Begin typing your search above and press return to search.

అతడి తల్లి ప్రేమకు కారు గిఫ్ట్‌ గా ఇస్తానన్న మహీంద్ర

By:  Tupaki Desk   |   23 Oct 2019 11:47 AM GMT
అతడి తల్లి ప్రేమకు కారు గిఫ్ట్‌ గా ఇస్తానన్న మహీంద్ర
X
మహీంద్ర మోటర్స్‌ అధినేత ఆనంద్‌ మహీంద్ర సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌ గా ఉంటారు. ఫన్నీ మీమ్స్‌ ను.. ఎమోషనల్‌ పోస్ట్‌ లను.. ఆసక్తికర విషయాలను తరుచూ ఈయన పోస్ట్‌ చేస్తూ ఉంటారు. ఇప్పటి వరకు ఎన్నో రకాల పోస్ట్‌ లను తన ఫాలోవర్స్‌ కు చూపించిన ఆనంద్‌ మహీంద్ర ఈసారి తన తల్లిపై ఒక కొడుక్కు ఉన్న ప్రేమ అభిమానంను చూపించాడు. దాంతో పాటు ఆ కొడుకు ప్రేమకు ఫిదా అయిన ఆనంద్‌ మహీంద్ర ఒక కారును కూడా బహుమానంగా ఇస్తానంటూ ప్రకటించాడు.

అసలు విషయం ఏంటంటే.. కర్ణాటక మైసూర్‌ కు చెందిన వ్యక్తి దక్షిణామూర్తి కృష్ణ కుమార్‌. ఈయన బ్యాంక్‌ ఎంప్లాయి. ఒక రోజు మాటల మద్యలో తన తల్లి పుట్టి బుద్దెరిగినప్పటి నుండి కనీసం పక్క ఊరు కూడా వెళ్లలేదని తెలుసుకున్నాడు. తాముండే ప్రాంతంకు పక్కనే ఉండే ఛారిత్రాత్మక దేవాలయం బేలూరు హలిబేడును కూడా సందర్శించలేదని దక్షిణామూర్తి తెలుసుకున్నాడు. 70 ఏళ్ల తన తల్లికి శేష జీవితం అంతా కూడా గుర్తుంచుకునేలా ఒక ట్రిప్‌ వేయాలని అనుకున్నాడు. అందుకోసం అతడు ఒక పాత స్కూటర్‌ ను ఎంపిక చేసుకున్నాడు. ఆ స్కూటర్‌ దక్షిణామూర్తి తండ్రి గారిది. ఆ స్కూటర్‌ పై వెళ్తే తన తండ్రిని కూడా ట్రిప్‌ కు తీసుకు వెళ్లినట్లుగా ఉంటుందని భావించాడట. ఈ టూర్ కు ఆయన మాతృసేవ సంకల్ప్ యాత్ర అని పేరు పెట్టాడు.

కేరళలో ప్రారంభం అయిన దక్షిణామూర్తి కృష్ణ కుమార్‌ టూర్‌ 18 రాష్ట్రాలతో పాటు మూడు దేశాలను కూడా తిప్పేసింది. 2018 జనవరి 18న తల్లితో స్కూటర్‌ పై దక్షిణామూర్తి జర్నీ ప్రారంభం అయ్యింది. ఆ జర్నీ 48 వేల కిలో మీటర్లకు పైగా సాగింది. ఇండియాలోని ప్రముఖ పుణ్య క్షేత్రాలన్ని కవర్‌ చేసిన ఈ తల్లి కొడుకులు మయన్మార్‌.. బూటాన్‌.. నేపాల్‌ లో కూడా పుణ్య క్షేత్రాలను సందర్శించారు. వీరికి పలు స్వచ్చంద సంస్థలు సహకారం అందించాయి.

ఈ తల్లి కొడుకుల అద్బుత జర్నీని మనోజ్‌ కుమార్‌ అనే వ్యక్తి ట్విట్టర్‌ లో పోస్ట్‌ చేశాడు. ఆ పోస్ట్‌ కు ఫిదా అయిన ఆనంద్‌ మహీంద్ర స్పందించారు. ఇది ఒక అందమైన అద్బుతమైన కథ. ఇది ఒక తల్లి ప్రేమ మాత్రమే కాదు.. దేశంపై ప్రేమ కూడా కలిసి ఉంది. నాకు ఈ స్టోరీని తెలియజేసినందుకు మనోజ్‌ గారు కృతజ్ఞతలు. ఆయన్ను నాకు పరిచయం చేస్తే నేను మహీంద్ర కేయూవీ 100 ఎన్‌ఎక్స్‌ టీ కారును బహూకరిస్తాను. తన తల్లితో తర్వాత టూర్‌ ఆ కారులో వెళ్లవచ్చు అంటూ ఆనంద్‌ మహీంద్ర రీ ట్వీట్‌ చేశాడు.