Begin typing your search above and press return to search.

అందరికి హీరో..యోగికి మాత్రం విలన్ అయ్యాడే

By:  Tupaki Desk   |   9 March 2016 7:15 AM GMT
అందరికి హీరో..యోగికి మాత్రం విలన్ అయ్యాడే
X
గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ప్రసంగం గురించి తెలిసిందే. కోల్ కతాలోని టెలిగ్రాఫ్ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని.. తన భావోద్వేగ ప్రసంగంతో వేదికపైన ఉన్న జస్టిస్ గంగూలీ నుంచి కాంగ్రెస్ నేత నోట మాట రాకుండా చేయటమే కాదు.. ఆయన చేసిన ప్రసంగం దేశంలోని కోట్లాదిమంది ప్రశంసల్ని పొందింది.

వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా బీజేపీకి చెందిన కొందరు ఎంపీలపై కూడా అనుపమ్ ఖేర్ ఘాటు విమర్శలు చేశారు. నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి వచ్చే వారిని జైల్లో పడేయ్యాలన్న డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ ఎంపీలు.. యోగి ఆదిత్యానాథ్.. సాధ్వి ప్రాచీ లాంటి వారిని జైల్లో వేయాలంటూ వ్యాఖ్యానించారు.

అనుపమ్ ఖేర్ చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున ప్రశంసలు ఓపక్క నుంచి వస్తుంటే.. బీజేపీ ఎంపీ మహంత్ యోగి ఆదిత్యానాథ్ కు మాత్రం మంటపుట్టేలా చేశాయి. తనను జైల్లో వేయాలని పిలుపునివ్వటాన్ని ఆయన భరించలేకపోతున్నారు. అందుకే అనుపమ్ ఖేర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసేందుకు వెనుకాడలేదు. సినిమాల్లో విలన్ క్యారెక్టర్లు వేసే అనుపమ్ ఖేర్.. రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోనూ విలనే అని వ్యాఖ్యానించారు.

అంతకు మించి తాను అనుపమ్ ఖేర్ గురించి మాట్లాడదలుచుకోలేనని చెప్పారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. కోట్లాది మంది ప్రజల మనసుల్ని దోచుకున్న అనుపమ్ ఖేర్ మాటలు యోగికి మాత్రం నచ్చకపోవటాన్ని అర్థం చేసుకోవచ్చు. తనను విమర్శించిన అనుపమ్ ఖేర్ ఆయనకు విలన్ గా కనిపించటంలో ఆశ్చర్యం లేదేమో.