Begin typing your search above and press return to search.

కరోనా కన్నీటి కథ.. తిరుపతిలో దారుణం..

By:  Tupaki Desk   |   22 July 2020 11:30 PM GMT
కరోనా కన్నీటి కథ.. తిరుపతిలో దారుణం..
X
తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం ఓ తల్లి ప్రాణాలు బలితీసుకుంది. జిల్లా వైద్య సిబ్బంది జాప్యం వల్ల కరోనా సోకిందో లేదో తెలియక ఓ కుటుంబం అష్టకష్టాలు పడింది. చివరకు కొడుకు ద్వారా తల్లికి కరోనా సోకి ఆమె చనిపోయిన విషయాన్ని కూడా దాచిన దుర్మార్గం జిల్లా ఆసుపత్రిలో చోటుచేసుకుంది

తిరుపతిలోని మంగళం క్వార్టర్స్ లో ఉంటున్న ఢిల్లీ బాబు కు కరోనా లక్షణాలు కనిపించగా.. పరీక్షలు చేసుకున్నాడు. ఒకటికాదు రెండు కాదు.. ఏకంగా వరుసగా నాలుగైదు సార్లు చేసుకున్నా అతడి ఫలితాలను సిబ్బంది నిర్లక్ష్యంగా ఇవ్వలేదు. దీంతో అదే లక్షణాలతో ఇంటికి వెళ్లాడు. అనుమానించినట్టే అతడి 70 ఏళ్ల తల్లికి జ్వరం, ఆయాసం మొదలైంది.

దీంతో తల్లికి టెస్ట్ చేయగా కరోనా వచ్చిందని ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ తనను పట్టించుకోవడం లేదని.. వైద్యం అందడం లేదని ఆ తల్లి కొడుకుకు ఫోన్ చేసి వాపోయింది. అనంతరం ఆస్పత్రికి వెళ్లి ఢిల్లీ బాబు ఆరాతీయగా బాగానే ఉందని సిబ్బంది చెప్పుకొచ్చారు.

20వ తేదీన 11 గంటలకు ఆ వృద్ధురాలు చనిపోయింది. అయితే 20న 11 గంటలకే చనిపోతే అదే రోజు సాయంత్రం తాను ఆస్పత్రికి వెళ్లినప్పుడు తల్లి ఆరోగ్యం బాగానే ఉందని సిబ్బంది చెప్పారని బాధితుడు ఢిల్లీ బాబు ప్రశ్నించాడు. తల్లి చనిపోయినా తనకు 23 గంటల వరకు సమాచారం ఇవ్వలేదని వాపోయాడు.

ఇక తల్లికి కరోనా వచ్చినా తనకు కరోనా టెస్టు ఫలితాలు ఇవ్వకుండా వైద్యసిబ్బంది జాప్యం చేస్తున్నారని..తనకు కరోనా ఉందో లేదో తెలియడం లేదని ఢిల్లీ బాబు వాపోతున్నాడు. ఇలా వైద్యసిబ్బంది నిర్లక్ష్యానికి ఓ తల్లి ప్రాణం కోల్పోగా.. ఆ తనయుడికి ఇప్పటికీ కరోనా ఉందో లేదో తెలియని పరిస్థితి నెలకొంది.