Begin typing your search above and press return to search.

విశాఖ మెట్రో ప్రాజెక్ట్.. ఫైనాన్షియ‌ల్ బిడ్ ర‌ద్దు

By:  Tupaki Desk   |   30 Dec 2019 3:03 PM IST
విశాఖ మెట్రో ప్రాజెక్ట్.. ఫైనాన్షియ‌ల్ బిడ్ ర‌ద్దు
X
విశాఖ ప‌ట్నం మెట్రో ప్రాజెక్ట్ విష‌యంలో ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. గ‌త ప్ర‌భుత్వ హాయంలో కుదిరిన ఫైనాన్షియ‌ల్ బిడ్ ను వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం ర‌ద్దు చేసింది. ధ‌ర విష‌యంలో త‌గ్గించుకోవాల్సింగా ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేసిన సూచ‌న విష‌యంలో ఎస్సెల్ ఇన్ ఫ్రా క‌న్సార్షియం స్పందించ‌క‌పోవ‌డంతో.. ఫైనాన్షియ‌ల్ బిడ్ ను ర‌ద్దు చేస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. మొత్తం 8300 కోట్ల రూపాయ‌ల‌కు ఫైనాన్షియ‌ల్ బిడ్ ను దాఖ‌లు చేసింది సద‌రు సంస్థ‌. అది కూడా ఒకే ఒక సంస్థ త‌ర‌ఫున అప్ప‌ట్లో బిడ్ దాఖ‌లు కావ‌డం గ‌మ‌నార్హం. ఆ ధ‌ర విష‌యంలో సీఎం జ‌గ‌న్ స‌మీక్షించారు. త‌గ్గించుకోవాల్సిందిగా కోరారు. అయితే ఆ సంస్థ అందుకు నిరాక‌రించ‌డంతో బిడ్ ను ర‌ద్దు చేసిన‌ట్టుగా ప్ర‌క‌ట‌న వ‌చ్చింది.

మూడు కారిడార్లుగా 42.55 కిలోమీట‌ర్ల ప‌రిధిలో విశాఖ మెట్రో ప్రాజెక్టును చేపట్టాల‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. విశాఖ‌కు మెట్రో రైలు సౌక‌ర్యం ఏర్పాటు చేస్తే రాజ‌ధానిగా అది అద్భుత‌మైన ప్రాంతం అవుతుంద‌ని ఇటీవ‌లే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ అసెంబ్లీలో కూడా వ్యాఖ్యానించారు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు పాత ఫైనాన్షియ‌ల్ బిడ్ ను ర‌ద్దు చేసి.. కొత్త వారిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటూ ఉంది జ‌గ‌న్ ప్ర‌భుత్వం. డీపీఆర్ త‌యారీ కోసం కొత్త క‌న్స‌ల్టెంట్ ను ఏర్పాటు చేయాల‌ని కూడా ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.

పబ్లిక్ - ప్రైవేట్ పార్టిసిపేష‌న్ విధానంలో ఈ ప్రాజెక్టును చేప‌డుతున్నారు. ఎన‌భై మూడు ఎక‌రాల ప్ర‌భుత్వ భూమితో పాటు మ‌రో ప‌న్నెండు ఎక‌రాల ప్రైవేట్ భూమిని సేక‌రించ‌నున్నారు. మొత్తం నాలుగు వేల రెండు వంద‌ల కోట్ల రూపాయ‌ల రుణం తీసుకోవాల్సి ఉంది ప్ర‌భుత్వం.

ఇప్పుడు ఫైనాన్షియ‌ల్ బిడ్ ర‌ద్దు చేయ‌డంతో మ‌ళ్లీ కొత్త బిడ్స్ ను ఆహ్వానించాల్సి ఉంది. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో కేవ‌లం ఒకే ఒక సంస్థ త‌ర‌ఫు నుంచి బిడ్ దాఖ‌లు అయిన నేప‌థ్యంలో.. ఇప్పుడేం జ‌రుగుతుంద‌నేది ఆస‌క్తిదాయ‌కంగా మారింది.