Begin typing your search above and press return to search.

ఏపీ సర్కారు పై క్యాట్ లో మరో ఫిర్యాదు

By:  Tupaki Desk   |   13 Feb 2020 4:45 PM IST
ఏపీ సర్కారు పై క్యాట్ లో మరో ఫిర్యాదు
X
ఏపీ ప్రభుత్వంపై మరో అధికారి క్యాట్ లో ఫిర్యాదు చేశారు. ఇటీవలే సస్పెన్షన్ కు గురైన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు జగన్ సర్కారు పై క్యాట్ లో ఫిర్యాదు చేశారు. 2019 మే నుంచి నాకు జీతం ఎగ్గొట్టడమే కాకుండా... నిరాధారమైన ఆరోపణలతో తనను సస్పెండ్ చేశారని, నా పట్ల ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని ఏపీ ఇంటెలిజెన్స్ లో పనిచేసి ఇటీవలే సస్పెండ్ అయిన ఏబీ వెంకటేశ్వరరావు క్యాట్ లో ఫిర్యాదు చేశారు.

కొన్ని వారాల క్రితమే ఐఏఎస్ అధికారి కృష్ణకిషోర్ క్యాట్ లో ఫిర్యాదుచేయగా, ఏబీ అలా ఫిర్యాదు చేసిన రెండో వ్యక్తి. తనకు 9 నెలలుగా జీతం ఇవ్వడం లేదని, ఏపీ ప్రభుత్వం తన పట్ల దురుద్దేశ పూరితంగా వ్యవహరిస్తోందని ఆయన క్యాట్ కు ఫిర్యాదు చేశారు. తన సస్పెన్షన్ ను చట్ట విరుద్ధమైనదిగా ప్రకటించాలని క్యాట్ ను కోరారు. చంద్రబాబు హయాంలో ఏబీ ఇంటలిజెన్స్ చీఫ్‌గా పని చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో నిఘా పరికరాల కొనుగోలులో అవకతవకలకు పాల్పడ్డారన్న కారణం చూపుతూ ఏపీ గవర్నమెంటు ఏబీపై సస్పెన్షన్ వేటు వేసింది. జగన్ అధికారం లోకి వచ్చాక ఏబీకి ఒక్క నెల వేతనం కూడా అందలేదు. గవర్నమెంటులో అవకతవకలన్నిటినీ జగన్ సర్కారు వెలికితీస్తోంది.

ఎవరినీ వదలకుండా చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో ఏబీ కూడా దొరికి పోయారు. అయితే... ఆయన తాను ఏ తప్పు చేయలేదని క్యాట్ లో ఫిర్యాదు చేశారు. ఎనిమిది నెలల పాటు తనను ప్రభుత్వం ఖాళీగా ఉంచిన విషయాన్ని కూడా ఏబీ ప్రస్తావించారు. తనపై ప్రభుత్వం చేసిన ఆరోపణలకు ఏ ఆధారాలు లేవని, అవన్నీ అసత్యాలని ... ఇందులో జోక్యం చేసుకుని తన పదవిని పునరుద్ధరించేలా ఆదేశాలిచ్చి జీతం ఇప్పించాలని ఏబీ క్యాట్ లో విన్నవించారు. ఏబీ కేసులో వింత ఏంటంటే... సస్పెన్షన్ కు ముందే జీతం ఆపడం. సాధారణంగా ఇలా జరగదు.