Begin typing your search above and press return to search.

కుంబ్లే..టీమిండియాకు ‘టర్నింగ్’ పాయింట్ అవుతాడా

By:  Tupaki Desk   |   23 Jun 2016 10:25 AM GMT
కుంబ్లే..టీమిండియాకు ‘టర్నింగ్’ పాయింట్ అవుతాడా
X
టీమిండియా హెడ్ కోచ్ గా భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లేను ఎంపిక చేశారు. కుంబ్లేను కోచ్ చేయడంలో మాజీ కెప్టెన్ గంగూలీ - టీమిండియా టెస్టు కెప్టెన్ కోహ్లీలు కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. డంకన్ ఫ్లెచర్ పదవీ విరమణ తర్వాత దాదాపుగా రెండేళ్లుగా కోచ్ లేకుండానే టీమిండియా కొనసాగింది. అయితే మాజీ బ్యాట్స్ మన్ రవిశాస్త్రి డైరెక్టర్ గా పదవీ బాధ్యతలు చేపట్టి కోచ్ లేని లోటు తీర్చారు. అయితే ఎన్నాళ్లని తాత్కాలిక ఏర్పాట్లతో ముందుకెళతామన్న బీసీసీఐ... కోచ్ ఎంపికకు ఇటీవల చర్యలు చేపట్టింది. ఈ పదవికి 57 దరఖాస్తులు వచ్చాయి. మాజీ డైరెక్టర్ రవిశాస్త్రితో పాటు అనిల్ కుంబ్లే - సందీప్ పాటిల్ - వెంకటేశ్ ప్రసాద్ తదితరులతో పాటు టామ్ మూడీ వంటి విదేశీ ఆటగాళ్లు కూడా అప్లయి చేశారు.

ఆ దరఖాస్తులను వడబోసి 20 మందితో ఓ జాబితాను రూపొందించిన బీసీసీఐ... వారిలో నుంచి హెడ్ కోచ్ ను ఎంపిక చేసే బాధ్యతను బీసీసీఐ భారత దిగ్గజ క్రికెటర్లకు అప్పగించింది. సచిన్ టెండూల్కర్ - సౌరవ్ గంగూలీ - వీవీఎస్ లక్ష్మణ్ లతో కూడిన త్రిసభ్య కమిటీ ఈ బాధ్యత చేపట్టింది. మూడు రోజులుగా పలువురిని ఇంటర్వ్యూ చేసిన ఈ కమిటీ తన నివేదికను బీసీసీఐకి రెండు రోజుల క్రితమే అందజేసింది. నివేదికను పరిశీలించిన బీసీసీఐ అనిల్ కుంబ్లేకు హెడ్ కోచ్ పదవి అప్పగించాలని నిర్ణయించింది. ఈ మేరకు నేటి సాయంత్రం ధర్మశాలలో భేటీ కానున్న బీసీసీఐ... కుంబ్లే నియామకాన్ని అధికారికంగా ప్రకటించనుంది.

కాగా ఎంపిక కమిటీలోని ముగ్గురు ఆటగాళ్లు సచిన్ - గంగూలీ - లక్ష్మణ్ లతో కుంబ్లేకు కలిసి ఆడిన అనుభవం ఉంది. సుదీర్ఘ ఇంటర్నేషన్ క్రికెట్ అనుభవం.. ఎన్నో రికార్డులతో పాటు ఎత్తుగడలు వంటి విషయాల్లో కుంబ్లే తెలివితేటలకు ప్రపంచవ్యాప్తంగా పేరుంది. స్వతాహాగా సాధు స్వభావుడైన - వివాద రహితుడైన కుంబ్లే కుర్రాళ్లతో కలిసిపోవడంలోనూ ముందుంటారన్న భావనలో ఆయన్ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.