Begin typing your search above and press return to search.

అమ్మ కూతురున‌ని ఆమెకు ఎలాతెలిసింది..?

By:  Tupaki Desk   |   4 Dec 2017 5:46 AM GMT
అమ్మ కూతురున‌ని ఆమెకు ఎలాతెలిసింది..?
X
స‌స్పెన్స్ క్రైం థిల్ల‌ర్ సినిమాల‌కు త‌గ్గ‌ట్లే ఉంటుంది త‌మిళ‌నాడు అమ్మ జీవితం. సినిమాటిక్ గా ఉండే ఆమె జీవితం తెరిచి ఉన్న‌ట్లు అనిపించిన‌ప్ప‌టికి తెలియ‌ని అంశాలెన్నో. అమ్మ‌గా సుప‌రిచితురాలు.. దివంగ‌త త‌మిళ‌నాడు సీఎం జ‌య‌ల‌లిత‌కు సంబంధించిన విష‌యాలు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారాయి. ఆమెకు ఒక కూతురు ఉంద‌ని.. ప్ర‌ముఖ న‌టుడు శోభ‌న్ బాబు కార‌ణంగా ఆడ‌పిల్ల‌కు జ‌న్మ‌నిచ్చిన విష‌యం ఈ మ‌ధ్య‌న మీడియాలో ప్ర‌ముఖంగా వ‌స్తోంది.

బెంగ‌ళూరుకు చెందిన అమృత‌.. తాను అమ్మ కుమార్తెన‌ని చెప్పిన మొద‌ట్లో ఈ వాద‌న‌ను ఎవ‌రూ న‌మ్మ‌లేదు. ప్ర‌ముఖ‌ల వార‌సుల‌మ‌ని.. ప్ర‌ముఖుల‌కు అది అవుతాం.. ఇది అవుతామ‌ని చెప్ప‌టం మామూలైన వేళ‌.. ఈ విష‌యాన్ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. అయితే..తాను అమ్మ కుమార్తెన‌న్న విష‌యాన్ని కావాలంటే త‌న‌కు డీఎన్ఏ టెస్ట్‌కు సిద్ధ‌మ‌ని చెప్ప‌టంతో మీడియా దృష్టి అమృత మీద ప‌డింది.

అమృత అమ్మ కూతురే అంటూ ప‌లువురు చెబుతున్న వేళ‌.. ఆమెకు ప్రాధాన్య‌త అంత‌కంత‌కూ పెరుగుతోంది. ఇదిలా ఉంటే.. అమృత‌ అమ్మ కుమార్తెనన్న విష‌యం ఆమెకు ఎలా తెలిసింద‌న్న సందేహం రాక మాన‌దు. ఇదే విష‌యాన్ని ఆమెను అడిగితే ఆస‌క్తిక‌ర విష‌యాల్నిచెప్పుకొచ్చారు.

త‌న పెంపుడు త‌ల్లి 2015లో మ‌ర‌ణించార‌ని.. అప్ప‌టివ‌ర‌కూ తాను ఆమె కుమార్తెగానే అనుకున్న‌ట్లు అమృత చెప్పారు. అయితే.. త‌న పెంపుడు తండ్రి సార‌థి 2017మార్చిలో చ‌నిపోయే ముందు తాను జ‌య‌ల‌లిత కుమార్తెన‌న్న విష‌యాన్ని ఆయ‌న చెప్పార‌న్నారు. పెంపుడు తండ్రి చెప్పిన త‌ర్వాత కూడా నిర్ధారించుకోలేక‌పోయాన‌ని.. త‌న బంధువుల‌ను విచారించిన వేళ‌.. ఆమెకు కుమార్తె ఉంద‌న్న మాట నిజ‌మేన‌ని.. అది తానేన‌ని చెప్ప‌టంతో ఇప్పుడీ విష‌యాన్ని బ‌య‌ట‌కు చెప్పిన‌ట్లుగా చెప్పారు.

1996లో తాను తొలిసారి జ‌య‌ల‌లిత‌నుచూశాన‌న్నారు. 1996 జూన్ ఆరున అమ్మ‌ను తొలిసారి చూశాన‌ని.. అధికారం పోయి తీవ్ర మాన‌సిక ఒత్తిడిలో ఉన్న వేళ త‌న‌ను చూసినంత‌నే ఆలింగ‌నం చేసుకొని ముద్దు పెట్టుకున్నార‌న్నారు. ఆ చ‌ర్య త‌న‌కు దిగ్భాంత్రి క‌లిగించింద‌ని.. ఆ త‌ర్వాత ఆమెను తాను చాలాసార్లు క‌లిసిన‌ట్లు చెప్పారు.

ఒకే ప‌ళ్లెంలో తిన్నామ‌ని.. ఒకే ప‌డ‌క మీద ప‌డుకున్నామ‌న్నారు. జ‌య‌ను చూసేందుకు స‌చివాల‌యం వెళ్లిన ప్ర‌తిసారీ నువ్వు ఎక్క‌డైనా ఉండు.. ప్రాణాల‌తో ఉంటే చాల‌ని అనేవార‌ని.. ఆసుప‌త్రిలో చేర‌టానికి ముందు ఫోన్ చేసి వ‌స్తాన‌ని చెబితే వ‌ద్ద‌ని వారించార‌న్నారు. ఇంట్లో ఉండ‌న‌ని తెలిపాన‌ని.. అయినా తాను పోయెస్ గార్డెన్ లోని వేద నిల‌యానికి వెళితే ఆమె లేర‌న్నారు. త‌ర్వాత విచారిస్తే ఇంట్లోనే వైద్య చికిత్స‌లు చేయించిన‌ట్లు తెలిసింద‌న్నారు.

తానుఅమ్మ‌ను క‌లిసిన విష‌యాలు చాలావ‌ర‌కూ సీసీ టీవీ కెమేరాల పుటేజ్ లో ఉంటాయ‌ని చెప్పిన అమృతి.. అమ్మ‌కు జెడ్ కేట‌గిరిలో ఉన్నందున‌.. వారి రిజిస్ట‌ర్లో త‌న వివ‌రాలు ఉంటాయ‌న్నారు. తాను జ‌య కుమార్తెన‌ని నిరూపించేందుకు డీఎన్ఏ ప‌రీక్షకు సిద్ధ‌మ‌న్న అమృత‌.. తాను అమ్మ‌ను క‌ల‌వ‌కుండా ఉండ‌టానికి శ‌శిక‌ళ కుటుంబ స‌భ్యులు చాలాసార్లు త‌న‌ను అడ్డుకున్నార‌ని ఆరోపించారు.