్రాంతీయ మండ‌లి స‌మావేశంలో జ‌గ‌న్‌.. కేంద్రాన్ని క‌డిగేశారా?

By:  Tupaki Desk   |   14 Nov 2021 5:30 PM GMT
ద‌క్షిణ ప్రాంతీయ మండ‌లి స‌మావేశంలో జ‌గ‌న్‌.. కేంద్రాన్ని క‌డిగేశారా?
X
తిరుప‌తి వేదిక‌గా.. జ‌రుగుతున్న 29వ ద‌క్షిణ ప్రాంతీయ మండ‌లి స‌మావేశానికి ఆతిథ్యం ఇచ్చిన ఏపీ ప్ర‌భుత్వం.. ఇదే వేదిక‌గా.. కేంద్రంపై విరుచుకుప‌డిందా? ఏపీ విష‌యంలో కేంద్రం అనుస‌రిస్తున్న వైఖ‌రిని.. సీఎం జ‌గ‌న్‌.. తూర్పార‌బ‌ట్టారా? వివిధ స‌మ‌స్య‌ల‌ను, కేంద్రం చూపిస్తున్న వివ‌క్ష‌ను ఆయ‌న ప్ర‌ధానంగా లేవనెత్తారా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. `లోప‌ల‌` ఏం జ‌రిగింద‌నే విష‌యం ఇత‌మిత్థంగా బ‌య‌ట‌కు రాక‌పోయినా.. ఈ స‌మావేశంలో ప్ర‌స్తావించాల్సిన అంశాల‌పై ఏపీ రూపొందించుకు న్న అంశాల‌ను ప‌రిశీలిస్తే..కేంద్రంపై జ‌గ‌న్ దూకుడుగానే వ్య‌వ‌హ‌రించార‌ని అంటున్నారు.

క‌మిటీ వేయండి!

ఉమ్మ‌డి రాష్ట్ర విభజనతో ఏపీ తీవ్రంగా నష్టపోయింది. రాష్ట్రాన్ని విడగొట్టి ఏడేళ్లు గడిచినా హామీలు అమలు కావడంలేదు. సమస్యలన్నీ అపరిష్కృతంగానే ఉన్నాయి. రాష్ట్రాల మధ్య సమస్యలు నిర్దేశిత సమయం లోగా పరిష్కారం కావాలి. దీనికోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలి అని జ‌గ‌న్ కోరిన‌ట్టు తెలిసింది. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు వ్యయ నిర్ధారణలో 2013–14 ధరల సూచీతో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని, ఇది విభజన చట్టాన్ని ఉల్లంఘించడమేన‌ని పేర్కొన్నారు. వ‌న‌రుల లోపాన్నీ భర్తీచేయలేదన్నారు. ప్రత్యేక హోదా హామీని నెరవేర్చలేదని, తెలంగాణ నుంచి విద్యుత్‌ బకాయిలను ఇప్పించాల‌ని కూడా కోరారు. అదేస‌మ‌యంలో తీవ్ర కష్టాల్లో ఉన్న ఏపీ డిస్కంలకు ఊరట నివ్వాల‌ని కోరారు.

పార్ల‌మెంటులో చెప్పిందే జ‌ర‌గ‌దా?

పార్లమెంటులో రాష్ట్ర పునర్విభజన బిల్లు ఆమోదం సందర్భంగా ఏపీకి ఇచ్చిన ప‌లు హామీల‌ను సీఎం జ‌గ‌న్ ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు. వాటిని నెరవేర్చలేదన్నారు. ``రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చేసిన మరో హామీని కూడా మరోసారి మీకు గుర్తుచేస్తున్నాను. రాష్ట్రం విభజన జరిగిన తర్వాత వచ్చిన మొదటి ఆర్థిక సంవత్సరం... 13వ ఆర్థిక సంఘం సిఫార్సుల అమలు జరుగుతున్న కాల వ్యవధిలో ఉంది. ఆ మేరకు నాటి ప్రధాని రాజ్యసభలో ఫిబ్రవరి 20, 2014న స్పష్టమైన హామీ కూడా ఇచ్చారు. రీసోర్స్‌ గ్యాప్‌ అన్న పదాన్ని ఎక్కడా నిర్వచించనప్పటికీ, అది రెవెన్యూ లోటు అని స్పష్టంగా చెప్పవచ్చు.నాడు కేంద్రం స్పష్టంగా ఇచ్చిన హామీ రీసోర్స్‌ గ్యాప్‌ చెల్లింపులకు సంబంధించినవే. ఆ నేపథ్యంలో ఆ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర మొత్తం రెవెన్యూ లోటు (రీసోర్స్‌ గ్యాప్‌) ఏకంగా రూ.22,948.76 కోట్లకు చేరుకుంది`` అని వివ‌రించారు.

విద్యుత్‌ బకాయిల మాటేంటి?

``తెలంగాణలో విద్యుత్‌ పంపిణీకి సంబంధించి ఆ రాష్ట్రం నుంచి ఏపీ విద్యుత్‌ ఉత్పత్తి సంస్థకు రూ.6,112 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు తెలంగాణ డిస్కమ్‌లు ఆ మొత్తం చెల్లించలేదు. నిజానికి రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు విద్యుత్‌ సరఫరా చేయలేమని ఏపీ జెన్‌కో స్పష్టం చేసింది. అయినప్పటికీ కేంద్ర విద్యుత్‌ శాఖ ఏకపక్షంగా తెలంగాణకు విద్యుత్‌ సరఫరా చేయాల్సిందే అని నిర్దేశించింది. దీంతో అనివార్యంగా ఏపీ జెన్‌కో తెలంగాణకు విద్యుత్‌ సరఫరా చేసింది. ఇంకా రూ.6,112 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. ఆ బకాయిలు చెల్లించకుండా తెలంగాణ ప్రభుత్వం వ్య‌వ‌హ‌రిస్తోంది`` అని పేర్కొన్నారు.

