Begin typing your search above and press return to search.

మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ ఎపిసోడ్ పై ఆనంద్ మహీంద్రా కీలక వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   4 Jun 2022 3:24 AM GMT
మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ ఎపిసోడ్ పై ఆనంద్ మహీంద్రా కీలక వ్యాఖ్యలు
X
కొన్ని అంశాల మీద కొందరు మాత్రమే స్పందిస్తుంటారు. ఇందుకు మినహాయింపు రాజకీయ నాయకులను చెప్పాలి. వారికి ఫలానా అంశం అన్నదేమీ ఉండదు. ప్రతి అంశంలోనూ వారు తమ వాణిని వినిపిస్తుంటారు. అందుకు భిన్నంగా సినీ ప్రముఖులు.. సెలబ్రిటీలు ఉంటారు.

వీరందరికంటే చాలా చాలా తక్కువగా స్పందించే గుణం పారిశ్రామివేత్తల్లో ఉంటుంది. సమాజంలో సంచలనంగా మారిన అంశాల మీద బాహాటంగా స్పందించేందుకు ఏ మాత్రం ఇష్టపడరు. తమదైన ప్రపంచంలోనే ఉంటారు.బయట ఏం జరుగుతుందన్న దానిపై వారికి ఎంతటి అవగాహన ఉందన్న విషయంపై కూడా కించిత్ క్లూ ఇవ్వకుండా వ్యవహరిస్తూ ఉంటారు.

అయితే.. అందుకు భిన్నంగా వ్యవహరిస్తుంటారు మహీంద్రా గ్రూపు ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా. సోషల్ మీడియాలో ఆయన ఎంత యాక్టివ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ మాటకు వస్తే.. సోషల్ మీడియాలో ఆయన చురుగ్గా వ్యవహరించటం మొదలైన నాటి నుంచి మహీంద్రా బ్రాండ్ వాల్యూ పెరగటమే కాదు.. ఆ బ్రాండ్ తో చాలామంది కనెక్టు అవుతున్న పరిస్థితి. ఇదిలా ఉంటే.. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన హైదరాబాద్ మైనర్ బాలిక ను కారులో గ్యాంగ్ రేప్ చేసిన ఉదంతంపై ఆయన స్పందించారు.

సాధారణంగా ఇలాంటి సున్నితమైన అంశాల మీద స్పందించేందుకు దేశంలోని ఏ తోపు పారిశ్రామికవేత్త ఇష్టపడరు. కానీ.. ఆనంద్ మహీంద్రా రూటు సపరేటు కదా. అందుకే ఆయన సోషల్ మీడియాలో రియాక్టు అయ్యారు.

మైనర్ బాలికపై సంపన్న వర్గాలకు చెందిన కుటుంబాలు అత్యాచారానికి పాల్పడిన వైనం తెలిసిందే. దీనికి సంబంధించి పలు వార్తల్లో (పలుకుబడి) ఉన్న కుటుంబాల యువకులు రేప్ చేశారంటూ వారి ఆర్థిక స్థితిగతుల్ని వార్తల్లో హైలెట్ చేశారు. దీనిపై ఆయన రియాక్టు అయ్యారు.

"ఆ యువకులు ఎవరో నాకు తెలీదు. వార్తల్లో మాత్రం వారిని ఉద్దేశించి చేసిన ప్రస్తావన మాత్రం సరికాదు. ఇది నా అభిప్రాయం. ఆ కుర్రాళ్లు పలుకుబడి ఉన్న కుటుంబాల వారు కాదు. సంస్కృతి.. మానవతా విలువలు లేని.. సరైన పెంపకం తెలియని 'దిగువ స్థాయి' కుటుంబాల వారు అనడం సరి. బాధిత బాలికకు న్యాయం జరగాలని కోరుకుంటున్నా" అంటూ తాను చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెప్పేశారని చెప్పాలి. అత్యంత సున్నితమైన అంశంపై మొహమాటం లేకుండా తన మనసుల్ని మాటను చెప్పేయటం ద్వారా.. తన ప్రత్యేకతను ఆనంద్ మహీంద్రా చాటుకున్నారని చెప్పక తప్పదు.