Begin typing your search above and press return to search.

ఏపీకి 3 రాజధానులు.. జగన్ ప్లానేంటి?

By:  Tupaki Desk   |   18 Dec 2019 4:00 AM GMT
ఏపీకి 3 రాజధానులు.. జగన్ ప్లానేంటి?
X
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అసెంబ్లీ సాక్షిగా సంచలన ప్రకటన చేశారు. ఏపీకి మూడు రాజధానులు ఉండాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు. సౌతాఫ్రికాలో ఇలానే ఉందని.. అభివృద్ధి వికేంద్రీకరణ కోసం ఏపీకి మూడు రాజధానులు అవసరమని ప్రకటించారు. ఈ ప్రకటన తర్వాత పెద్ద వివాదం చెలరేగింది. అమరావతిని చంపేశారని ప్రతిపక్షాలు.. జగన్ నిర్ణయమే సరైందని మరికొందరు.. ఇంతకీ జగన్ నిర్ణయం రైటా? రాంగా?..

*కట్టుబట్టలతో ఆంధ్ర రాష్ట్రం
1953 అక్టోబర్ 1. తమిళుల నుంచి విడిపోయి ఆంధ్రులు రాష్ట్రంగా ఏర్పడ్డ రోజు. భాష ప్రయుక్త రాష్ట్రాల విభజన లో ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన రోజు.. తమిళనాడు రాజధాని చెన్నైలో ఎంతో మంది తెలుగు వారు పెట్టుబడులు పెట్టి.. ఆ నగర అభివృద్ధికి తోడ్పడ్డారు. కానీ దేశంలోనే 4వ అతిపెద్ద నగరాన్ని తమిళులకు వదిలేసి కట్టుబట్టలతో ఏ వసతులు లేని కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. నిస్సహాయంగా ఆంధ్రులు సంపన్న చైన్నై వదిలి కర్నూలు కు వచ్చారు. చెట్ల కింద ఆఫీసులు.. గుడారాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేసుకొని నిలువనీడ లేకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని పాలించారు.

* తెలంగాణతో కలిపి ఆంధ్రప్రదేశ్
1956, నవంబరు 1.. కర్నూలు రాజధానిగా ఉన్న ఆంధ్రారాష్ట్రాన్ని తెలంగాణ ప్రాంతాన్ని కలిపి ఆంధ్రప్రదేశ్ గా మార్చారు. అప్పటికే సంపన్న నగరంగా ఉన్న హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా చేశారు. కర్నూలును వదిలిని ఆంధ్రప్రజలంతా హైదరాబాద్ వచ్చేశారు. పెట్టుబడులు పెట్టారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి పాటుపడ్డారు. వృత్తి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. హైదరాబాద్ అభివృద్ధిలో ఆంధ్రుల కష్టం విడదీయరానిది..

* విభాజిత నవ్యాంధ్ర
జూన్ 2, 2014.. తెలంగాణ, ఏపీ తిరిగి విడిపోయిన రోజు. రాజధాని లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయింది. సంపన్న హైదరాబాద్ తెలంగాణకు పోయింది. రాజధాని లేకుండా ఆంధ్రప్రదేశ్ రోడ్డున పడింది. మెట్రో పాలిటన్ సిటీ.. తెలంగాణ ఆర్థిక అభివృద్ధి లో ఇప్పుడు హైదరాబాద్ ఆదాయమే కీలకం. ఇందులో ఆంధ్రుల పెట్టుబడులు ఎన్నో ఉన్నాయి.. అయినా అడ్డదిడ్డంగా విడదీసి ఏపీకి కేంద్రంలోని పెద్దలు అన్యాయం చేశారు. అడిగే నాథుడే లేకుండా పోయారు.