ప్రత్యేక హోదా ఏమైంది?

రాష్ట్రానికి ఇస్తామ‌న్న‌ ప్రత్యేక హోదా ఏళ్లు గడిచినాఇప్పటికీ నెరవేర్చలేదని జ‌గ‌న్ పేర్కొన్నారు. విభజన చట్టంలోని 8వ షెడ్యూల్‌ ప్రకారం, 8 మౌలిక వసతుల ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పాటు, జాతీయ ప్రాధాన్యం ఉన్న 11 సంస్థలను పూర్తి స్థాయిలో 2024 నాటికి ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇంకా, బుందేల్‌ఖండ్‌లో ఇచ్చిన విధంగా వెనకబడిన జిల్లాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీని కూడా పూర్తిగా అమలు చేయలేదు అని వివ‌రించారు. అదేవిధంగా షెడ్యూల్‌ 9, 10 జాబితాలో ఉన్న సంస్థలకు సంబంధించి చట్టపరంగా ఆస్తుల పంపిణీ చేప‌ట్టలేద‌న్నారు.

నీటి వివాదాలు

రాష్ట్ర విభజన తర్వాత త‌లెత్తిన జ‌ల వివాదాల‌ను కూడా కేంద్రం ప‌రిష్క‌రించ‌డం లేద‌ని.. జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. నీటి వినియోగం విష‌యంలో ఇతర రాష్ట్రాల సహకారం లేకపోయినప్పటికీ, ఆంధ్రప్రదేశ్‌ మాత్రం తమిళనాడు ప్రభుత్వం కోరినప్పుడల్లా చెన్నై తాగునీటి అవసరాల కోసం కృష్ణా నీరు సరఫరా చేస్తూనే ఉంది. దీనికి సంబంధించి 10 ఏళ్లుగా ఆ రాష్ట్రం నుంచి రూ.338.48 కోట్లు రావాల్సి ఉంది. వీటిని ఇప్పించాల‌ని కూడా జ‌గ‌న్ కోరిన‌ట్టు తెలిసింది.

ఎన్‌సీబీలో కోత విధించడం సరికాదు

ఈ ఆర్థిక సంవత్సరానికి(2021–22) సంబంధించి నికర రుణ పరిమితి (ఎన్‌బీసీ)ని రూ.42,472 కోట్లుగా నిర్థారించార‌ని... అయితే గత ప్రభుత్వ హయాంలో పరిమితికి మించి రుణాలు సేకరించారన్న కేంద్ర ఆర్థిక శాఖ, ఈ ఏడాది నిర్ధారించిన నికర రుణ పరిమితిలో రూ.19,923.24 కోట్లు సర్దుబాటు చేసే విధంగా రుణ పరిమితిలో ఆ మేరకు కోత విధించింది. గత ప్రభుత్వం చేసిన అధిక రుణాలకు తమ బాధ్యత లేకపోయినప్పటికీ ఎన్‌బీసీలో కోత విధించడం సరి కాదని మొర పెట్టుకున్నా సమ్మతించకపోగా, నికర రుణ పరిమితిలో కోతను ఏకంగా మరో మూడేళ్లకు విస్తరించింది. అని జ‌గ‌న్ తెలిపారు.

మాపైనే క‌ట్ట‌డి ఎందుకు?

`పరిమితికి మించి` అంటూ కేంద్ర ప్రభుత్వం కట్టడి చేస్తోందని జ‌గ‌న్ పేర్కొన్నారు. నిజానికి రాష్ట్ర ప్రభుత్వానికి అవి గ్రాంట్‌కాదని, వివిధ అవసరాల కోసం ప్రభుత్వం సేకరిస్తున్న రుణాలని, ఈ రుణాలను సక్రమంగా తీరుస్తున్నామ‌ని.. అలాంటప్పుడు నికర రుణ పరిమితిలో కోత విధించడం ఎందుక‌ని ప్ర‌శ్నించారు. ఈ విష‌యంలో హోం మంత్రి జోక్యం చేసుకోవాలని కోరారు.

రేషన్‌ బియ్యంలో కేటాయింపు ఇలాగేనా?

రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్‌)ద్వారా 2.68 కోట్ల మందికి రేషన్‌ అందుతోంది. అంటే గ్రామీణ ప్రాంతాల్లో 61 శాతం, పట్టణ ప్రాంతాల్లో 41 శాతం మందికి మాత్రమే రేషన్‌ సరుకులు అందుతున్నాయి. నిజానికి ఇది ఏ మాత్రం సరికాదు. వాస్తవానికి గ్రామీణ ప్రాంతాల్లో 75 శాతం, పట్టణ ప్రాంతాల్లో 50 శాతం మందిని ప్రజా పంపిణీ వ్యవస్థలోకి తీసుకు రావాల్సి ఉంది. ఏపీతో పోలిస్తే ప‌లు రాష్ట్రాలు ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్నాయి. కేంద్రం గుర్తించిన లబ్ధిదారులకు తోడు మరో 56 లక్షల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా రేషన్‌ సరుకులు ఇస్తోంది. ఈ నేప‌థ్యంలో రేష‌ణ్‌ గణాంకాలు సవరించాలని కోరుతున్నానన్నారు.