Begin typing your search above and press return to search.

ఆంధ్రా ద్రోహులు వెంకయ్య.. మోదీ

By:  Tupaki Desk   |   9 Aug 2015 11:44 AM GMT
ఆంధ్రా ద్రోహులు వెంకయ్య.. మోదీ
X
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏపీ ప్రజలకు భారతీయ జనతా పార్టీతోపాటు ఆ పార్టీ నాయకులు వెంకయ్య నాయుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వెన్ను పోటు పొడిచారని, ద్రోహులుగా మారారని ఏపీ ప్రజలు ధ్వజమెత్తుతున్నారు. రాష్ట్ర విభజనకు వెంకయ్య ప్రధాన కారకుడని, అప్పట్లో లోక్ సభలో చర్చ జరగకుండా జరగడానికి కూడా ఆయనే కారకుడని, రాజ్యసభ లో విభజన అంశాన్ని చాప చుట్టేయడానికి తెర వెనుక పాత్ర పోషించాడని, వెంకయ్య నాయుడు ఆంధ్రా ద్రోహి అని మండిపడుతున్నారు.

రాష్ట్ర విభజనకు మిగిలిన పక్షాలు విముఖత వ్యక్తం చేస్తున్న సమయంలో బీజేపీ తరఫున తాము అనుకూలమని, తెలంగాణ ఏర్పాటు చేయాలని 1994లోనే కాకినాడ లోనే తాము తీర్మానించామంటూ వెంకయ్య ముందుకు రావడాన్ని గుర్తు చేస్తున్నారు. ఆ తర్వాత ఏపీ ప్రయోజనాలను పక్కన పెట్టి, తెలంగాణను ఏ విధంగా ఏర్పాటు చేయాలనే చివరి వరకు వెంకయ్య నాయుడు ప్రయత్నించారని గుర్తు చేస్తున్నారు. చివర్లో రాష్ట్ర విభజనకు ఏపీ నాయకులు ఒప్పుకోకపోతే, రాష్ట్ర విభజనను సాఫీ చేసి తెలంగాణను ఏర్పాటు చేయడానికే వెంకయ్య ప్రత్యేక హోదా అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని వివరిస్తున్నారు. ఈ విషయాలను మరుగున పరచి, తెలంగాణకు తాను అనుకూలంగా ఉన్న విషయాన్ని పక్కన పెట్టి, ఏపీకి తాను ఏదో గొప్ప చేసినట్లు ఆయన ప్రచారం చేసుకున్నారని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కూడా కేంద్రంలో మంత్రిగా ఉండి కూడా ప్రతిరోజూ మోదీ భజన తప్పితే వెంకయ్య ఏపీకి చేసేది ఏమీ లేదని, గత బడ్జెట్ లో ఇవ్వాల్సిన నిధులు కూడా ఇవ్వలేదని గుర్తు చేస్తున్నారు.

వెంకయ్య నాయుడు రాష్ట్ర విభజనకు ముందు నుంచి ఇప్పటి వరకు ఆంధ్రా ద్రోహి గా మారాడని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పుడు తిరుపతిలో ఒక వ్యక్తి ఆత్మాహుతి చేసుకోవడానికి కూడా వెంకయ్యే కారణమని ఆరోపిస్తున్నారు.