Begin typing your search above and press return to search.

ఏపీ రాష్ట్ర పుష్పం.. రాష్ట్ర ప‌క్షి మారిపోయాయ్‌

By:  Tupaki Desk   |   31 May 2018 10:59 AM IST
ఏపీ రాష్ట్ర పుష్పం.. రాష్ట్ర ప‌క్షి మారిపోయాయ్‌
X
స‌రైన స‌మ‌యంలో స‌రైన నిర్ణ‌యం తీసుకోవ‌టం ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు అస్స‌లు ఇష్టం ఉండ‌ద‌న్న‌ట్లుగా ఉంటుంది ఆయ‌న తీరు. విభ‌జ‌న నేప‌థ్యంలో రాష్ట్రానికి సంబంధించి తీసుకోవాల్సిన కీల‌క నిర్ణ‌యాల కోసం ఏళ్ల‌కు ఏళ్లు మ‌దింపులు చేయ‌టం బాబు స‌ర్కారుకే సాధ్య‌మవుతుంద‌ని చెప్పాలి.

విభ‌జ‌న అనంత‌రం రాష్ట్ర పుష్పం.. రాష్ట్ర ప‌క్షి లాంటి వాటిని ఎంపిక చేయాల్సి వ‌చ్చింది. అయితే.. దీనిపై నిర్ణ‌యాన్ని నాలుగేళ్లు పూర్తి అయ్యాక కానీ కుద‌ర్లేదు. త‌ర్జ‌న‌.. భ‌ర్జ‌న‌ల అనంత‌రం తాజాగా ఏపీ రాష్ట్ర పుష్పం.. ప‌క్షిల‌ను ఎంపిక చేశారు. రాష్ట్ర పుష్పంగా ఏపీలో విరివిగా ల‌భించే గుండె మ‌ల్లెల్ని ఎంపిక చేశారు. క‌మ్మ‌టి వాస‌న‌తో మ‌న‌సుల్ని దోచుకునే మ‌ల్లెను ఏపీ రాష్ట్ర పుష్పంగా డిసైడ్ చేశారు. ఉమ్మ‌డి రాష్ట్రంలో రాష్ట్ర పుష్పంగా క‌లువ పువ్వు ఉండేది. అదే స‌మ‌యంలో రాష్ట్ర ప‌క్షిగా.. ఏపీ వ్యాప్తంగా ఎక్క‌డ చూసినా క‌నిపించే రామ చిలుక‌ను ఎంపిక చేశారు.

ఉమ్మ‌డి ఏపీలో రాష్ట్ర ప‌క్షిగా పాల‌పిట్ట ఉండేది. ఏపీతో పోలిస్తే తెలంగాణ‌లో ఈ ప‌క్షి ఎక్కువ‌గా ఉండ‌టంతో పాటు.. ద‌స‌రా రోజున ఆ ప‌క్షిని ద‌ర్శించుకోవ‌టం అదృష్టంగా భావిస్తుంటారు తెలంగాణ ప్ర‌జ‌లు. తెలంగాణ ఏర్పాటు త‌ర్వాత ఆ ప‌క్షిని తెలంగాణ ప్ర‌భుత్వం త‌మ రాష్ట్ర ప‌క్షిగా ఎంపిక చేసిన నేప‌థ్యంలో.. ఏపీ రాష్ట్ర ప‌క్షి కోసం ఎంపిక కోసం ప‌లు ప‌క్షుల్ని ప‌రిశీలించారు. చివ‌ర‌కు ఆకుప‌చ్చ వ‌ర్ణం.. ఎర్ర‌టి ముక్కుతో చూసినంత‌నే ఆక‌ర్షించే రామ చిలుక‌నుఎంపిక చేశారు. ఇక‌.. రాష్ట్ర జంతువునుగ‌తంలో మాదిరే కృష్ణ జింక‌ను ఎంపిక చేయ‌గా.. రాష్ట్ర వృక్షంగా వేప చెట్టును కొన‌సాగించాల‌న్న నిర్ణ‌యాన్ని తీసుకున్నారు. ఈ ఎంపిక కోసం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున క‌స‌ర‌త్తు చేసిన‌ట్లుగా చెబుతున్నారు. క‌స‌ర‌త్తు మంచిదే.. కానీ నాలుగేళ్ల అవ‌స‌ర‌మా? అన్న‌దే ప్ర‌శ్న‌.