Begin typing your search above and press return to search.

పన్నెండు జిల్లాలు కానున్న రాయలసీమ?

By:  Tupaki Desk   |   21 Oct 2019 12:25 PM IST
పన్నెండు జిల్లాలు కానున్న రాయలసీమ?
X
జిల్లాల పెంపు విషయంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మొదట్నించి ఒకే స్టాండ్ మీద ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏపీలో జిల్లాల సంఖ్యను పెంచే విషయంపై జగన్ ప్లాన్ చేస్తున్నారు. అయితే.. తెలంగాణలో పెంచిన జిల్లాల కారణంగా పాలనా పరంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులతో పాటు.. లాజిస్టిక్స్ పరంగా చోటు చేసుకుంటున్న పరిణామాల్ని అధ్యయనం చేస్తున్న నేపథ్యంలో.. జిల్లాల పెంపుపై తొందరపాటు పడకూడదన్న భావనలో ముఖ్యమంత్రి ఉన్నట్లు చెబుతారు.

ఇదిలా ఉంటే.. ఏపీలో జిల్లాల పెంపు ఎలా ఉన్నా.. రాయలసీమ ముఖచిత్రాన్ని మార్చాలన్న ఆలోచనలో ముఖ్యమంత్రి జగన్ ఉన్నట్లు చెబుతారు. ఇందులో భాగంగా గ్రేటర్ రాయలసీమను చేయాలని.. అందులోకి ప్రకాశం.. నెల్లూరు జిల్లాల్ని తీసుకురావటం ద్వారా సంపూర్ణమవుతుందని భావిస్తున్నారు.

ఇప్పుడున్న నాలుగు జిల్లాలకు అదనంగా రెండు జిల్లాల్ని ఏకంగా పన్నెండు జిల్లాలుగా మార్చాలన్న ఆలోచనపై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా కర్నూలు జిల్లాను మొత్తం మూడు జిల్లాలుగా.. అనంతపురం జిల్లాను రెండుగా.. చిత్తూరును మూడుగా.. కడప జిల్లాను రెండుగా విభజించాలని భావిస్తున్న జగన్.. నెల్లూరు.. ప్రకాశం జిల్లాల్ని మాత్రం యథాతధంగా ఉంచాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.

స్థానిక జనాభా.. ఎంపీ.. ఎమ్మెల్యే స్థానాల ఆధారంగా జిల్లాల విభజన ఉండనున్నట్లుగా తెలుస్తోంది. ఇదంతా వచ్చే ఏడాది కాలంలో పూర్తి చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా సమాచారం. జిల్లాల్ని పెంచాలనుకునే వేళ.. ప్రభుత్వానికి స్థానిక ఎన్నికల వ్యవహారం తెర మీదకు వచ్చింది. ముందుగా కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేసి ఎన్నికలకు వెళ్లాలా? లేదంటే ఎన్నికలు పూర్తి అయ్యాక కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేయాలన్న దానిపై ప్రభుత్వం తేల్చుకోలేకపోతున్నట్లు చెబుతున్నారు.

తెలంగాణలో పెంచిన జిల్లాలతో ఎదురవుతున్న సమస్యల్ని అధిగమించేందుకు ఏమేం చర్యలు తీసుకోవాలన్న అంశం మీదా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఏమైనా.. జిల్లాల పెంపు విషయం తప్పనిసరి అని.. కాకుంటే కొత్త జిల్లాల ఏర్పాట్లతో మరిన్ని చిక్కుముడలకు అస్కారం లేకుండా చేయాలన్నది ఆలోచనగా తెలుస్తోంది.