Begin typing your search above and press return to search.

ఏపీలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదు

By:  Tupaki Desk   |   22 March 2020 11:52 PM IST
ఏపీలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదు
X
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదయింది. ఈ మేరకు ప్రముఖ న్యూస్ ఏజెన్సీ పీటీఐ తెలిపింది. విశాఖపట్నంకు చెందిన ఓ మహిళకు కరోనా వైరస్ సోకినట్లు పేర్కొంది. బాధితురాలి భర్త నుండి ఆమెకు ఇది వచ్చినట్లుగా తెలుస్తోంది. ఆమె భర్తకు గతంలోనే కరోనా పాజిటివ్ తేలింది. అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇప్పుడు భార్యకు కూడా వచ్చిందని తేలింది. దీంతో ఏపీలో కరోనా బాధితుల సంఖ్య ఆరుకు చేరుకుంది.

దేశంలోని కరోనా వ్యాపించిన జిల్లాలను కేంద్ర ప్రభుత్వం ఆదివారం ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తం 75 జిల్లాల్లో లాక్ డౌన్ ప్రకటించింది. ఇందులో తెలంగాణ రాష్ట్రం నుండి ఐదు, ఆంధ్రప్రదేశ్ నుండి మూడు జిల్లాలో ఉన్నాయి. తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్ ఉన్నాయి. ఏపీ నుండి విశాఖపట్నం, కృష్ణా, ప్రకాశం జిల్లాలు ఉన్నాయి.

కరోనా వైరస్ వ్యాప్తి జరగకుండా ఉండేందుకు కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కీలక నిర్ణయం తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా అంతర్రాష్ట్ర సరిహద్దులను మూసివేస్తున్నట్లు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ రోజు సాయంత్రం ప్రకటించారు. ఇప్పటికే పన్నెండు రాష్ట్రాలు ఇలా సరిహద్దులు మూసివేశాయి. కేవలం అత్యవసర వాహనాలకు మాత్రమే అనుమతిస్తారు. అవసరమైతే తప్ప ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సూచించారు.