Begin typing your search above and press return to search.

చంద్రబాబుది వంక‌ర‌బుద్ది... ఏపీ మంత్రి ఫైర్‌

By:  Tupaki Desk   |   21 Sep 2019 7:40 AM GMT
చంద్రబాబుది వంక‌ర‌బుద్ది... ఏపీ మంత్రి ఫైర్‌
X
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై ఏపీ నీటిపారుద‌ల శాఖ మంత్రి అనిల్‌ కుమార్ యాద‌వ్ సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. శ‌నివారం ఆయ‌న నెల్లూరులో విలేక‌రుల‌తో మాట్లాడుతూ ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు వయస్సు పెరిగినా వంకర బుద్ధి మాత్రం పోలేదన్నారు. సీఎం వైఎస్ జ‌గ‌న్‌ మోహ‌న్‌ రెడ్డి ప్రభుత్వంపై నిందలు మోపి దుష్ట‌ రాజకీయాలు చేయాలని చూస్తున్నార‌ని మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్ దుయ్య‌బ‌ట్టారు. పోల‌వ‌రం ప్రాజెక్ట్‌ పై రివర్స్‌ టెండరింగ్‌ అంటే చంద్రబాబుకు ఎందుకు ఉలికి ప‌డుతున్నాడ‌ని - కేవ‌లం రూ.300 కోట్ల ప్రాజెక్టులో రివర్స్ టెండ‌రింగ్ జ‌రిపితే దాదాపు 50 కోట్ల‌ను ఆదా చేసి ప్ర‌భుత్వానికి మిగిల్చామ‌ని మంత్రి అనిల్ అన్నారు.

చంద్ర‌బాబు పాల‌న‌లో జ‌రిగిన అవినీతి ప‌నులు ఇలా కుప్ప‌లు తెప్ప‌లుగా ఉన్నాయ‌ని.. అందుకు పోల‌వ‌రం రివ‌ర్స్ టెండ‌రింగ్ నిద‌ర్శనంగా నిలిచింద‌ని మంత్రి అనిల్ చెప్పారు. ఇలా చంద్ర‌బాబు పాల‌నంతా అవినీతి మ‌యమైంద‌ని - అవినీతి బ‌య‌ట‌ప‌డుతుంద‌నే చంద్రబాబు రివ‌ర్స్ టెండ‌రింగ్‌ కు బ‌య‌ప‌డుతున్నాడ‌ని మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్ అన్నారు. పోలవరం ఆపేశారని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదమ‌ని - నాడు మ‌హానేత వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి చేప‌ట్టిన ఈ ప్రాజెక్టును ఎట్టిప‌రిస్థితుల్లో ఆపేది లేద‌ని - కాకుంటే ఈ ప్రాజెక్టు పేరుతో జ‌రిగిని అవినీతిని బ‌య‌ట‌పెడుతామ‌ని మంత్రి అనిల్ స్ప‌ష్టం చేశారు.

నవంబర్ నుంచి పోలవరం పనులు ప్రారంభిస్తామని పదేపదే చెబుతున్నామ‌ని మంత్రి తెలిపారు. ఏపీలో చంద్ర‌బాబు పాల‌న‌లో టెండర్ల పేరుతో కోట్లాది రూపాయలను టీడీపీ ప్రభుత్వం దోచుకుంది. దోచుకున్న ప్ర‌తిపైసాను రివ‌ర్స్ టెండ‌రింగ్‌ తో క‌క్కిస్తామ‌ని మంత్రి అనిల్ స్ప‌ష్టం చేశారు. గడిచిన ఐదేళ్లలో చంద్రబాబు ఒక్క ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వకపోగా - అధికారంలోకొచ్చిన వంద రోజుల్లోనే వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం 1.26 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం చూసి జీర్ణించుకోలేక పేపర్‌ లీక్‌ అంటూ దరిద్రమైన ప్రచారం మొదలుపెట్టడం సిగ్గుమాలిన చర్య అంటూ దుయ్య‌బ‌ట్టారు.

సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి భవిష్యత్‌ తరాల కోసం చేస్తున్న మహాయజ్ఞాన్ని అధికారులు బాగా నిర్వహించినందుకు అభినందించాల్సింది పోయి తప్పుడు ప్రచారం చేసి ప్రజల్లో చులకన భావం కలిగించే ప్రయత్నాలు చేయడం మంచిది కాదన్నారు. మంత్రులు - ఎమ్మెల్యేలు - రాజకీయ నేతల జోక్యం లేకుండా పూర్తి పారదర్శకంగా గ్రామ / వార్డు సచివాలయ ఉద్యోగాల పరీక్షలను వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం నిర్వహించిందన్నారు మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌. ఇక‌నైనా ఏపీ మాజీ సీఎం చంద్ర‌బాబు దుష్ట రాజ‌కీయాలు మానుకోవాల‌ని మంత్రి హితువు ప‌లికారు.