Begin typing your search above and press return to search.

సార్‌, మేడమ్ వద్దు.. చేటన్‌, చేచి ముద్దు

By:  Tupaki Desk   |   3 Sep 2021 5:39 AM GMT
సార్‌, మేడమ్ వద్దు.. చేటన్‌, చేచి ముద్దు
X
గ్రామాల్లో కానీ, పట్టణాల్లో కానీ, నగరాల్లో కానీ ఏదైనా పని నిమిత్తం గవర్నమెంట్ ఆఫీసుకి వెళ్ళినప్పుడు అధికారులతో మాట్లాడడానికే భయపడుతుంటారు. అధికారుల దగ్గరికి వెళ్లి వారికి ఉన్న సమస్యలను కూడా సరిగా చెప్పుకోలేరు. అలాంటి వారు స్వేచ్ఛగా అధికారులతో మాట్లాడానికి కేరళలోని ఓ గ్రామం వినూత్న ఆలోచనతో అందరిని ఆశ్చర్య పరుస్తుంది. అధికారులకు, ప్రజలు మధ్య ఉన్న దూరాన్ని తొలగించడానికి వారిని మర్యాదపూర్వకంగా పిలిచే సార్‌, మేడమ్‌ లాంటి గౌరవ పదాలను గ్రామస్థులు వాడకండి అని ఆదేశాలిచ్చింది.

కేరళ రాష్ట్రంలోని మథుర్ అనే గ్రామంలోని సాధారణ ప్రజలు పంచాయతీ అధికారులను సార్‌, మేడమ్‌ అని సంబోధించాల్సిన అవసరం లేదని కొత్త నిబంధన అమల్లోకి తీసుకువచ్చింది. దీంతో దేశంలోనే ఈ పదాలను తొలగించిన మొదటి గ్రామంగా మథురా నిలిచింది. అసలు ఎందుకు నిషేధించారంటే సార్‌, మేడమ్‌ అనే పదాలు ప్రజలకు, అధికారులకు మధ్య దూరాన్ని పెంచుతున్నాయని..దాన్ని చెరిపేసి స్నేహపూర్వక వాతావరణం నెలకొల్పాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని మథురా గ్రామ పంచాయతీ వైస్‌ ప్రెసిడెంట్‌ తెలిపారు.

ప్రజాస్వామ్యంలో కీలకం ప్రజలేనని, వాళ్లు ఎన్నుకునే నేతలు వారి సేవకులని పేర్కొన్నారు. వారు అధికారులకు మర్యాద ఇవ్వాల్సిన పని లేదన్నారు. అధికారులను సేవ చేయాలని అభ్యర్థించకుండా ప్రజలు డిమాండ్‌ చేయాలన్నారు. గౌరవ పదాలను నిషేధించిన తర్వాత పంచాయతీ బయట నోటీసులను కూడా అంటించారు. సార్‌, మేడమ్‌ అని సంబోధించకపోయినా అధికారులు ప్రజల సమస్యలు తీరుస్తారని అందులో పేర్కొన్నారు. ఒకవేళ సమస్యలు పరిష్కరించకపోతే వారిపై పంచాయతీ ప్రెసిడెంట్‌ కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. అలాగే ప్రతి ఒక్క అధికారి టేబుల్‌ దగ్గర వారి పేర్లతో కూడిన బోర్డును కూడా పెట్టారు. అంతేకాకుండా అప్లికేషన్‌ ఫామ్‌ కు బదులుగా అవకాశ పత్రికను తీసుకువస్తామని పంచాయతీ అధికారులు తెలిపారు. మేడమ్‌, సార్‌ కు బదులుగా చేటన్‌ (అన్న) చేచి (అక్కా) అని అధికారులను పిలవవచ్చు అని పంచాయతీ నిర్ణయం తీసుకుంది.

సార్, మేడమ్ పదాలు బ్రిటిష్ కాలం నాటివని, స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లయినా వాటిని ఇంకా ఉపయోగిస్తున్నాం.. ప్రజాస్వామ్యంలో ప్రజలే కీలకమని చెప్పడమే దీని ముఖ్యోద్దేశం. ప్రజాస్వామ్యయంలో ప్రభుత్వ అధికారులు, ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు సేవకులు.. ప్రజలదే ఇక్కడ అత్యున్నత అధికారం.. ప్రజలు తమ హక్కుల కోసం మా దయ కోసం ఎదురుచూడకూడదు అన్నారు.