Begin typing your search above and press return to search.

మహిళా క్రికెట్‌ లో మరో వరల్డ్ రికార్డు !

By:  Tupaki Desk   |   9 March 2020 2:06 PM IST
మహిళా క్రికెట్‌ లో మరో వరల్డ్ రికార్డు !
X
తాజాగా ముగిసిన ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌ లో అసాధారణమైన ఆట తీరుతో ఆసీస్ ఐదోసారి ప్రపంచకప్‌ ని ఎగురేసుకుపోయింది. టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో భాగంగా ఆదివారం టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్‌ 85 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ కు దిగిన ఆసీస్‌ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. స్టార్‌ బ్యాటర్‌ అలీసా హీలీ (75; 39 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసానికి తోడు.. మరో ఓపెనర్‌ బెత్‌ మూనీ (61 నాటౌట్‌; 43 బంతుల్లో 9ఫోర్లు) హాఫ్‌ సెంచరీతో రాణించారు.

ఇక దీప్తి శర్మ రెండు వికెట్లు పడగొట్టింది. ఆ తర్వాత భారీ లక్ష సాధనతో బ్యాటింగ్‌ కు దిగిన టీమిండియా 19.1 ఓవర్లలో 99 పరుగులకు ఆలౌటై పరాజయం చెందింది. అసలు ఏ దశలోనూ ఆసీస్ కి పోటీ ఇచ్చినట్టు కనిపించలేదు. మొదట బౌలింగ్ లో తేలిపోయిన ఇండియా ఆ తరువాత బ్యాటింగ్ లోను అదే తీరుతో ..ప్రపంచ కప్ కి అడుగుదూరంలో ఆగిపోయింది.

ఇకపోతే , ఈ టీ20 కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో ఒక ప్రపంచ రికార్డు నమోదైంది. రికార్డు సంఖ్యలో 86,174 మంది ప్రేక్షకులు మ్యాచ్‌ కు హాజరయ్యారు. దీనితో ఇది సరికొత్త రికార్డును నమోదు చేసింది. ప్రపంచ మహిళల క్రికెట్‌ చరిత్రలో రికార్డు వీక్షక్షులు హాజరైన మ్యాచ్‌ గా చరిత్ర లో నిలిచింది. ఇక ఆస్ట్రేలియా లో ఇప్పటివరకూ జరిగిన మహిళల స్పోర్ట్స్‌ ఈవెంట్‌ పరంగా చూసినా ఎక్కువ మంది హాజరైన మ్యాచ్‌ ఇదే కావడం మరో విశేషం. అంతర్జాతీయ మహిళల దినోత్సవం రోజున జరిగిన మ్యాచ్‌ కు ఇంతటి ఘనమైన ఆదరణ రావడం మరో విశేషం. ఓవరాల్‌ గా చూస్తే మహిళల స్పోర్ట్స్‌ లో అత్యధిక మంది వీక్షకుల హాజరైన మ్యాచ్‌ 1999లో కాలిఫోర్నియాలో జరిగిన సాకర్‌ వరల్డ్‌ కప్‌ ఫైనల్‌. 21 ఏళ్ల క్రితం నాటి మహిళల సాకర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ కు 90, 185 మంది ప్రేక్షకులు హాజరయ్యారు.