Begin typing your search above and press return to search.

బీహార్ లో నన్ను రేప్ చేసి చంపేసేవారేమో! అమీషా పటేల్

By:  Tupaki Desk   |   28 Oct 2020 5:55 PM GMT
బీహార్ లో నన్ను రేప్ చేసి చంపేసేవారేమో! అమీషా పటేల్
X
బీహార్ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన బాలీవుడ్ నటి అమీషా పటేల్ కు చేదు అనుభవం ఎదురైంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఎల్జేపీ అభ్యర్థి కోసం అమీషా పటేల్ ప్రచారానికి వెళ్లింది. ఈ క్రమంలోనే బెదిరింపులకు, బ్లాక్ మెయిల్ కు అమీషా గురైంది.

తాను ప్రచారానికి వెళ్లిన అభ్యర్థి అమీషాను బెదిరించడం సంచలనమైంది. అమీషా చేసిన ఆరోపణలను ఎల్జేపీ నేత ఖండించడంతో ఈ అంశం వివాదంగా మారింది. ఈ వివాదానికి సంబంధించిన ఆడియో టేప్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

ఎల్జేపీ అభ్యర్థి ప్రకాష్ చంద్ర అనే అభ్యర్థి కోసం అమీషా పటేల్ ప్రచారం చేపట్టింది. అయితే ప్రచారంలో ప్రకాష్ చంద్ర తనతో దురుసుగా వ్యవహరించాడని అమీషా ఆరోపించింది. బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడని.. తేడాగా ప్రవర్తించడంతో నాకు భయం కలిగిందని అమీషా పటేల్ ఆరోపించింది.

బీహార్ ప్రచారంలో ఎప్పుడు ఎవరు రేప్ చేస్తారో? ఎవరు చంపేస్తారనే భయంతో వణికిపోయాను.. నా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ముంబైకి తిరిగి వచ్చాను అంటూ అమీషా పటేల్ చెప్పినట్టు ఓ ఆడియో టేప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. నా టీమ్ వెంట ఉండి కాపాడారని.. మరో అవకాశం లేకపోవడంతో సురక్షితంగా బయటపడి ముంబైకి చేరుకున్నానని వివరించింది. ఈ వీడియో ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది.

ముంబైకి వచ్చినా తనకు బెదిరింపు కాల్స్, మెసేజ్ లు పంపిస్తూ వేధిస్తున్నారని అమీషా పటేల్ వాపోయింది. బీహార్ పర్యటన తనకు ఓ కాళరాత్రిగా మారిందని ఆరోపించింది.

అయితే అమీషా పటేల్ ఆరోపణలను ఎల్జేపీ అభ్యర్థి ప్రకాష్ చంద్ర ఖండించారు. ఆమెకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పించామని.. పప్పు యాదవ్ వద్ద డబ్బు తీసుకొని తప్పుడు ఆరోపణలు చేస్తోందని ప్రకాష్ చంద్ర మండిపడ్డారు.