Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ కు మ‌ళ్లీ పిలుపు వ‌చ్చింది

By:  Tupaki Desk   |   7 May 2016 8:14 AM GMT
ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ కు మ‌ళ్లీ పిలుపు వ‌చ్చింది
X
2019 ఎన్నిక‌ల నాటికి పూర్తిస్థాయిగా రాజ‌కీయాల్లోకి వ‌స్తాన‌ని జ‌న‌సేన అధినేత‌ - ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ ఆయ‌న‌ పేరు మ‌రోమారు తెర‌మీద‌కు వ‌స్తోంది. ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేకహోదా ఇచ్చేది లేదని కేంద్రమంత్రులు తేల్చి చెప్పడంతో పాటు మ‌రిన్ని ప‌రిస్థితుల నేప‌థ్యంలో జనసేనాని వైపు ఆంధ్ర‌ప్ర‌దేశ్ వాసులు ఆస‌క్తిగా చూస్తున్నారు. ఎన్నిక‌ల హామీ మేర‌కు ఏపీకి కేంద్రం - ప్రత్యేకహోదా ఇస్తుందని ఇప్పటి వరకు ఆశాభావం వ్యక్తం చూస్తూ వచ్చిన పవన్ - ఇప్పుడు ఇచ్చేది లేదని కేంద్రం తేల్చిచెప్పిన త‌ర్వాత త‌న వైఖరిమేమిటో స్పష్టం చేయకపోవడం ఏపీ రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయంశంగా మారింది.

ఏపీలోని ఎనిమిది జిల్లాల రైతాంగానికి నష్టం కలిగించేలా తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులు చేపడుతోంద‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ వాసుల్లో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ సాగునీటి ప్రాజెక్టులపై ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రీశైలం ప్రాజెక్టు వద్ద భారీ ధ‌ర్నా నిర్వహించింది. ఈనెల 16 నుంచి వైస్సార్సీపీ అధినేత జగన్ మోహన్‌ రెడ్డి మూడు రోజులపాటు నిరహారదీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టులపై అధికార తెలుగుదేశం పార్టీ సైతం అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ, కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోనిపక్షంలో సుప్రీంను ఆశ్రయించాలని యోచిస్తోంది. ఈ ప్రాజెక్టుల విష‌యంలో పవన్ తన అభిప్రాయమేమిటో ఇప్పటి వరకు స్పష్టం చేయలేదు.

అత్యంత వివాదాస్పదంగా మారిన ఫిరాయింపుల వ్యవహారంపై పవన్ తన వైఖరేమిటో చెప్పడం లేదన్న విమర్శలున్నాయి. ఒక రాజకీయ పార్టీగా - ఫిరాయింపులపై తన వైఖరి చెప్పాల్సిన అవసరముందంటున్నారు. అయితే ఈ విషయంలో ఒక పార్టీ అధినేతగా పవన్ - ఎందుకు మౌనంగా ఉంటున్నారో, అంతుబట్టడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. రాయలసీమలో అనంతపురం - కర్నూలు - కడప - కోస్తాలో గుంటూరు - ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం - విజయనగరం - విశాఖ మన్యం కరవుపీడిత ప్రాంతాలుగానే ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో రాష్ట్రంలో విలయతాండవం చేస్తున్న క‌రువుపై ప‌వ‌న్ స్పందించాల‌ని సామాన్యులు ఆకాంక్షిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం అనుమతులు లేకుండా చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలపైనయిన పవన్ స్పందిస్తారేమోనని రాష్ట్ర రైతాంగం ఆశగా ఎదురుచూస్తోంది.

మొత్తంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కు కీల‌క‌మైన ప్రత్యేకహోదాపైనే కాకుండా రాష్ట్రంలోని అనేక సమస్యలపై పవన్ వైఖరేమిటో స్పష్టం చేయాలనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇపుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్పందించాల్సిన స‌మ‌యం వ‌చ్చింది. ఇంత‌కీ జ‌న‌సేనాని త‌న వైఖ‌రిని ఎప్పుడు ప్ర‌క‌టిస్తారో వేచి చూడాల్సిందే.