Begin typing your search above and press return to search.

పెయిడ్ ఆర్టిస్టు పంచ్ కు..డబ్బింగ్ ఆర్టిస్టులంటూ తమ్ముళ్ల వ్యంగ్యాస్త్రాలు

By:  Tupaki Desk   |   5 Feb 2020 4:59 AM GMT
పెయిడ్ ఆర్టిస్టు పంచ్ కు..డబ్బింగ్ ఆర్టిస్టులంటూ తమ్ముళ్ల వ్యంగ్యాస్త్రాలు
X
మాటకు మాట అనటం తప్పేం లేదు. దూకుడు రాజకీయాల వేళ.. నోటికి వచ్చినట్లు మాట్లాడేయటం ఈ మధ్యన అలవాటుగా మారింది. ఇలాంటి వాటి వల్ల జరిగే నష్టం ఏమిటంటే.. రావాల్సిన మైలేజీ స్థానే అనవసరమైన వివాదాలు మెడకు చుట్టుకుంటాయి. తాజాగా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు టీడీపీ నేతలు. అధికారపక్షానికి పంచ్ వేశామన్న ఆలోచనే కానీ.. రైతుల మనసుల్ని గాయపరుస్తున్నామన్న విషయాన్ని వారు గుర్తించటం లేదు.

తాజాగా టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనంగా చెప్పాలి. తాజాగా ముఖ్యమంత్రి జగన్ ను అమరావతి రైతులు కొందరు కలిశారు. తమ సమస్యల్ని ముఖ్యమంత్రి ముందు ఉంచారు. ఈ సందర్భంగా మూడు రాజధానుల నిర్ణయాన్ని తమ ప్రభుత్వం ఎందుకు తీసుకుందో సదరు రైతులకు వివరించారు ముఖ్యమంత్రి జగన్.

ఇదిలా ఉంటే.. తాజాగా సీఎంను కలిసిన అమరావతి రైతులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు టీడీపీ ఎమ్మెల్యే సత్యప్రసాద్. అమరావతి రైతుల ముసుగులో సీఎంను కలిసిన వారంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారేనని.. వారంతా డబ్బింగ్ ఆర్టిస్టులుగా అభివర్ణించారు. జగన్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన డబ్బింగ్ ఆర్టిసులను జగన్ వద్దకు తీసుకెళ్లారన్నారు. తన స్వార్థం కోసం రైతుల త్యాగాల్ని అవమానిస్తున్నట్లుగా ఆయన ఆరోపించారు.

అమరావతి రైతుల్లో చీలిక తెచ్చేందుకు ఆళ్ల కుయుక్తులు వేస్తున్నారని.. నకిలీ రైతులతో చర్చలు జరిపినంత మాత్రాన అమరావతి రైతులు రాజధాని ఉద్యమం నీరు కాదని ఆయన మండిపడుతున్నారు. అదే పనిగా మాటలు అనేస్తున్న టీడీపీ తమ్ముడు.. సీఎంను కలిసిన వారంతా రైతులేనని తేలిస్తే.. మొదటికే మోసం వస్తుందన్న విషయాన్ని మర్చిపోవటం గమనార్హం.