Begin typing your search above and press return to search.

చాలామందికి టీవీలు బద్ధలు కొట్టాలనిపించిందట

By:  Tupaki Desk   |   8 Sep 2016 5:30 PM GMT
చాలామందికి టీవీలు బద్ధలు కొట్టాలనిపించిందట
X
అదేదో అద్భుతాన్ని ఇస్తున్నట్లుగా బిల్డప్ ఇచ్చి.. ఎంగిలి మెతుకులు రాల్చిన మోడీ సర్కారు ప్రత్యేక ప్యాకేజీ మీద సీమాంధ్రుల స్పందన ఏమిటి? వారు ఎలా ఫీలయ్యారు? వారి స్పందన ఏమిటి? లాంటి సందేహాలు సహజంగా వచ్చేవే. ఈ అంశం మీద ప్రముఖ మీడియా సంస్థలు పెద్దగా ఫోకస్ చేయలేదు. వాస్తవానికి ఇలాంటివి చోటు చేసుకున్నప్పుడు.. మొత్తంగా ప్రజా స్పందన ఏమిటన్న విశ్లేషణతో రాజకీయ కథనాలు ఇవ్వటం మీడియాకు అలవాటే. కానీ.. అందుకు భిన్నమైన పరిస్థితి తాజాగా నెలకొంది.

ఎందుకలా? కారణం ఏమిటి? ప్రముఖ మీడియా సంస్థలు అలా ఎందుకు వ్యవహరిస్తున్నాయి? లాంటి ప్రశ్నల్ని పక్కన పెట్టి.. జైట్లీ ప్యాకేజీ మీద సగటు సీమాంధ్రుడి స్పందన ఏమిటన్న అంశంలోకి వెళితే ఆసక్తికర అంశాలు బయటకు రాక మానవు. ప్రత్యేక హోదా మీద గడిచిన కొంతకాలంగా హాట్ హాట్ డిస్కక్షన్స్ జరుగుతున్న నేపథ్యంలో.. బ్రహ్మండం బద్ధలవుతుందన్న చందంగా కేంద్రం వ్యవహరించటం.. ఏపీకి ఏదో అద్భుతమైన ప్యాకేజీ ఇస్తున్నట్లుగా మీడియాలో హైప్ పెరగటం సీమాంధ్రుల్లో సరికొత్త ఆశలు మొగ్గతొడిగాయ్.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఒత్తిడి కావొచ్చు.. తిరుపతిలో పవన్ కల్యాణ్ చేసిన ఘాటు ప్రసంగం కేంద్రంలో కదలిక తీసుకొచ్చి.. సీమాంధ్రులకు ఏదో చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లుగా భావించారు. కానీ.. వాస్తవం అందుకు భిన్నంగా ఉండటంతో సీమాంధ్రుల తెగ సీరియస్ అవుతున్నారు. ఏపీకి ఇచ్చే ప్యాకేజీ మీద మధ్యాహ్నం రెండు గంటలకు ప్రకటన ఉంటుందని ఒకసారి.. కాదు కాదు సాయంత్రమని మరోసారి.. ఇదేమీ కాదు గురువారమే అని కాసేపు.. ఇలా రకరకాల ఊహాగానాలు వినిపించటం.. ఢిల్లీ నుంచి వచ్చేసమాచారం గంట గంటకు మారటంతో భారీ ఉత్కంట నెలకొంది.

దీన్ని మరింత పెంచేలా 24 గంటల వార్తా ఛానళ్లు వ్యవహరించటంతో మరింత హైప్ క్రియేట్ అయ్యింది. కేంద్రం తయారు చేసిన ప్యాకేజీ ముసాయిదాను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు పంపినట్లుగా బ్రేకింగ్ న్యూస్ బయటకు రావటం ఒక ఎత్తు అయితే.. కొన్ని మార్పుల్ని బాబు సూచించారన్న సమాచారం ఈ హైప్ ను భారీగా పెరిగేలా చేసింది. ఏదో జరుగుతుందన్న భావనతో చాలామంది సీరియల్స్ ను వదిలేసి మరీ.. న్యూస్ ఛానళ్లకు అతుక్కుపోయిన పరిస్థితి.

కాసేపటికి.. మరికాసేపటికి అంటూ ఊరిస్తూ నిద్ర పోనివ్వకుండా చేయటంలో వార్తా ఛానళ్లు సక్సెస్ అయ్యాయి. గంటల కొద్దీ వెయిట్ చేసిన దానికి ఫలితం అన్నట్లు అర్థరాత్రికి కాస్త ముందుగా ఆర్థిక మంత్రి జైట్లీ ప్రెస్ మీట్ విన్న వారికి పెద్ద షాక్ తగిలినట్లైంది. అప్పటివరకూ కొండంత ఆశ పెట్టుకున్న వారికి నిరాశ నిస్పృహలతో పాటు.. ఆవేశం తన్నుకొచ్చిన పరిస్థితి. కేంద్రం తీరు అవమానభారంగా మారిన సీమాంధ్రులకు తర్వాత ప్రెస్ మీట్ పెట్టిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రెస్ మీట్ సాంత్వన కలిగించే కన్నా.. ఒంట్లో రక్తాన్ని సలసలా కాగేలా చేసింది. బిచ్చం వేసినట్లుగా కేంద్ర ప్యాకేజీ ఉండటంతో కడుపు మండిన సీమాంధ్రులకు.. బాబు ప్రెస్ మీట్ అనగానే కేంద్రంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడతారని ఊహించారు.

తన ఘాటు వ్యాఖ్యలతో కేంద్రంపై చంద్రబాబు మండిపడతారని భావించిన దానికి భిన్నంగా ఆచితూచి మాట్లాడుతూ.. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీపై బాబు స్పందన చూసిన చాలామంది సీమాంధ్రులు ఆగ్రహంతో ఊగిపోయారు. విభజన నాటి నుంచి నేటి వరకూ అవమానాల మీద అవమానాలు.. కష్టాల మీద కష్టాలు పడుతున్న దానికి కారణంగా తాము ఎన్నుకున్న ప్రజాప్రతినిధులే అన్న భావనలో ఉన్న వారికి.. తాజా ఎపిసోడ్ మరింత బలాన్ని చేకూరేలా చేసిందనటంలో సందేహం లేదు. కొందరు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సర్కారుపై తీవ్రంగా మండిపడితే.. మరికొందరికి మాత్రం టీవీ సెట్లు బద్ధలుకొట్టాలన్న ఆవేశం తన్నుకొచ్చిందట.