Begin typing your search above and press return to search.

`మ‌హేంద్రా`ను ఆక‌ట్టుకున్న మ‌హిళా వ్యాపారి!

By:  Tupaki Desk   |   30 Dec 2017 6:12 PM GMT
`మ‌హేంద్రా`ను ఆక‌ట్టుకున్న మ‌హిళా వ్యాపారి!
X
క‌ష్టాలు మ‌నుషుల‌కు కాక‌పోతే మానుల‌కు వ‌స్తాయా....ఇది పెద్ద‌లు చెప్పే సామెత‌. త‌మిళ‌నాడుకు చెందిన ఓ మ‌హిళ‌కు కూడా క‌ష్టాలు వ‌చ్చాయి. అయినా, ఆ క‌ష్టాల‌కే క‌న్నీళ్లు పెట్టించేలా ఆమె మొక్క‌వోని దీక్ష‌తో ముందుకు సాగింది. ఒంటరి మ‌హిళ అయిన ఆమె మ‌రొక‌రికి భారం కాకూడ‌ద‌ని భావించింది. త‌న‌ కాళ్ల‌పై తాను నిల‌బ‌డేందుకు సొంత‌గా ఓ చిన్న వ్యాపారాన్ని ప్రారంభించింది. క‌ష్ట‌ప‌డి అంచెలంచెలుగా ఎదిగి ఆ వ్యాపారంలో లాభాలు సాధించింది. త‌న‌తో పాటు త‌న సోద‌రుడిని కూడా వ్యాపార రంగంలోకి తీసుకువ‌చ్చేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. ఆ మ‌హిళ గురించి తెలుసుకున్న ఓ దిగ్గ‌జ కంపెనీ చైర్మ‌న్ ఆమెకు సాయం చేసేందుకు ముందుకు వ‌చ్చారు. ప్ర‌స్తుతం ఆ మ‌హిళ ఉదంతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.

త‌మిళ‌నాడులోని మంగుళూరుకు చెందిన శిల్ప(34) భర్త 2008లో కనిపించకుండా పోయాడు. పదో తరగతి మధ్యలోనే ఆపేసిన శిల్ప‌జీవ‌నాధారం కోసం ధైర్యంగా మ‌హేంద్రా బొలెరో ట్ర‌క్ పై `మొబైల్‌ ట్రక్‌ ఫుడ్‌` వ్యాపారాన్ని ప్రారంభించి విజ‌య‌వంతంగా న‌డుపుతోంది. అంచెలంచెలుగా విస్త‌రించిన ఆమె వ్యాపారం ఇపుడు లాభ‌దాయ‌కంగా సాగుతోంది. దీంతో, తన సోదరుడికి కూడా ఓ మొబైల్ ట్ర‌క్ ఔట్ లెట్ ప్రారంభించే యోచ‌న‌లో ఆమె ఉంది. ఆమె విజ‌య‌గాథ‌పై మీడియాలో వ‌చ్చిన క‌థ‌నాల‌ను ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్స్‌ ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా చ‌దివారు. ఒంట‌రి మ‌హిళ అయినప్ప‌టికీ ఆమె వ్యాపారం చేసి రాణించిన తీరు మ‌హేంద్ర‌ను ఆక‌ట్టుకుంది. విజయవంతంగా వ్యాపారం చేస్తున్న మహిళ అని ఆమెను మ‌హేంద్ర ప్రశంసించారు. దీంతో, ఆమెకు సాయం చేసేందుకు ఆయ‌న ముందుకు వ‌చ్చి ఆ విష‌యాన్ని ట్వీట్ చేశారు. ‘ఆమె చేస్తున్న వ్యాపారంలో మహీంద్రా బొలెరో చిన్న పాత్ర పోషిస్తోంది. నేను ఆమెకు సాయం చేస్తా. ఆమె రెండో అవుట్‌ లెట్‌ ప్రారంభించేందుకు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నా. ఈ విషయాన్ని ఎవరైనా ఆమెకు తెలియజేయండి’ అని ట్వీట్‌ చేశారు. శిల్పకు డ‌బ్బు సాయం చేసి ఆదుకోవ‌చ్చుక‌దా...అని మ‌హేంద్రాను ఉద్దేశించి ఓ నెటిజ‌న్ కామెంట్ చేశాడు. ఆమె త‌న‌ దగ్గర నుంచి డబ్బు తీసుకుంటుందని ఆశించడం లేదని మ‌హేంద్రా బ‌దులిచ్చారు.