Begin typing your search above and press return to search.

హైకోర్టులో అమరావతి రైతుల వాదనలు విన్నారా?

By:  Tupaki Desk   |   16 Nov 2021 6:30 AM GMT
హైకోర్టులో అమరావతి రైతుల వాదనలు విన్నారా?
X
ఏపీ రాజధానిగా అమరావతిని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించటం.. అందుకు అవసరమైన భూమిని రైతుల వద్ద నుంచి పెద్ద ఎత్తున సేకరించటం తెలిసిందే. 33 వేల ఎకరాల్ని సేకరించి.. రాజధానిగా డిసైడ్ చేసిన ప్రాంతానికి అమరావతి అన్న పేరును పెట్టిన వైనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

2019లో జరిగిన ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం.. అమరావతిని ఏపీ రాజధానికి బదులుగా మూడు రాజధానుల్ని ఏర్పాటు చేసేందుకు వీలుగా నిర్ణయాన్ని తీసుకున్న నేపథ్యంలో.. దాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులు ఏపీ హైకోర్టును ఆశ్రయించటం తెలిసిందే.

తాజాగా అమరావతి రైతుల వాదనల్ని వినిపించేందుకు రాజధాని రైతు పరిరక్షణ సమితి తరఫున సీనియర్ న్యాయవది శ్యాం దివాన్ హైకోర్టులో బలంగా తన వాదనల్ని వినిపించారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్‌ డీవీఎ్‌సఎస్‌ సోమయాజులుతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఎదుట వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాల్ని ప్రస్తావించారు. అయితే.. ఆయన తన వాదనల్ని పూర్తిగా వినిపించేందుకు సమయం సరిపోకపోవటంతో.. ఆయన ఈ రోజు (మంగళవారం) కూడా వాదనల్ని వినిపించనున్నారు. శ్యాం దివాన్ వాదనల్లోని ముఖ్యాంశాల్ని చూస్తే..

- రాజధానిపై ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత దానిని మార్చడానికి వీల్లేదు. రాజధాని ఏర్పాటు విషయంలో పార్లమెంటు ఒక ప్రొసీజర్‌ నిర్ణయించిందని, దానిని పక్కనబెట్టి ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధాని మార్చడానికి వీల్లేదు.

- అమరావతిని రాజధానిగా నిర్ణయించే విషయంలో అసెంబ్లీలో తీర్మానం చేసింది. విభజన చట్టంలోని 5, 6 సెక్షన్లలో ఏపీకి కొత్త రాజధాని ఏర్పాటు అంశం ఉంది. ఈ విషయంలో సూచనలు, ప్రత్యామ్నాయాలు చెప్పేందుకు కేంద్రం శివరామకృష్ణన్‌ కమిటీని వేసింది. కమిటీ ఇచ్చిన నివేదికలో 52 శాతం మంది ప్రజలు గుంటూరు, విజయవాడ మధ్య రాజధాని ఏర్పాటు కావాలని కోరుకున్నారు. విభజన చట్టంలోని సెక్షన్‌ 94(3) ప్రకారం కొత్తగా ఏర్పడే రాజధానిలో రాజ్‌భవన్‌, సచివాలయం, శాసనసభ, శాసనమండలి, హైకోర్టు తదితర నిర్మాణాల కోసం కేంద్రం ఆర్థిక సహాయం చేయాలి. ఆ చట్టంలో ఒక రాజధాని గురించే ప్రస్తావన ఉంది.

- ప్రభుత్వాలు మారుతుంటాయి. కానీ రాష్ట్రం మాత్రం స్థిరంగా ఉంటుంది. ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధాని మార్చడానికి వీల్లేదు. మూడు రాజధానుల నిర్ణయం.. రాజధాని అమరావతి మాస్టర్‌ ప్లాన్‌ను హతమార్చడమే. మాస్టర్‌ ప్లాన్‌ అమలు చేయకపోతే అమరావతి ఆత్మను తీసేసినట్లే.

- నిర్దిష్ట సమయంలో రాజధానిని నిర్మిస్తామని భూములు తీసుకునేటప్పుడు చెప్పారు. ఆ ప్రకారం వ్యవహరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఇప్పుడు మూడు రాజధానులు ఏర్పాటు చేయడమంటే అమరావతికి భూములిచ్చిన రైతులకు ఇచ్చిన హామీని ఉల్లంఘించడమే. రాజధాని అభివృద్ధిలో ప్రజలను, రైతులను భాగస్వాములను చేయాలన్న ఉద్దేశంతో నాటి ప్రభుత్వం భూసమీకరణ విధానాన్ని ప్రవేశపెట్టింది.

- భూమి ఇచ్చినందుకు బదులుగా అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తామని ప్రభుత్వం రైతులకు హామీ ఇచ్చింది. రాష్ట్ర ప్రయోజనం కోసం రైతులు తమ జీవనాధారమైన 33,771 ఎకరాల భూమిని త్యాగం చేశారు. భూములిచ్చిన 29,754 మంది రైతుల్లో 26,700 మంది చిన్న రైతులే.

- భూసమీకరణ పథకం చట్టబద్ధమైనది. దానిని విస్మరించడానికి వీల్లేదు. మూడు రాజధానులు ఏర్పాటు ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం అని చెప్పి రైతులకు ఇచ్చిన హామీని విస్మరించడానికి వీల్లేదు. మాస్టర్‌ ప్లాన్‌ అనేది చట్టబద్ధమైన డాక్యుమెంట్‌. నిపుణుల ఆధ్వర్యంలో శాస్త్రీయంగా, ఎంతో వివరణాత్మకంగా దానిని రూపొందించారు. అందులోని వివరాలను ఆధారంగా చేసుకుని రైతులు భూసమీకరణ కింద తమ పొలాలను ప్రభుత్వానికి ఇచ్చారు.

- కీలకమైన వ్యవస్థలన్నింటినీ వేరే ప్రాంతానికి తరలించడం ద్వారా ప్రభుత్వం మాస్టర్‌ప్లాన్‌ను దెబ్బతీసింది. దీంతో భూముల మార్కెట్‌ విలువ ఒక్కసారిగా కుప్పకూలింది. రైతులకు అందాల్సిన ఆర్థిక ప్రయోజనాలను పూర్తిగా దెబ్బతీసింది.

- 2019లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ మూడు రాజధానుల ఏర్పాటు అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఇందుకోసం పలు కమిటీలు వేసింది. తమకు నచ్చినట్లు చట్టం చేసి చట్టబద్ధత కల్పించే ప్రయత్నం చేసింది. రాజధాని అమరావతిలో రూ.5,674 కోట్లు విలువ చేసే పనులు పూర్తయ్యాయి. వాటన్నిటినీ ఈ ప్రభుత్వం విస్మరించింది.

వివిధ ప్రాజెక్టు పనులు ఎక్కడికక్కడ వదిలేసింది. ఉద్దేశపూర్వకంగా రాజధాని అమరావతిని ఘోస్ట్‌ సిటీగా మార్చేసింది. తాజా వైఖరితో అమరావతి అభివృద్ధికి నిధులు ఇస్తున్న ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు ప్రాజెక్టు నుంచి వైదొలిగాయి.