Begin typing your search above and press return to search.

20న ఏపీ అసెంబ్లీ.. 3 రోజుల్లో కీలక అంశాలపై నిర్ణయాలు

By:  Tupaki Desk   |   13 Jan 2020 10:26 AM GMT
20న ఏపీ అసెంబ్లీ.. 3 రోజుల్లో కీలక అంశాలపై నిర్ణయాలు
X
సంక్రాంతి పండుగ హడావుడి పూర్తి అయిన వెంటనే ఏపీలో ఏర్పాటు చేయాలనుకున్న మూడు రాజధానులపై కీలక నిర్ణయాన్ని తీసుకునేందుకు వీలుగా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని భావిస్తుందా? అంటే అవునని చెప్పాలి. ఈ వాదనకు బలం చేకూరేలా తాజాగా ఒక పరిణామం చోటు చేసుకుంది. ఈ నెల 20న ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నట్లుగా ప్రకటన వెలువడింది.

మూడు రోజుల పాటు సాగే ఈ అసెంబ్లీ సమావేశాల్లో కీలక అంశాలపై ఏపీ ప్రభుత్వం చర్చ జరపనుంది. అయితే.. ఈ సమావేశాల్లో ఎజెండా ఏమిటన్న విషయాన్ని 20న ఫిక్స్ చేస్తారని చెబుతున్నారు. అయితే.. ఎజెండా ముందుగానే ఫిక్స్ అయిపోయిందన్న మాట వినిపిస్తోంది. చంద్రబాబు హయాంలో తీసుకొచ్చిన సీఆర్డీఏ చట్టానికి మంగళం పాడటం.. రాజధానిపై ఏర్పాటు చేసిన జీఎన్ రావు బీసీజీ.. హైపర్ కమిటీ నివేదికలపై చర్చలు జరపటంతో పాటు తుది నిర్ణయం తీసుకోనున్నారు. రాజధాని తరలింపునకు సంబంధించిన కూడా అసెంబ్లీలో నిర్ణయాన్ని తీసుకుంటారు.

ఈ నెల 20న అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్న విసయాన్ని ఎమ్మెల్యేల కు మెసేజ్ లు పంపారు కూడా. ఇదిలా ఉంటే.. ఈ రోజు (సోమవారం) సమావేశమైన హైపర్ కమిటీ రాజధాని రైతుల వినతుల్ని స్వీకరించింది. వారు చెప్పిన వివరాల్ని విన్నది. మంత్రులు కొడాలి నాని.. బొత్స సత్యనారాయణ.. తదితరులు రాజధాని రైతుల్ని ఇటీవల కలిసి వారి నుంచి సేకరించిన వివరాల్ని హైపర్ కమిటీ సమావేశం లో చర్చించారు. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. వెలగపూడి లో కొందరు రైతులతో కలిసి మంత్రి బొత్స మాట్లాడారు.

గత ప్రభుత్వం ఇచ్చిన హామీలకు తీసిపోని రీతిలో.. రాజధాని రైతులు ఏ మాత్రం నష్టపోని రీతిలో నిర్ణయం తీసుకుంటామన్న భరోసాను ఇచ్చారు. మంత్రుల్నికలిసిన రైతులు పలువురు తమ గ్రామాలు డెవలప్ కావాలని.. మౌలిక వసతులు మరింత మెరుగు అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. అమరావతిపై కొందరు రైతులు చేస్తున్న ఆందోళనలతో విపక్ష తెలుగుదేశం లబ్థి పొందాలన్న ఆలోచనలో ఉన్నట్లు గా అభిప్రాయాన్ని వ్యక్తమైంది. రాజధాని మీద ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతుల ప్రయోజనాలు దెబ్బ తినకుండా ఉండేలా ప్రభుత్వ నిర్ణయం ఉండాలన్న సూచన చేశారు. మరి.. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటిస్తుందన్నది చూడాలంటే కాస్త వెయిట్ చేయక తప్పదు.