Begin typing your search above and press return to search.

ఆంధ్రప్రదేశ్ లో మరో ఆసక్తికర స్కీమ్

By:  Tupaki Desk   |   22 May 2016 11:19 AM IST
ఆంధ్రప్రదేశ్ లో మరో ఆసక్తికర స్కీమ్
X
జనాల్ని ఆకర్షించాలంటే ఉచిత ఆఫర్లు ప్రకటించడం కంటే గొప్ప మార్గమేమీ లేదని పార్టీలు.. ప్రభుత్వాలు మహ బాగా అర్థం చేసుకుంటున్నట్లున్నాయి. ఇప్పటికే అమలు చేస్తున్న అనేకానేక ఉచిత కార్యక్రమాలకు తోడు.. ‘ఉచిత భక్తి’ని కూడా అందించడానికి ప్రణాళికలు రచిస్తోంది ఆంధ్రప్రదేశ్ సర్కారు. భారతీయ జనతా పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖా మంత్రి పి.మాణిక్యాలరావు ఆధ్వర్యంలో ‘దివ్యదర్శనం’ పేరుతో ఎంపిక చేసిన భక్తుల్ని ఉచితంగా కొన్ని ఆలయాలకు తీసుకెళ్లి దర్శన సదుపాయం కల్పించే స్కీమును ఆరంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

ఈ పథకం గురించి మంత్రి మాణిక్యాలరావు - ఏపీ ఎండోమెంట్ శాఖ కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ ముఖ్యమంత్రి చంద్రబాబు తో చర్చించారు కూడా. ఆయన కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీని ప్రకారం రాష్ట్రంలోని పదమూడు జిల్లాల నుంచి ఒక్కో జిల్లాకు పది వేల మంది చొప్పున.. అంటే మొత్తం లక్షా 13 వేల మందిని ఎంపిక చేసి ఏటా ఒకసారి నాలుగు ప్రదాన పుణ్యక్షేత్రాలకు ఉచితంగా తీసుకు వెళ్తారు. రవాణా.. వసతి.. భోజనం.. దర్శనం అన్నీ ఉచితమే.

ప్రధానంగా పేద భక్తుల కోసం ఈ స్కీమ్ ను ఆరంభించినట్లు చెబుతున్నారు. 90 శాతం ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన భక్తుల్ని ఎంపిక చేసి ఆలయాలకు తీసుకువెళ్లాలన్నది ప్రణాళిక. తిరుమల.. విజయవాడ కనక దుర్గ ఆలయం..అన్నవరం.. సింహాహాచలం.. శ్రీశైలం.. కాణిపాకం లాంటి ఆలయాల్ని ఇందుకోసం ఎంపిక చేశారు. ఐతే భక్తుల ఎంపిక ఎలా ప్రక్రియ ఎలా అన్నది తేలాల్సి ఉంది. పేద భక్తుల కోసం పెడుతున్న ఈ ఉచిత దర్శన పథకం మంచిదే కదా.