*ఆంధ్రా అన్యాయమై పోయింది..
ఈ మూడు సందర్భాల్లోనూ ఆంధ్రా అన్యాయమైపోయింది. ఆంధ్రులు ప్రతీసారి పరాయి వారిపై ఆధారపడి అక్కడి రాజధానులను అభివృద్ధి చేసి ఉత్త చేతులతో బయటకొచ్చిన పరిస్థితి చూశాం. నాడు తమిళులు చెన్నైని లాక్కొని ఆంధ్రులను రోడ్డునపడేశారు. నేడు హైదరాబాద్ తెలంగాణకు పోయి ఆంధ్రులు దిక్కులేనివారయ్యారు. ఆంధ్రులు మాత్రం అక్కడా ఇక్కడా ఆయా నగరాల అభివృద్ధిలో చెరగని ముద్రవేశారు. ఇప్పుడక్కడ రెండో పౌరులుగా మిగిలిపోయారు. అందుకే జగన్... భవిష్యత్ తరాలకు ఇదో పాఠంగా భావించారు. ఒక్క నగరాన్నే అభివృద్ధి చేస్తే రేపు పొద్దున సీమ వాసులు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడితే అంతా అమరావతిలోనే ఉంటే రాయలసీమకు ఇదే గతి పడుతుంది. ఉత్తరాంధ్రులు వేరుపడినా వారికి ఇదే గతి. అందుకే భవిష్యత్ తరాలను , గడిచిన దారుణాలను బేరిజు వేసుకొని అభివృద్ధి వికేంద్రీకరణకు జగన్ మూడు రాజధానుల ప్రకటన చేశారని చెప్పవచ్చు..

*నిధుల లభ్యత.. ప్రజల ఆంక్షాలకు పట్టం
ఏపీ అప్పుల్లో ఉంది. పైగా ఆర్థిక మాంద్యం ఉంది. రాజధాని కూడా లేని రాష్ట్రంగా నిలువనీడ లేదు. అందుకే రాజధాని నిర్మాణం ఇప్పుడున్న ఏపీ ఆర్థిక పరిస్థితి ప్రకారం అసాధ్యం. అప్పులు తెచ్చి కట్టి ప్రజల నెత్తిన పెట్టి దివాళా తీయడం కంటే ఉన్నవాటితోనే సర్దుకుంటే మేలు. జనాలకు కనీస అవసరమైన సాగు, తాగు నీరు అందించకుండా రాజధానికి డబ్బులు ఖర్చు పెట్టడం అంత దుర్మార్గం మరోటి కాదు. అందుకే జగన్ ముందుగా ప్రజలకు ప్రత్యక్షంగా మేలు చేసే నవరత్నాలు, సాగు, తాగునీరు, ప్రాజెక్టు, విద్య, వైద్యరంగాలకు నిధులు కేటాయించారు. ఆ తర్వాత మిగిలితే రాజధాని. కానీ ఇప్పుడు లక్షల కోట్లు ఖర్చయ్య రాజధాని వల్ల ఏపీకి వచ్చే తక్షణ లాభాలు లేవు. అందుకే ఆల్ రెడీ అభివృద్ధి చెందిన అన్ని వసతులు ఉన్న విశాఖలో అడ్మినిస్ట్రేటివ్, కర్నూలులో హైకోర్టు, అమరావతిలో చట్టసభలు ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నారు.

ఇక్కడ ప్రజల ఆంక్షాక్షలను కూడా గౌరవించాలి. ఇప్పటికే రాయలసీమ వాసులు ఏపీ హైకోర్టు కర్నూలు లో పెట్టాలని నినదిస్తున్నారు. ఉత్తరాంధ్ర వాసులు తమను అభివృద్ధిలో భాగస్వాములను చేయాలని కోరుతున్నారు. అందుకే అందరి అభివృద్ధి, ఆకాంక్షలను భూజాలపై మోస్తున్న సీఎం జగన్ మూడు ప్రాంతాలకు న్యాయం చేసేందుకు ఈ మూడు రాజధానులు ప్రకటన చేశారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.