Begin typing your search above and press return to search.

ఫోన్లో మాట్లాడుతున్న కూతురును చంపేశాడు..

By:  Tupaki Desk   |   1 July 2018 10:49 AM GMT
ఫోన్లో మాట్లాడుతున్న కూతురును చంపేశాడు..
X
కృష్ణా జిల్లాలో దారుణం జరిగింది. కన్నతండ్రే కూతురును గొడ్డలితో కర్కషంగా నరికి చంపాడు. జిల్లాలోని చందర్లపాడు మండలం తోటరావులపాడు గ్రామంలో చోటుచేసుకున్న ఈ పరువు హత్య సంచలనం సృష్టించింది.

కన్న కూతురు కొద్దిరోజులుగా ఎవరో వ్యక్తితో ఫోన్లో తెగ మాట్లాడుతోంది. దీన్ని జీర్ణించుకోలేని తండ్రి ఈ దారుణానికి పాల్పడ్డాడు. కూతురు అతనితో ప్రేమలో ఉందని అనుమానించి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.

తోటరావులపాడు గ్రామానికి చెందిన కోటయ్య-పద్మావతి దంపతులకు ఇద్దరు కూతుళ్లు.. కోటయ్య వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పద్మావతి ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్ గా చేస్తోంది. వీరి పెద్ద కూతురు గుడ్లవల్లేరులోని కళాశాలలో బీఫార్మసీ పూర్తి చేసింది. పై చదువులకు సిద్ధమవుతోంది. శుక్రవారమే పుట్టినరోజు వేడుకలు జరుపుకును చంద్రిక శనివారం తండ్రి చేతిలో మృత్యువాతపడింది.

శనివారం ఇంట్లో ఆమె సెల్ ఫోన్ లో మాట్లాడుతుండగా... గమనించిన తండ్రి ఆగ్రహంతో గొడ్డలితో గట్టిగా కొట్టాడు. దీంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. కళ్ల ముందే కుమార్తె విగతజీవిగా మారడంతో తల్లడిల్లిన తల్లి సృహ కోల్పోయింది. చంద్రిక చనిపోయిందని తెలుసుకున్న తండ్రి ఆ తర్వాత పారిపోయాడు. ప్రస్తుతం తండ్రిని పట్టుకొని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ ఘటనపై చనిపోయిన చంద్రిక తాత పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చంద్రిక ఒకరిని ప్రేమిస్తోందని.. అతడినే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతోనే కోపంలో తండ్రి కోటయ్య కొట్టాడని.. దీంతో ఆమె మృతిచెందిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు.