Begin typing your search above and press return to search.

అసహనం ఎక్కడుందంటూ సెలబ్రిటీలు రోడ్డెక్కారు

By:  Tupaki Desk   |   8 Nov 2015 4:26 AM GMT
అసహనం ఎక్కడుందంటూ సెలబ్రిటీలు రోడ్డెక్కారు
X
ఒక చిత్రమైన పరిణామం చోటు చేసుకుంది. దేశంలో ఇప్పటివరకూ ఎప్పుడూ లేని విధంగా కవులు.. కళాకారులు.. సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖులు.. మేధావుల్లో పలువురు దేశంలో అసహనం పెరిగిపోతుందని.. ఇందుకు నిరసనగా తమకు ప్రభుత్వం నుంచి వచ్చిన పురస్కారాల్ని వెనక్కి ఇచ్చేస్తున్నట్లు ప్రకటించటం.. ఇప్పటికి పెద్ద సంఖ్యలో ఇలాంటి అవార్డు వాపసీలు చోటు చేసుకోవటం తెలిసిందే. మూడు..నాలుగు రోజుల కిందట ఒకే రోజు 24 మంది సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖులు తమ అవార్డుల్ని వెనక్కి ఇచ్చేస్తున్నట్లు ప్రకటించారు.

ఓపక్క అసహనంపై తమ నిరసన వ్యక్తం చేస్తున్న వారికి భిన్నంగా సినీ ప్రముఖులు.. దేశంలో అసహనం అన్నది లేదంటూ.. అవార్డు వాపసీని ఒక ప్రహసనంగా.. ప్రచారం కోసం చేస్తున్న తప్పుడు మార్గంగా విమర్శిస్తూ నిరసన గళమెత్తటం విశేషం. శనివారం ఒకేరోజున ఇలాంటి నిరసన దేశ రాజధాని ఢిల్లీతో పాటు వాణిజ్య రాజధాని ముంబయిలోనూ నిరసనలు వెల్లువెత్తాయి. దేశంలో అసహనం లేదంటూ పెద్ద సంఖ్యలో సినీ ప్రముఖులు రోడ్ల మీదకు వచ్చారు. ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ నాయకత్వంలో సినిమా నిర్మాణ విభాగాలకు చెందిన కళాకారులు రోడ్ల మీదకు వచ్చి నిరసన వ్యక్తం చేశారు.

ఇప్పటివరకూ దేశంలో అసహనం ఉందంటూ ప్రముఖులు.. మేధావులు.. సినీ ప్రముఖులు నిరసన గళం వినిపించారు. భారత కోసం పాదయాత్ర పేరిట జరిపిన ఈ పాదయాత్రలో అవార్డులు తిరిగి ఇచ్చిన కవులు. కళాకారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘‘ఇది లౌకిక దేశం. ఇక్కడ అసహనానికి చోటు లేదు. అగ్రహానికి అసలే తావులేదు’’ అంటూ అనుపమ్ ఖేర్ స్పష్టం చశారు. అనుపమ్ ఖేర్ వెంట పలువురు ప్రముఖులు నడిచారు. ఢిల్లీ లో జరిపిన నిరసన ప్రదర్శన మాదిరే ముంబయిలోనూ భారీ ఆందోళన నిర్వహించారు. ఇప్పటివరకూ ఈ తరహా నిరసనలు చోటు చేసుకున్నది లేదు. అందుకు భిన్నంగా జరిగిన ఈ నిరసనతో కవులు.. కళాకారులు.. బుద్ధజీవులు రెండు వర్గాలుగా చీలిపోయిన పరిస్థితి. రానున్న రోజుల్లో మరెలాంటి పరిణామాలకు తాజా నిరసనతో చోటు చేసుకుంటాయన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.