Begin typing your search above and press return to search.

ఇప్పుడు ’’అమరావతి’’లో ఏం జరుగుతోంది?

By:  Tupaki Desk   |   25 Oct 2015 5:16 AM GMT
ఇప్పుడు ’’అమరావతి’’లో ఏం జరుగుతోంది?
X
ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించటానికి దాదాపు రెండు వారాల నుంచి విపరీతమైన ఆసక్తి వ్యక్తమైంది. ఇక శంకుస్థాపన కార్యక్రమం అయితే.. తెలుగు ప్రజలంతా ఈ కార్యక్రమం పట్ల ప్రత్యేక ఆసక్తి ప్రదర్శించారు. అనుకున్నట్లే శంకుస్థాపన కార్యక్రమం పూర్తి అయ్యింది. లక్షలాది మందిగా పాల్గొన్న కార్యక్రమాన్ని నభూతో నభవిష్యతి అన్నట్లుగా నిర్వహించటంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. దేశ ప్రధాని చేతుల మీదుగా శిలాన్యాసం జరిగిన శంకుస్థాపన ప్రాంతంలో తాజా పరిస్థితి ఏమిటి?

అక్కడ ఏర్పాటు చేసిన వేదిక.. శిలాన్యాస్ చేసిన ప్రాంతం ఎలా ఉంది? అన్న ప్రశ్న వేస్తే సమాధానం ఆసక్తికరంగా ఉంటుంది. శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించిన ప్రదేశాన్ని చూడటానికి ఇప్పటికీ పెద్ద ఎత్తున ప్రజలు రావటం విశేషం. శంకుస్థాపన జరిపిన ప్రాంతం ఇప్పుడో యాత్రాస్థలిగా మారింది. రద్దీ కారణంగా అవస్థలు పడతామని భావించిన చాలామంది శంకుస్థాపన కార్యక్రమానికి హాజరు కాలేదు. ఇలాంటి వారంతా ఇప్పుడు వస్తున్నారు. దీనికి తోడు.. సెలవుల్లో శంకుస్థాపన ప్రాంతం ఒక యాత్రా స్థలిగా మారింది. దీనికి శనివారం శంకుస్థాపన ప్రాంతానికి వచ్చిన ప్రజల సంఖ్యే నిదర్శనంగా చెప్పొచ్చు. ఈ ఆదివారం మరింత ఎక్కువ మంది రావటం ఖాయమని చెబుతున్నారు.

శంకుస్థాపన కార్యక్రమం పూర్తి అయిన తర్వాత కూడా ఏపీ సర్కారు.. ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పుడు ఈ ప్రాంతంలో భద్రత కోసం దాదాపుగా వంద మందికి వరకు (ఏ క్షణంలో అయినా) పోలీసులు పహరా కాస్తున్నారు. శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించిన ప్రదేశంలో ఏర్పాటు చేసిన పెవిలియన్ యాత్రికులకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. త్రీడీ నమూనా పట్ల అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. భవిష్యత్తురాజధాని ఎలా ఉంటుందన్న నమూనా దగ్గర సెల్ఫీలో తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నా.. అక్కడున్న పోలీసులు అనుమతించటం లేదు.

అమరావతి శంకుస్థాపన ప్రాంతంలో ఏర్పాటు చేసిన సంకల్ప జ్యోతి.. యాగశాల.. శంకుస్థాపన జరిగిన ప్రాంతం.. పెవిలియన్.. మననీరు.. మన మట్టి కార్యక్రమంలో భాగంగా సేకరించిన మట్టి ఉంచిన ప్రదేశంతో పాటు.. శిలాన్యాస్ చేసిన చోట కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించిన ప్రదేశానికి ఉన్న ప్రత్యేకత దృష్ట్యా ఇక్కడ ఏదైనా శాశ్విత రక్షణ ఏర్పాట్లు చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. త్వరలో ఈ ఏర్పాట్లు జరుగుతాయని చెబుతున్నారు. ఇక.. సంకల్పజ్యోతి ఇప్పటికీ వెలుగుతూనే ఉంది. ఈ జ్యోతి నిరంతరం వెలుగుతూ ఉండటం కోసం నిత్యం 30 సిలిండర్ల గ్యాస్ ను వినియోగిస్తున్నారు. శంకుస్థాపన రోజు నుంచి పది రోజుల పాటు దాన్ని అలాగే ఉంచాలని నిర్ణయించారు. దీనిపై భవిష్యత్తు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. శంకుస్థాపన ముందే కాదు.. తర్వాత కూడా ఈ ప్రాంతం పట్ల చుట్టుపక్కల జిల్లాల వారందరిలో ప్రత్యేక ఆసక్తి వ్యక్తమవుతోంది.