Begin typing your search above and press return to search.

పవన్ కళ్యాణ్ కు భారీ షాక్ ఇచ్చిన అమిత్ షా

By:  Tupaki Desk   |   4 March 2020 5:15 PM IST
పవన్ కళ్యాణ్ కు భారీ షాక్ ఇచ్చిన అమిత్ షా
X
దేశ రాజధాని ఢిల్లీ నివురుగప్పిన నిప్పులా ఉంది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా అల్లర్లు చెలరేగాయి. దాదాపు 50మంది వరకూ చనిపోయారు. దీంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా అనవసరంగా ఈ వివాదాస్పద తేనెతుట్టను కదుపవద్దని డిసైడ్ అయ్యారు. అందుకే తాజాగా జనసేనాని పవన్ కళ్యాణ్ కు షాకిచ్చినట్టు తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ తో కలిసి కేంద్ర హోంమంత్రి అమిత్ షా సీఏఏకు అనుకూలంగా హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో మార్చి 15న భారీ సభను ఏర్పాటు చేశారు. పవన్, అమిత్ షా పాల్గొనే ఈ సభ తెలుగు రాష్ట్రాల్లో హీట్ పెంచింది. ఇది సీఏఏ అనుకూల సభ కావడంతో దేశవ్యాప్తంగా దీనిపై ఫోకస్ నెలకొంది. జనసేన, బీజేపీ స్నేహంలో కొనసాగుతున్న ఈ సభతో పవన్ కళ్యాణ్ పాపులారిటీ పెరుగుతుందని అందరూ భావించారు.

వివాదాస్పద సీఏఏపై ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ కామెంట్ చేసినా అది అగ్గిరాజేయడం ఖాయం. ఢిల్లీలో బీజేపీ నేతల వ్యాఖ్యల నేపథ్యంలోనే అంత ఘోరం జరిగింది. ఈ నేపథ్యంలోనే అమిత్ షా ఈ సభను తాజాగా రద్దు చేసుకున్నట్టు తెలిసింది.

ఇక ఓ వైపు పార్లమెంట్ సమావేశాల్లో సీఏఏ రచ్చ కొనసాగుతుండడం.. మరో వైపు హైదరాబాద్లోనే కరోనా వైరస్ వెలుగుచూడడంతో ఇలా రెండు కారణాలతో అమిత్ షా సభను రద్దు చేసుకున్నట్టు తెలిసింది. ఈ మేరకు రాష్ట్ర బీజేపీ నేతలకు సమాచారం అందించారట..

ఈ సభ ద్వారా తన పరపతి, మైలేజ్ నిరూపించుకుందామనుకున్న జనసేనాని పవన్ కు అమిత్ షా రాకపోవడం శరాఘాతంగా మారింది. సీఏఏ, కరోనా వైరస్ పవన్ కలలకు అడ్డం పడ్డాయన్న చర్చ సాగుతోంది.