Begin typing your search above and press return to search.

మరో ఘనత సాధించిన విశాఖ ఎయిర్‌పోర్ట్‌ ..ఏంటంటే ?

By:  Tupaki Desk   |   3 Nov 2021 7:33 AM GMT
మరో ఘనత సాధించిన విశాఖ ఎయిర్‌పోర్ట్‌ ..ఏంటంటే ?
X
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయమైన విశాఖ ఎయిర్‌పోర్టు వరుస సర్వీసులతో దూసుకుపోతోంది. కోవిడ్‌ నుంచి కోలుకుని విమాన సర్వీసులను ఒక్కొక్కటిగా పెంచుకుంటూ పోతూ, తాజాగా హాఫ్‌ సెంచరీ మార్క్‌ కు చేరుకుంది. రాత్రి సమయంలోనూ ఢిల్లీ, బెంగళూరుకు వెళ్లేందుకు మరో రెండు సర్వీసులను ప్రారంభించింది.అతి త్వరలోనే దుబాయ్‌ కు కూడా విమాన సర్వీసు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. నౌకాదళ అనుమతులు వస్తే.. జంబో ఫ్లైట్‌ గా పిలిచే డ్రీమ్‌ లైనర్‌ సర్వీసు కూడా మొదలు పెట్టాలనే ఆలోచనలో ఉన్నారు అధికారులు.

కరోనా మహమ్మారి విజృంభణ కారణంగా నిలిచిపోయిన విమాన సర్వీసులు ఒక్కొక్కటిగా ప్రారంభమవుతున్నాయి. దేశీయ విమానాల రాకపోకలు మొదలైన తొలినాళ్లలో ప్రయాణికులు ఆసక్తి చూపకపోవడంతో సర్వీసులు నడిపేందుకు విమానయాన సంస్థలు కూడా ఆలోచనలో పడ్డాయి. విశాఖ విమానాశ్రయం నుంచి ఒకట్రెండు సర్వీసులతో కార్యకలాపాలు మొదలయ్యాయి. క్రమంగా నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సడలించడంతో.. విమాన ప్రయాణం వైపు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. విశాఖ విమానాశ్రయం నుంచి మే లో 143 విమానాలు రాకపోకలు సాగించగా.. ప్రస్తుతం సుమారు 1300 ఫ్లైట్‌ ఆపరేషన్స్‌ నడుస్తున్నాయి.

మేలో కేవలం 7,989 మంది మాత్రమే ప్రయాణాలు సాగించారు. ఆ తర్వాత నుంచి రాకపోకలు పుంజుకున్నాయి. అక్టోబర్‌లో ఏకంగా సుమారు 1.55 లక్షల మంది విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి ప్రయాణాలు సాగించారు.1981లో రోజుకు ఒక విమానం ద్వారా ఇక్కడ పౌర సేవలు ప్రారంభమయ్యాయి. సివిల్‌ ఎయిర్‌ క్రాఫ్ట్స్‌లకు 85 రన్‌ వే కెపాసిటీగా విధించారు. జెట్‌ ఎయిర్‌ వేస్‌ ఉన్నప్పుడు 80 విమానాలు రాకపోకలు సాగించాయి. జెట్‌ ఎయిర్‌ వేస్‌ సర్వీసులు గతంలో నిలిచిపోవడంతో కోవిడ్‌ కు ముందు వరకు 66 విమానాల రాకపోకలు సాగించాయి. కోవిడ్‌ కారణంగా సర్వీసులన్నీ రద్దయ్యాయి. దీంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. అన్‌లాక్‌ ప్రక్రియ తర్వాత క్రమంగా ఒక్కో సర్వీసు పెరుగుతూ వచ్చింది. నెల కిందటి వరకు 36 సర్వీసులతో నడవగా.. ఇప్పుడు ఏకంగా 50 మార్కుకు చేరుకుంది.

ఫ్లైట్‌ ఆపరేషన్లు క్రమంగా పుంజుకుంటున్న నేపథ్యంలో విశాఖ నుంచి బయలుదేరే సర్వీసులు క్రమంగా పెరుగుతున్నాయి. డిసెంబర్‌ నుంచి తొలిసారిగా తిరుపతికి నేరుగా విమానయానం ప్రారంభం కానుంది. రాత్రి వేళల్లోనూ సుదూర ప్రాంతాలకు వెళ్లేందుకు చాలా నెలల తర్వాత సర్వీసులు ప్రారంభమవుతున్నాయి. విశాఖ నుంచి ఢిల్లీ, బెంగళూరుకు నైట్‌ సర్వీసులు మొదలయ్యాయి.ప్రస్తుతం ఉన్న సౌకర్యాల ప్రకారం 300 మంది ప్రయాణికులతో నడిచే భారీ విమానం డ్రీమ్‌లైనర్‌ తరహా ఫ్లైట్‌ సర్వీసులను నడిపేందుకు ఎయిర్‌పోర్టు వర్గాలు ఆసక్తిగా ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న రన్‌వేను మరింత విస్తరిస్తే ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవచ్చు. ఇందుకు నౌకాదళం అనుమతి కచ్చితంగా అవసరం. ఎయిర్‌పోర్టు ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌(ఏటీసీ) మొత్తం నౌకాదళ ఆధీనంలో ఉండటం వల్ల వేచి చూడాల్సి వస్తోంది. ఈ కల నెరవేరే దిశగా అధికారులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇది విజయవంతమైతే విశాఖ వీధుల్లోంచి భారీ విమానం రయ్‌మని దూసుకెళ్లే అవకాశం ఉంది.