Begin typing your search above and press return to search.

టీడీపీ భూకేటాయింపు..షాకిచ్చిన వైసీపీ

By:  Tupaki Desk   |   29 Nov 2019 5:37 AM GMT
టీడీపీ భూకేటాయింపు..షాకిచ్చిన వైసీపీ
X
తెలుగుదేశం పార్టీకి అధికార వైసీపీ గట్టి షాకిచ్చింది. 2014లో అధికారంలో ఉన్న టీడీపీ తన పార్టీకి - తన అనుయాయులకు అక్రమంగా పెద్ద ఎత్తున భూములు కట్టబెట్టిన వైనం వైసీపీ ప్రభుత్వ విచారణ తేలింది. దీంతో వాటిపై జగన్ సర్కారు తాజాగా కొరఢా ఝలిపించడానికి రెడీ అయ్యింది.

తాజాగా అమరావతి రాజధాని పరిధిలో గుంటూరు జిల్లాలో తెలుగు దేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం నిర్మాణం కోసం చంద్రబాబు కేటాయించిన భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని వైసీపీ ఎంపీ - వైసీపీ ఎమ్మెల్యే ప్రభుత్వానికి లేఖ రాశారు. అత్యంత విలువైన ఈ భూమిని టీడీపీ ప్రభుత్వం అడ్డగోలుగా నిబంధనలకు విరుద్ధంగా అతి తక్కువ ధరకు టీడీపీకి కేటాయించిందని.. వెంటనే భూ కేటాయింపు ఉత్తర్వులను రద్దు చేయాలని వైసీపీ ఎంపీ - ఎమ్మెల్యేలు సీఎం జగన్ కు రాసిన లేఖలో కోరారు.

కాగా వైసీపీ ఎంపీ - ఎమ్మెల్యేలు రాసిన లేఖలకు ఏపీ సీఎం కార్యాలయం స్పందించింది. రెవెన్యూ శాఖకు పంపించింది. విచారణ చేయాలని ఆదేశించింది.

*వివాదం ఇదీ

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరులోని 3.65 ఎకరాల భూమిని టీడీపీ ప్రధాన కార్యాలయ నిర్మాణం కోసం కేటాయిస్తూ చంద్రబాబు సర్కారు 2017 జూన్ 22న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ భూమిని 99 ఏళ్లపాటు లీజుకు కేవలం ఏటా ఎకరానికి రూ.1000 కే కేటాయించడం వివాదాస్పదమైంది. టీడీపీకి అనుకూలంగా చంద్రబాబు ఇలా చేశాడని వైసీపీ ఆరోపిస్తోంది. ఇప్పుడు ఎంపీ - ఎమ్మెల్యేల లేఖతో వివాదం కొత్త మలుపు తిరిగింది.

చెన్నై-కోల్ కతా జాతీయ రహదారి పక్కనే ఉన్న ఈ స్థలం ఖరీదు రూ.70కోట్ల పైమాటే.. షేక్ బాజీ అనే పేదకు చెందిన 3.50 ఎకరాల భూమి అది. 1993లో అప్పటి ప్రభుత్వం కేటాయించింది. ఆ భూమిపై ఆధారపడే షేక్ బాజీ జీవిస్తున్నాడు.అయితే ఈ భూమి హక్కుదారు షేక్ బాజీ 2014లో మరణించాడు. దీంతో ఈ విలువైన భూమిపై టీడీపీ నేతల కన్నుపడింది. చంద్రబాబు గద్దెనెక్కాక ఇక్కడ మంగళగిరి పక్కనే అమరావతి రాజధాని ప్రకటన చేయడంతో ఈ భూమి ఖరీదైనదిగా మారిపోయింది. కోట్లకు పడగలెత్తింది. దీంతో ఈ విలువైన భూమిని కాజేయాలని టీడీపీ బ్యాచ్ స్కెచ్ గీసిందని బాధితులు ఆరోపిస్తున్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల కూడా షేక్ బాజీ తరుఫున పోరాడారు.

కాగా చంద్రబాబు హయాంలో లీజుకు తీసుకున్న భూమిలో టీడీపీ ఏపీ ప్రధాన కార్యాలయం పూర్తి అయ్యింది. డిసెంబర్ 6న ప్రారంభిస్తున్నారు. ఈనేపథ్యంలో వైసీపీ సర్కారు భూమి వెనక్కి తీసుకోవడానికి అడుగులు వేస్తుండడం హాట్ టాపిక్ గా మారింది.